సుదీప్ కిచ్చకు జిషు సేన్గుప్తా పాదాభివందనం.. హృదయాలను గెలుచుకొన్న బెంగాల్ టైగర్.. అసలేం జరిగిందంటే?
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) 2024 ఘనంగా ముగిసింది. గత 10 సీజన్లలో ఎన్నడూ లేని విధంగా సంచలనాలు నమోదు అయ్యాయి. అండర్ డాగ్గా బరిలోకి దిగిన బెంగాల్ టైగర్స్ జట్టు సంచలన విజయాన్ని అందుకొన్నది. ఇప్పటికే నాలుగుసార్లు టైటిల్ గెలిచిన తెలుగు వారియర్స్ జట్టు, రెండుసార్లు టైటిల్ గెలిచిన కర్ణాటక బుల్డోజర్స్ జట్టును పక్కకు నెట్టి కెప్టెన్ జిషు సేన్గుప్తా టీమ్ ఛాంపియన్గా అవతరించింది. అయితే బలమైన సుదీప్ కిచ్చ జట్టుపై గెలిచిన తర్వాత జిషు భావోద్వేగానికి గురైన వివరాల్లోకి వెళితే..
టాస్ గెలిచిన బెంగాల్ టైగర్ జట్టు బ్యాటింగ్ ఎంచుకొని తొలి ఇన్నింగ్స్లో నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటక జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. దాంతో జిషు సేన్ జట్టుకు 32 పరుగులు అధిక్యం లభించింది. దాంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన బెంగాల్ టైగర్స్ ధాటిగా ఆడి 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది.

దాంతో కర్ణాటక జట్టు ముందు 138 పరుగుల భారీ లక్ష్యం పెట్టింది. అయితే సుదీప్ కిచ్చ జట్టు ఆటగాళ్లు సుడిగాలి ఇన్నింగ్స్ ఆడటంతో గెలుపు దక్కుతుందని అనుకొన్నారు. కానీ మిడిల్ ఆర్డర్లో వికెట్లు వెంటవెంటనే కోల్పోవడంతో 6 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో 13 పరుగుల తేడాతో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 ట్రోఫిని చేజిక్కించుకొన్నది.
అత్యంత ఉత్కంఠగా సాగిన సీసీఎల్ ఫైనల్ మ్యాచ్ అనంతరం కెప్టెన్ జిషు సేన్ గుప్తా ఎమోషనల్ అయ్యాడు. కన్నడ జట్టు కెప్టెన్ సుదీప్ కిచ్చ వద్దకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించాడు. గురువుగా భావించి చేతులెత్తి నమస్కరించాడు. దాంతో సుదీప్ కూడా భావోద్వేగానికి లోనయ్యాడు. జిషు భుజం తట్టి విజయం సాధించినందుకు అభినందించాడు. ఈ సన్నివేశం అందర్నీ ఆకట్టుకొన్నది.

రన్నర్ ట్రోఫిని అందుకొన్న తర్వాత సుదీప్ కిచ్చ మాట్లాడుతూ.. గెలుపు ఓటములు సహజం. కానీ మైదానంలో దిగిన తర్వాత క్యారెక్టర్ చాలా ముఖ్యం. ఆటలో గెలువాలనే లక్ష్యంతో తమ క్యారెక్టర్ను కోల్పోకూడదని నేను పదే పదే జట్టు సభ్యులకు చెప్పాను. నా జట్టు సభ్యులు అదే ఆచరించి అందరికి స్పూర్తిగా నిలిచారు. ఓడినా గెలిచినా నా జట్టు సభ్యులు బుల్డోజర్స్ అని నిరూపించారు. తొలిసారి ఫైనల్కు చేరి కప్ సాధించిన బెంగాల్ టైగర్స్ జట్టు 100 శాతం ఈ గెలుపుకు అర్హులు అని అన్నారు.
విజయానందంలో జిషు సేన్గుప్తా ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఆనందంలో ఏం మాట్లాడాలో అర్ధం కావడం లేదు. గత 9 సంవత్సరాలుగా కింద నుంచి 10 స్థానంలోను, 9 స్థానంలో నిలిచే వాళ్లం. ఈ సంవత్సరం యువకులు రావడంతో ఉత్సాహం ఉరకలేసింది. తొలిసారి ఫైనల్కు చేరిన తర్వాత ఎలాగైనా జట్టు సభ్యులు గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేశారు. తమ కలను పట్టుదలతో సాకారం చేసుకొన్నారు అని జిషూ చెప్పారు.

జిషు సేన్ గుప్తా విషయానికి వస్తే..ఆయన తెలుగు ప్రేక్షకులకు అత్యంత సుపరిచితులు. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆ చిత్రంలో ఎల్వీ ప్రసాద్ పాత్రలో నటించాడు. ఆ తర్వాత అశ్వత్తామ, మేస్ట్రో, శ్యామ్ సింగరాయ్, సీతారామం, స్పై, టైగర్ నాగేశ్వరరావు, సైంధవ్ చిత్రాల్లో నటించి మెప్పించారు.


Click it and Unblock the Notifications











