ప్రముఖ నటి కన్నుమూత.. తీవ్ర విషాదంలో సినీ పరిశ్రమ
మలయాళ చిత్ర పరిశ్రమకు తన నటనా ప్రతిభతో ఎనలేని గుర్తింపు తెచ్చిన దిగ్గజ నటి కేపీఏసీ లలిత ఇకలేరు. పలు ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్లో కొద్దికాలంగా చికిత్స పొందుతూ కోచిలోని తన కుమారుడి నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 74 సంవత్సరాలు. ఆమె మరణవార్తతో దక్షిణాది సినీ పరిశ్రమ మూగబోయింది. నటి లలిత మృతితో దిగ్బ్రాంతికి గురైన సినీ ప్రముఖులు ఆమెతో తనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ శ్రద్దాంజలి ఘటిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఈ విషాద సమయంలో తన కుటుంబానికి మనోబలాన్ని ఇవ్వాలని కోరుకొంటున్నారు. లలిత మరణం మలయాళ సినీ పరిశ్రమకు తీరని లోటు అని సంతాపం సందేశంలో పేర్కొంటున్నారు

సుదీర్గమైన కెరీర్తో
కేపీఏసీ లలిత సినీ ప్రయాణం అత్యంత సుదీర్ఘమైనది. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కలర్, డిజిటల్ కాలం వరకు తన నటప్రస్థానాన్ని కొనసాగించారు. దాదాపు తన కెరీర్లో 550పైగా చిత్రాల్లో నటించారు. ఆదూర్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో వచ్చిన స్వయంవరం సినిమాలో వేశ్య కల్యాణి పాత్రలో ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు.

ప్రముఖ నటుడితో వివాహం
సినీ ప్రముఖుడు భరతన్ను వివాహం చేసుకొన్న తర్వాత కొద్దికాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. 1983లో సురేష్ గోపి నటించిన కట్టాథే కిలిక్కూడు చిత్రంతో సినీరంగంలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకోవడంతో లలితకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు.

10 ఏటనే నటిగా
కేరళ పీపుల్స్ ఆర్ట్స్ క్లబ్ (కేపీఏసీ) లలిత ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్న లలిత తన 10వ ఏటనే నాటకరంగానికి పరిచయం అయ్యారు. 1969లో మలయాళ సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు. దిగ్గజ నటుడు ప్రేమ్ నజీర్తో కలిసి కూటు కుడుంబం చిత్రంలో సరస్వతి అనే పాత్రతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పోస్ట్మానే కననిల్లా, పొన్నాపురమ్ కొట్టా, గాంధీనగర్ 2 వీధి, వెళ్లాంకులుడే నాడు, మాను అంకుల్, మనిచిత్రథాజు, థేన్మవీన్ కొంబతు, మనస్సినాక్కరే, నన్ ప్రకాశన్ చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.

జాతీయ, కేరళ అవార్డులతో
కేపీఏసీ లలిత పలు జాతీయ అవార్డులను సొంతం చేసుకొన్నారు. 1990లో అమరమ్ సినిమాకు తొలిసారి సహాయ ఉత్తమనటి అవార్డు అందుకొన్నారు. 2000 సంవత్సరంలో శాంతం సినిమాలో ఉతమ నటనకు సహాయ నటిగా అవార్డును గెలుచుకొన్నారు. నీల పొనమన్, ఆరవమ్, అమరం, కొండిన్జూల్ కల్యాణం, గాడ్ ఫాదర్, సందేశం చిత్రాలకు గాను కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకొన్నారు.

నటిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా
లలిత నటిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా తన సేవలు అందించారు. శారద, సురేఖ, నందితా బోస్ లాంటి హీరోయిన్లకు తన గళాన్ని అందించారు. తెర మీద కనిపించకుండా కేవలం తన గొంతు మాత్రమే వినిపించే విధంగా మాథిలుకల్ అనే సినిమాలో లీడ్ రోల్ను పోషించారు.


Click it and Unblock the Notifications











