Puneeth Rajkumar మృతి వార్తను తట్టుకోలేక అభిమాని మృతి.. రాష్ట్రంలో మద్యపాన నిషేధం, అంత్యక్రియలు ఎప్పుడంటే?
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. నిన్నటి వరకు ఉత్సాహంగా, జోష్తో కనిపించిన అప్పు ఇక లేరంటే జీర్ణించుకోవడం కష్టంగా మారింది. కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు తమ పవర్ స్టార్ను కడసారి చూసేందుకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి పోటెత్తుతున్నారు. పునీత్ ఇకలేరనే వార్తను నమ్మలేనటువంటి పరిస్థితులు ఫ్యాన్స్లోను, సినీ వర్గాల్లోను కనిపిస్తున్నాయి. పునీత్ మృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్
పునీత్ రాజ్కుమార్ గుండెపోటు గురై ఇంట్లోనే కుప్పకూలడంతో వెంటనే ఆయను బెంగళూరులోని విక్రమ్ హాస్పిటల్కు తరలించారు. ఆ వార్త వినగానే అభిమానులు విక్రమ్ హాస్పిటల్కు పరుగుపెట్టారు. పునీత్ ఆరోగ్య పరిస్థితి విషమించిందనే విషయం బయటకు పొక్కగానే కన్నడ ప్రభుత్వం వెంటనే రాష్ట్రం మొత్తం భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. పలు ప్రాంతాల్లో బారికేడ్లు నిర్వహించి గస్తీ, పహారాను పెంచింది. గతంలో లెజెండ్ రాజ్కుమార్ మరణించిన సమయంలో అభిమానులు విధ్వంసానికి దిగడంతో ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది.

పునీత్ మరణం షాక్తో అభిమాని మృతి
అయితే పునీత్ రాజ్కుమార్ మరణ వార్తను విని తట్టుకోలేని అభిమాని గుండెపోటుతో మరణించాడు. పొన్నాచి తాలుకాలోని మరూరుకు చెందిన మునియప్ప మరణించడం మరో విషాదంగా మారింది. చిన్నతనం నుంచి పునీత్ను అమితంగా ఆరాధించే మునియప్ప తన స్టార్ హీరో మరణవార్తను వినగానే కుప్పకూలాడు. దాంతో ఆయనను సమీపంలోని ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మునియప్ప తుదిశ్వాస విడిచారు. మునియప్పకు ఓ ఏడాది వయసు ఉన్న కూతురు ఉంది అని అభిమానులు వెల్లడించారు.

కర్ణాటకలో మద్యపాన నిషేధం
ఇక పునీత్ రాజ్కుమార్ మరణవార్త వినగానే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు మద్యపాన నిషేధం విధించారు. నేటి నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మద్యం అమ్మకాలపై అంక్షలు విధించింది. అభిమానులు మద్యం మత్తుల్లో దాడులు, విధ్వంసానికి దిగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఇలాంటి నిర్ణయం తీసుకొన్నారు.

అధికారికంగా అంత్యక్రియలు
ఇక పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. కుటుంబ సభ్యుల అనుమతి మేరకు అప్పు అంత్యక్రియలు ఆదివారం అంటే అక్టోబర్ 31వ తేదీన అభిమానులు, సినీ తారలు, సన్నిహితులు సమక్షంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Recommended Video

అక్టోబర్ 31న అంత్యక్రియలు
పునీత్ రాజ్కుమార్ అంత్యక్రియలు ఆలస్యంగా కావడానికి తన కూతురు అమెరికాలో ఉండటమే కారణమని సన్నిహితులు చెబుతున్నారు. తన పెద్ద కూతురు అమెరికాలో ఉన్నారు. ఆమె వచ్చిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకొన్నారు. అక్టోబర్ 30వ తేదీ మధ్యాహ్నం వరకు కూతురు చేరుకొనే అవకాశం ఉంది అని చెప్పారు.


Click it and Unblock the Notifications











