Kasthuri Shankar: బుల్లితెర నటి ఏ క్షణమైనా అరెస్ట్? రంగంలోకి పోలీసులు!
తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ హీరోయిన్ , బుల్లితెర నటి కస్తూరి శంకర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా కస్తూరి పరారీలో ఉన్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. క్షమాపణలు చెప్పినా తెలుగు, తమిళ సంఘాలు దిగి రాకపోవడంతో ఆమెకు పాలుపోవడం లేదు. తాజాగా కస్తూరికి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ వివరాల్లోకి వెళితే..
ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో కస్తూరి శంకర్ మాట్లాడుతూ.. పూనకం వచ్చినట్లుగా ఊగిపోయారు. తమిళనాడులో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించే క్రమంలో ఆమె తెలుగు జాతిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 300 ఏళ్ల క్రితం తమిళనాడులోని రాజుల వద్ద అంత: పుర మహిళలకి సేవ చేయడానికి తెలుగువారు ఈ ప్రాంతానికి వలస వచ్చి స్థిరపడ్డారని కామెంట్ చేశారు. వారంతా శతాబ్ధాలుగా స్థిరపడిన బ్రాహ్మణులేనని, ఇప్పుడు వారిని తమిళులు కాదని ఎలా చెబుతారని కస్తూరి ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలుగు , తమిళ సంఘాలు మండిపడుతున్నాయి.

డీఎంకేలోని తెలుగు మూలాలున్న మంత్రులు, నేతలను టార్గెట్ చేసే క్రమంలో కస్తూరి ఇలా నోరు జారడంతో చిక్కుల్లో పడ్డారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తెలుగు నా మెట్టినిల్లు.. తెలుగు వారంతా నా కుటుంబమని , తాను చేసిన వ్యాఖ్యలను డీఎంకే నేతలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని కస్తూరి ఆరోపించారు. ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని తెలుగు మీడియాకు కస్తూరి శంకర్ విజ్ఞప్తి చేశారు.
అయినప్పటికీ కస్తూరిపై ట్రోలింగ్ ఆగలేదు .. దీంతో మరోసారి ఆమె వివరణ ఇచ్చారు. తాను కొందరి గురించే చెప్పానని, మొత్తం తెలుగు ప్రజల గురించి కాదని కస్తూరి వివరణ ఇచ్చారు. ఎవరైనా తన వ్యాఖ్యలతో బాధపడి ఉంటే చింతిస్తున్నానని తెలిపారు. అయినప్పటికీ తెలుగు, తమిళ నేతలు తగ్గడం లేదు. చెన్నై ఎగ్మూర్ పోలీస్ స్టేషన్లో కస్తూరి శంకర్పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఈ కేసు విచారణకు హాజరవ్వాల్సిందిగా పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేసేందుకు వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉందని, ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు గాను మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్లో కస్తూరి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా న్యాయస్థానం మండిపడింది. తెలుగువారిని తమిళనాడులో వలస వచ్చిన వారిగా చూడలేమని.. తెలుగు, తమిళ ప్రజలు రాష్ట్రంలో వేర్వేరు కాదని వ్యాఖ్యానించిన ధర్మాసనం బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో ఏ క్షణంలోనైనా కస్తూరి అరెస్ట్ అవుతారంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











