పాకిస్థాన్ టెర్రరిస్టులా? థియేటర్లో జాతీయ గీతానికి అగౌరవం.. ప్రేక్షకులపై హీరో, హీరోయన్ల ఫైర్
Recommended Video
కన్నడ నటీనటులు బీవీ ఐశ్వర్య, అరుణ్ గౌడ తమ జాతీయ భక్తిని ప్రదర్శించారు. సినిమా థియేటర్లో మూవీ ప్రారంభానికి ముందు జాతీయ గీతానికి వందనం సమర్పించలేదనే కారణంతో ప్రేక్షకులను థియేటర్ నుంచి బయటకు పంపించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రేక్షకులు అభ్యంతరం చెప్పడంతో ఐశ్వర్య, అరుణ్ గౌడ సమాధానం చెప్పే క్రమంలో గలాటా చోటుచేసుకొన్నది. దాంతో ఆగ్రహించిన సినీతారలు.. ప్రేక్షకులను బయటకు బలవంతంగా పంపించి వేసిన వీడియో వైరల్గా మారింది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వార్త వివారాల్లోకి వెళితే..

అసురన్ సినిమా ప్రదర్శన సందర్భంగా
బెంగళూరులోని మల్లేశ్వరం ఓరియన్ మాల్ పీవీఆర్లో ఈ సంఘటన అక్టోబర్ 23వ తేదీన జరిగింది. కన్నడ నటీనటులు బీవీ ఐశ్వర్య, అరుణ్ గౌడ అసురన్ సినిమా చూడటానికి వెళ్లారు. ఆ క్రమంలో ఈ వివాదం చోటుచేసుకొన్నది. సినిమాకు ముందు ప్రదర్శించిన జాతీయ గీతం సమయంలో తమ కుటుంబంతో వచ్చిన కొందరు సీట్లలోనే కూర్చొని ఉన్నారు. దాంతో వారిని లేచి నిలబడి వందనం సమర్పించాలని సూచించారు. దాంతో ప్రేక్షకులకు, స్టార్లకు మధ్య భారీ గొడవకు దారి తీసింది.

లేచి నిలబడాలని తెలియదా?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. జాతీయ గీతం వస్తున్న సమయంలో లేచి నిలబడాలని తెలియదా? అంటూ బీవీ ఐశ్వర్య ప్రశ్నించారు. ఆ సమయంలో అరుణ్ గౌడ మొబైల్ ఫోన్లో షూట్ చేశారు. అయితే వారు తమపై పోలీసులకు ఫిర్యాదు చేసుకోండి అంటూ జవాబిచ్చారు. దాంతో మూడు గంటల సినిమా కోసం కూర్చుంటారు కానీ.. 52 సెకన్ల జాతీయ గీతం కోసం నిలబడలేరా అంటూ సినీ నటులు నిలదీయడం కనిపించింది. దాంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకొన్నది.
పాకిస్థాన్ టెర్రరిస్టులా?
సినీ తారలకు, ప్రేక్షకుల మధ్య జరిగిన వాగ్వాదం పెరిగిపోవడం.. ప్రేక్షకులను ఉద్దేశించి మీరు పాకిస్థాన్ టెర్రరిస్టులా? అంటూ యాక్టర్లు ప్రశ్నించడం ఈ వీడియోలో కనిపించింది. అంతేకాకుండా జాతీయ గీతాన్ని గౌరవించలేని మీకు థియేటర్లో ఉండటం అవసరమా అంటూ వారిని బయటకు నెట్టేసే ప్రయత్నం చేశారు. బీవీ ఐశ్వర్య, అరుణ్ గౌడ నుంచి తీవ్ర ప్రతి ఘటన రావడంతో వారు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొందరు అభ్యంతరకరంగా
అనంతరం అరుణ్ గౌడ మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ గీతం వస్తున్న సమయంలో కొందరు ప్రేక్షకులు వారి మొబైల్ ఫోన్లతో ఆడుతూ కనిపించడం నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ముందు కుర్చీలకు కాళ్లు పెట్టి కూర్చొన్నారు. జాతీయ గీతానికి అగౌరవం కలిగిందనే భావనతో వారిని నేను మందలించాను. ఇలాంటి చర్యలను ఎవరూ కూడా భరించకూడదు అని అన్నారు.

ఎలాంటి ఫిర్యాదు అందలేదు..
అయితే జాతీయ గీతానికి అగౌరవం కలిగించిన ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని డీసీపీ నార్త్ ఎన్ శశికుమార్ మీడియాకు తెలిపారు. వీడియోను చూసి అందులోని వారిని పిలిపించి ఘటన వివరాలు తెలుసుకొంటాం. అసలు ఆ సమయంలో ఏం జరిగిందనే విషయంపై సమాచారం తీసుకొని చర్యలు తీసుకొంటాం. ప్రివెన్షన్ ఆఫ్ నేషనల్ హానర్స్ యాక్ట్ ప్రకారం ఎదైనా అగౌరవం జరిగితే అందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకొంటాం అని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











