RIP Legend: మలయాళ నటుడు, మాజీ ఎంపీ ఇన్నోసెంట్ మృతి!
ప్రముఖ మలయాళ సినీ నటుడు, లోక్ సభ మాజీ ఎంపీ ఇన్నోసెంట్ తుదిశ్వాస విడిచారు. 75 ఏళ్ల వయసు కల్గిన ఈయన... మార్చి 3వ తేదీ కేరళ, కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. కరోనా ఇన్ఫెక్షన్, శ్వాసకోశ వ్యాధులు, వివిధ అవయవాల వైఫల్యం వల్ల ఇన్నోసెంట్.. ఆదివారం రాత్రి 10.30 గంటలకు మరణించారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
అయితే మృతి సమయంలో ఇన్నోసెంట్ కార్డియోపల్మోనరీ సపోర్ట్లో ఉన్నారని వైద్యులు వివరించారు. ఇందులో రోగి రక్తాన్ని.. యంత్రాన్ని ఉపయోగించి శరీరం వెలుపల పంప్ చేసి ఆక్సిజన్ను అందజేస్తారని స్పష్టం చేశారు. అయితే 2012వ సంవత్సరంలో ఇన్నోసెంట్కు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మూడేళ్ల పాటు చికిత్స పొందిన ఆయన... దాన్ని అధిగమించినట్లు 2015లో ప్రకటించారు. అలాగే క్యాన్సర్ తో తన యుద్ధం గురించి తన పుస్తకం "లాఫ్టర్ ఇన్ ది క్యాన్సర్ వార్డ్" లో రాశారు.

2014-209 వరకు ఇన్నోసెంట్ లోక్ సభ ఎంపీగా సేవలు అందించారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ట్విట్టర్ వేధికగా ఇన్నోసెంట్ మృతి పట్ల సంతాపం తెలిపారు. సినీ రంగం ఓ అద్భుతమైన, ప్రతిభావంతుడైన నటుడిని కోల్పోయిందని అన్నారు.
సినీ రంగం ఓ గొప్ప నటుడిని కోల్పోయిందని ఖుష్బూ ట్వీట్ చేశారు. ఇన్నోసెంట్ సార్ మరణంతో మనం వెలకట్టలేని రత్నాన్ని కోల్పోయామని ఎమోషనల్ అయ్యారు. అతని ఆత్మకు శాంతి కలుగాలని కోరుకుంటున్నట్లు ఆమె వివరించారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
1972లో కమెడియన్ గా తన నటనా జీవితాన్ని ప్రారంభించిన ఇన్నోసెంట్.. నటుడిగా, కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా సినీ రంగంలో పని చేసిన ఈయన.. 500లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈయన చివరి సారిగా పృథ్వీరాజ్, సుకుమారన్ 'కడువ' సినిమాలో కనిపించాడు. ఈ చిత్రం ఇటీవలే విడుదల అయింది.


Click it and Unblock the Notifications











