బుల్లెట్ ప్రకాశ్ ఆకస్మిక మరణం.. విషాదంలో చిత్రపరిశ్రమ
కన్నడ నటుడు బుల్లెట్ ప్రకాశ్ ఇకలేరు. గత కొద్దికాలంగా లివర్ ఇన్ఫెక్షన్, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణంతో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఇటీవల బెంగళూరులోని హాస్పిటల్లో చేర్పించాం. అయితే చికిత్స పొందుతున్న ఆయనకు మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. సోమవారం రాత్రి ఆకస్మికంగా మరణించారు. ఆయన వయసు 44 సంవత్సరాలు అని సన్నిహితులు తెలిపారు.
అనారోగ్యంతో బాధపడుతున్న బుల్లెట్ ప్రకాశ్ ఆరోగ్యాన్ని కోలుకొనే విధంగా మెరుగైన ట్రీట్మెంట్ను అందించాం. ఇటీవల ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. ఆయన ప్రాణాలు కాపాడేందుకు మా వంతు ప్రయత్నాలు చేశాం అని వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు. అనారోగ్యం కారణంగా బుల్లెట్ ప్రకాశ్ 35 కేజీల బరువు తగ్గారు. దాంతో గత మూడు నెలలుగా సినిమాలకు దూరమయ్యారు అని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

బుల్లెట్ ప్రకాశ్గా కన్నడ ప్రేక్షకులకు సుపరిచితులు. పలు సినిమాల్లో ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ నడుపుతూ కనించడంతో ఆయనకు ఆ పేరు వచ్చింది. కన్నడ పరిశ్రమలో రెండు దశాబ్దాలకుపైగా కాలంలో 300 చిత్రాల్లో నటించారు. ధరువ, పార్థ, ఓంకారా, అంబీ, మస్త్ మజా మాదీ లాంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. 2015లో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. కర్ణాటక బీజేపీలో చురుకుగా వ్యవహరించారు. అలాగే ఆయన బిగ్బాస్ కన్నడ వెర్షన్లో పాల్గొన్నాడు.


Click it and Unblock the Notifications











