ఓ చేతిలో కాఫీ , మరో చేతిలో సిగరెట్.. సెంట్రల్ జైల్లో స్టార్ హీరోకు రాజభోగాలు, సర్కార్ సీరియస్
మనదేశంలో వివిధ నేరాలకు జైలు శిక్ష అనుభవించే వీఐపీలు తక్కువే. చాలా వరకు రాజీమార్గం ద్వారానో లేదంటే కోర్టులను ఆశ్రయించో తప్పించుకోవాలని సవాలక్ష మార్గాలు వెతుకుతూ ఉంటారు. తప్పనిసరి పరిస్ధితుల్లో జైలు శిక్ష పడినా అక్కడ వీఐపీ ఖైదీగా రాచమర్యాదలు అనుభవిస్తుంటారు. తమకున్న పలుకుబడితో ఇంట్లో దొరికే సమస్త సదుపాయాలను జైల్లోనూ అనుభవిస్తుంటారు. భారతీయ జైళ్లలోని ఈ పరిణామాలపై పలుమార్లు న్యాయస్థానాలు మొట్టికాయలు వేసినా పరిస్ధితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు.
తాజాగా కన్నడ స్టార్ హీరో దర్శన్ వ్యవహారం మనదేశంలోని జైళ్లో వీఐపీ ఖైదీలకు లభిస్తున్న ట్రీట్మెంట్పై చర్చకు దారితీసింది. ఛాలెంజింగ్ స్టార్గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే దర్శన్ స్వయంగా తన వీరాభిమానినే హత్య చేసి జైలుకెళ్లడం భారతీయ చిత్ర పరిశ్రమలోనే సంచలనం సృష్టించింది. తనతో సహజీవనం చేస్తోన్న పవిత్ర గౌడ అనే మహిళను వేధిస్తోన్న రేణుకా స్వామి అనే తన అభిమానిని అత్యంత పాశవికంగా హతమార్చడం, మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నించడం తదితర అభియోగాలపై దర్శన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్ కస్టడీలో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో దర్శన్ ఖైదీగా ఉన్నారు. పలుమార్లు ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్ట్ తిరస్కరించింది. హత్య కేసులో సాక్ష్యాధారాలు నాశనం చేసేందుకు నిందితులు తీవ్రంగా ప్రయత్నించారని, అలాంటిది వీరికి బెయిల్ వస్తే విచారణకు ఆటంకం కలిగిస్తారని పోలీసులు కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలపై ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ తిరస్కరించారు. ఈ పరిణామాలతో మా హీరో అసలు బయటకు వస్తారా.. లేదంటే సెంట్రల్ జైలుకే పరిమితం అవుతారా అంటూ దర్శన్ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఇక జైల్లో దర్శన్కు రాచమర్యాదలు లభిస్తున్నాయి. ఇటీవల ఆయన ఓ వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడిన వ్యవహారం కలకలం రేపింది. సదరు వీడియోలో దర్శన్ మంచి గదిలో కూర్చొని ఉండగా, ఆయన వెనకాల కిటికికీ పరదాలు వేలాడదీసి ఉన్నాయి. జైల్లో ఉన్న దర్శన్ చేతికి ఫోన్ ఎలా అందింది.. ఎవరు చేరవేశారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ గొడవ సద్దుమణగముందే.. జైలు ఆవరణలో పలువురితో ముచ్చటిస్తూ కాఫీ , సిగరెట్ తాగుతూ రిలాక్స్ అవుతోన్న దర్శన్ ఫోటో వైరల్ అయ్యింది. ఓ రౌడీషీటర్ దర్శన్ ఫోటోను తీసి దానిని జైలు బయట ఉన్న భార్యకి పంపడంతో ఈ విషయం వెలుగు చూసింది.

ఈ పరిణామాలతో రేణుకాస్వామి తండ్రి తీవ్రంగా విలపించారు. తన బిడ్డను దారుణంగా చంపిన నిందితుడికి జైల్లో సకల సౌకర్యాలు లభిస్తుండటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దర్శన్కు రాచమర్యాదలు చేసిన ఏడుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేసింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని , దీనిని భద్రతా లోపంగా పేర్కొన్నారు కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర. మొత్తానికి దర్శన్ వ్యవహారం కన్నడ సినీ , రాజకీయ వర్గాలకు తలనొప్పులు తెచ్చిపెట్టింది.


Click it and Unblock the Notifications











