కొన్నాళ్ళ క్రితమే భార్య మృతి.. ఇంతలోనే యువనటుడు దారుణ హత్య!
కన్నడ సినీ పరిశ్రమకు చెందిన యువ నటుడు అనూహ్యంగా హత్యకు గురి కావడం కన్నడ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాల మీద ఆసక్తితో ఒక పక్క యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన సతీష్ వజ్ర అనే వ్యక్తిని అతని సొంత బావమరిది పొడిచి చంపడం కలకలం రేపింది. రోజుల క్రితం సతీష్ భార్య మృతి చెందగా ఇప్పుడు సతీష్ హత్యకు గురికావడం శాండల్ వుడ్ లో కలకలం రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

సినిమాల కోసం
సతీష్ వజ్ర అనే వ్యక్తి మాండ్యా అనే ప్రాంతం నుంచి బెంగళూరుకు వచ్చి సినిమాల కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఒకపక్క బతుకుతెరువు ఉండాలనే ఉద్దేశ్యంతో ఒక సెలూన్ షాప్ కూడా పెట్టుకున్నాడు. ఆయన సెలూన్ కి మంచి పేరు రావడంతో ఎక్కువగా సినీ నటులు వస్తూ ఉండేవారు. అలా వారితో ఏర్పడిన పరిచయాలతో ఆయన లగోరి అనే ఒక సినిమాలో నటించే అవకాశం కూడా దక్కించుకున్నాడు.

పథకం ప్రకారం
ప్రస్తుతానికి ఆ సినిమా ఒకటే చేసినా యూట్యూబ్ ద్వారా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సతీష్. కొద్ది రోజుల క్రితం సతీష్ భార్య అనారోగ్య కారణాలతో కన్నుమూసినట్లు తెలుస్తోంది. అయితే ఆమె అనారోగ్య కారణాలతో కన్నుమూయడానికి కారణం సతీష్ అని భావించిన సతీష్ బావమరిది సుదర్శన్ సతీష్ ను పథకం ప్రకారం చంపేసినట్లు తెలుస్తోంది.

రక్తపుమడుగులో
సతీష్ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ కి వెళ్ళిన సుదర్శన్ సతీష్ గొంతు కోసి కత్తితో కడుపులో చాలా చోట్ల పొడిచి చంపినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ముందు ఎవరూ పసిగట్ట లేదు కానీ సతీష్ పక్కింటి వ్యక్తి సతీష్ ఇంటి బయట రక్తపు మరకలు ఉండడం చూసి ఇంటి యజమానికి సమాచారం ఇచ్చారు. ఎంత సేపు తలుపు కొడుతున్నా ఆ తలుపు తీయకపోవడంతో ఏదో జరగరానిది జరిగింది అనే ఉద్దేశంతో ఇంటి స్పేర్ కీ తో ఆ ఇంటిని ఓపెన్ చేసి చూడడంతో అక్కడ రక్తపుమడుగులో సతీష్ పడి ఉన్నాడు.

పగ పెంచుకున్నాడని
దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన ఆ ఇంటి యజమాని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేశారు. అయితే హాస్పిటల్ కి తరలించే నాటికి సతీష్ పరిస్థితి విషమించింది.
హాస్పిటల్ కి తరలించిన తర్వాత మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం చేసినా సతీష్ ప్రాణాలు దక్కలేదు. తన సోదరి మరణానికి కారణం సతీష్ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే, ఆమెకు సకాలంలో వైద్యం అందక పోవడమే అని భావించిన సతీష్ బావమరిది సుదర్శన్ సతీష్ మీద పగ పెంచుకున్నాడని పోలీసులు గుర్తించారు.

కేసు నమోదు చేసి
ఈ నేపథ్యంలోనే పథకం ప్రకారం తన మరో బంధువు అయిన నాగరాజు అనే వ్యక్తి తో కలిసి వెళ్లి సతీష్ ని దారుణంగా చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి పోలీసులు సుదర్శన్ అలాగే నాగరాజుని అదుపులోకి తీసుకుని ఈ విషయం మీద ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











