నడుము గిల్లడం కళాఖండమా? బాలీవుడ్ కు రిషబ్ శెట్టి కౌంటర్.. ఆ వీడియోతో నెటిజన్ల రివెంజ్
ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్.. బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమా అన్నట్లుగా ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమనే రూల్ చేశారు హిందీ జనాలు. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్, బ్రాండ్ ఎండార్స్మెంట్స్, జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీ.. ఈ వైభవంతో కళ్లు నెత్తికెక్కి ఇతర ప్రాంతీయ భాషా చిత్రాలను చిన్నచూపు చూసేవాళ్లు. ఎప్పుడైతే బాహుబలితో రాజమౌళి పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ చేశారో నాటి నుంచి బాలీవుడ్ కోటకు బీటలు వారడం మొదలైంది.
బాహుబలి వేసిన బాటలో కాంతారా, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, కార్తీకేయ -2, హనుమాన్, సలార్ తదితర సినిమాలు హిందీలో వసూళ్ల వర్షం కురిపించాయి. సౌత్ సినిమాల ధాటికి ఖాన్ త్రయం, ఇతర బాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలు అడ్రస్ లేకుండా పోయాయి. కమర్షియల్, మాస్ మసాలా ఎలిమెంట్స్తో వచ్చే దక్షిణాది చిత్రాలు హిందీ బెల్ట్లో బాగా పాపులర్ అయ్యాయి. మన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్స్ బేస్ సైతం తయారైంది. సౌత్ నుంచి ఏ సినిమా వచ్చినా హిట్ అయ్యే పరిస్ధితి నెలకొనడంతో బాలీవుడ్ మేకర్స్కు ఏం చేయాలో, ఎలా తీయాలో అర్ధం కాక తలబాదుకున్నారు.

ఆర్ఆర్ఆర్ , కల్కి సినిమాల జైత్రయాత్ర, ఆస్కార్ అవార్డ్ సైతం వరించడంతో ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్.. టాలీవుడ్ అంటే భారతీయ సినిమా అన్నట్లుగా పరిస్ధితి తయారైంది. దీంతో బాలీవుడ్ స్టార్ హీరోలు తెలుగులోనూ, ఇతర దక్షిణాది భాషల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. తమ పరిస్ధితిని ఇంతగా దిగజార్చిన టాలీవుడ్పై హిందీ వాళ్లు రగిలిపోతున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగు ఇతర దక్షిణాది నటులను హేళనగా మాట్లాడుతున్నారు. రెండ్రోజుల క్రితం ప్రభాస్ను బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ జోకర్ అని పిలవడం పెద్ద దుమారం రేపి, ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఇదిలాఉండగా.. కాంతారతో దేశం దృష్టిని ఆకర్షించారు కన్నడ నటుడు రిషబ్ శెట్టి. భూతకోల, కంబల అని పిలిచే అసలు సిసలు కర్ణాటక సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశారు. సప్తమి గౌడ, కిశోర్, అచ్యుత్ కుమార్ తదితరులు కీలకపాత్రలు పోషించగా రూ. 16 కోట్ల బడ్జెట్తో చిన్న సినిమాగా తెరకెక్కిన కాంతారా .. ఏకంగా రూ.450 కోట్లకు పైగా వసూళ్లతో కళ్లు చెదిరే లాభాలను తెచ్చిపెట్టింది. కేజీఎఫ్తో కన్నడ సినిమా సత్తాను దేశానికి చాటిన ప్రశాంత్ నీల్ బాటలోనే రిషబ్ శెట్టి సైతం నడిచాడు. ఈ చిత్రంలో నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును సైతం ఆయన కైవసం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్పై రిషబ్ శెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని హిందీ చిత్రాలు భారతదేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయని.. గ్లోబల్ ఈవెంట్లకు ఆహ్వానించినప్పుడు తాను నా దేశం, నా రాష్ట్రం, నా భాష వంటి గురించి గొప్పగా చెప్పాలనుకుంటున్నట్లు రిషబ్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆయనను ట్రోలింగ్ చేస్తున్నారు. కాంతారాలో హీరోయిన్ను ఆమె పర్మిషన్ లేకుండా నడుము గిల్లడం తప్పుకాదా.. ఆర్ట్ అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ఆయనను బాలీవుడ్ ద్వేషి అని రిషబ్ మైండ్ హిపోక్రసితో నిండిపోయిందని దుయ్యబడుతున్నారు. రిషబ్ వ్యాఖ్యలపై హిందీ ఇండస్ట్రీ నుంచి ఇంకా ఎవరు స్పందించలేదు.. మరి ఈ వివాదం ఎటు తిరుగుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











