హీరోయిన్ సంజన గల్రానీ, రాగిణి ద్వివేదికి కోర్టు షాక్.. మరి కొన్నాళ్లు జైలులోనే..
కర్నాటకలో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్ కేసులో సినీ హీరోయిన్లు సంజన గల్రానీ, రాగిణి ద్వివేదికు చేదు అనుభవం ఎదురైంది. ఈ కేసులో రిమాండ్లో ఉన్న ఈ తారలు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేసుకోగా మరోసారి కోర్టు తిరస్కరించింది. దాంతో మరికొన్ని రోజులు సంజన, రాగిణి జైలు జీవితాన్ని గడపాల్సి రావడం గమనార్హం. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

డ్రగ్స్ రాకెట్ కేసులో అరెస్ట్
డ్రగ్ రాకెట్ కేసులో భాగంగా సెప్టెంబర్లో రాగిణి ద్వివేది, సంజన గల్రానీని బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి వారిద్దరూ జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నది. తప్పించుకు తిరుగుతున్న పలువురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

తప్పించుకు తిరుగుతున్న ప్రముఖులు
డ్రగ్ రాకెట్ కేసులో సినీ రాజకీయ ప్రముఖులు పేర్లు తెరపైకి వచ్చాయి. మాజీ మంత్రి జీవరాజ్ ఆల్వా కుమారుడు ఆదిత్య అల్వాకు సంబంధించిన ఆచూకీ ఇంకా లభ్యం కావడం లేదు. అలాగే సినీ నిర్మాత శివప్రకాశ్ అనే ప్రముఖుడు కూడా కనిపించకుండా పోయారు. ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

పరప్పనా అగ్రహార జైలులో
డ్రగ్స్ కేసులో సంజనా గల్రానీ, రాగిణి ద్వివేది బెంగళూరుకు సమీపంలో పరప్పనా అగ్రహార జైలులో ఉంటున్నారు. ఇటీవల పలుమార్లు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించిన ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఇటీవల చేసుకొన్న బెయిల్ దరఖాస్తును కూడా కోర్టు తిరస్కరించింది.

కేసు దర్యాప్తు నేపథ్యంలో బెయిల్ నిరాకరణ
డ్రగ్స్ రాకెట్ కేసులో సినీ హీరోయిన్లు రాగిణి, సంజన, నిర్మాత శివ ప్రకాశ్ చేసుకొన్న బెయిల్ పిటిషన్లను కోర్టు విచారించింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున రాగిణి, సంజనకు బెయిల్ ఇవ్వలేమంటూ జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ తన తీర్పులో పేర్కొన్నారు. అలాగే నిర్మాత శివ ప్రకాశ్ చేసుకొన్న ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించారు.


Click it and Unblock the Notifications











