కన్నడ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ కలకలం.. పోలీసుల అదుపులో హీరోయిన్ రాగిణి ద్వివేది
డ్రగ్స్ సప్లయిదారులతో రాగిణి ద్వివేదికి సంబంధాలున్నాయనే ఆరోపణలపై బెంగళూరు పోలీసులు గురువారం సమన్లు జారీ చేశారు. రాగిణితోపాటు ఆమె స్నేహితుడైన ఓ ప్రభుత్వ ఉద్యోగి రాహుల్ను విచారణకు హాజరుకావాలని కూడా సమన్లు అందించారు. శుక్రవారం ఛామ్రాజ్పేట్లోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు. అయితే తాను సోమవారం వరకు విచారణకు హాజరుకాలేని నా తరఫున లాయర్ హాజరవుతారు అని రాగిణి ఓ ప్రకటన చేసింది. అయితే రాగిణి చేసిన ప్రకటనకు విరుద్ధంగా ఆమెకు పోలీసులు చుక్కలు చూపించారు. శుక్రవారం ఉదయమే ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు.
బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తమ సోదాల అనంతరం రాగిణి ద్వివేదిని అదుపులోకి తీసుకొన్నారు. ఆమెను క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి తరలిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో డ్రగ్స్ వ్యవహారంలో సినీ తారలపై ఉక్కుపాదం మోపేందుకు బెంగళూరు పోలీసులు సంకేతాలిచ్చారు.
గురువారం బెంగళూరు పోలీసులు జారీ చేసిన సమన్లపై నటి రాగిణి ద్వివేది సోషల్ మీడియా ద్వారా స్పందించారు. పోలీసులు జారీ చేసిన నోటీసులు నాకు అందాయి. కొన్ని కారణాల వల్ల సీసీడీ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. చట్టాలపై నాకు గౌరవం ఉంది. సోమవారం వరకు నా తరఫున లాయర్లు విచారణకు హాజరవుతారు. ఈ కేసులో నేను సోమవారం పోలీసుల ముందు హాజరవుతాను అని రాగిణి స్పష్టం చేశారు. అయితే ఆమె రిక్వెస్ట్ను బేఖాతరు చేసి బెంగళూరు పోలీసుల కొరడా ఝలిపించడం ఇప్పుడు కన్నడ పరిశ్రమలో సంచలనంగా మారింది.

ఇప్పటికే డ్రగ్స్ కేసు వ్యవహారంలో హీరోయిన్ సంజనా స్నేహితుడు, మేనేజర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకు కూడా సమన్లు జారీ చేసేందుకు సిద్దమవుతున్నారు.


Click it and Unblock the Notifications











