‘మంత్రి పదవి నుంచి తొలగించండి.. సినిమాలు చేయకపోతే చచ్చిపోతా’
మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి రాజకీయాల్లోకి ప్రవేశించి కేరళలో చరిత్ర సృష్టించారు. గత దశాబ్దకాలంగా మలయాళ రాజకీయాల్లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఎంపీగా సీటును గెలిచి కానుకగా ఇచ్చారు. దాంతో కేరళలో లోక్సభ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయనకు ఏకంగా నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మంత్రి పదవిని ఇచ్చారు. అయితే తాజాగా మంత్రి పదవిని వదులుకోవడానికి సిద్దంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
గత దశాబ్దకాలానికిపైగా రాజకీయాల్లో కొనసాగుతున్న యాక్షన్ హీరో సురేష్ గోపి కేరళలోని త్రిచూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు. ఆయన సుమారుగా 75 వేల ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని అందుకొన్నారు. ఆ తర్వాత కేంద్రంలో ఏర్పాటైన ప్రభుత్వంలో పెట్రోలియం, సహజ గ్యాస్ మంత్రిగా సేవలందిస్తున్నారు.

అయితే ఇటీవల ఓ సమావేశంలో సురేష్ గోపి మాట్లాడుతూ.. సినిమాలు నాకు పంచప్రాణాలు. సినిమాల్లో నటించకుంటే..నేను చచ్చిపోతానేమో. ఒట్టాకొంబన్ సినిమాలో నటించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొన్నాను. ఇంకా అనుమతి లభించలేదు. కానీ సెప్టెంబర్ 6వ తేదీ నుంచి ఆ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని అన్నారు.
నేను ఇప్పటికే 20కిపైగా సినిమాల్లో నటించేందుకు అంగీకరించాను. అమిత్ షాతో నన్ను అడిగినప్పుడు 20 నుంచి 22 సినిమాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పగానే నేను ఇచ్చిన పేపర్ను విసిరి వేశాడు. దాంతో నేను సినిమాల్లో నటించకపోతే చచ్చిపోతానేమో అని ఆయనకు చెప్పాను అని సురేష్ గోపి అప్నారు.

షూటింగ్ చేస్తూనే ప్రజా సమస్యలు, ఇతర పనులు చూసుకొంటాను. సెట్లో ఓ కార్వాన్ ఏర్పాటు చేసి కొంత మంది అధికారులకు అందులో చోటు కల్పిస్తాను. సినిమా షూట్ గ్యాప్లో మంత్రిగా నా సేవలపై దృష్టిపెడుతాను. అంతేకాకుండబా త్రిచూర్ ప్రజలకు మరింత సమయాన్ని కేటాయిస్తాను అని ఆయన అన్నారు.
నేను ఎంపీగా కొనసాగాలని అనుకొంటున్నాను. నాకు మంత్రి పదవి అక్కర్లేదు. మంత్రి పదవి నుంచి విముక్తి కలిగిస్తే.. నేను సినిమాలు చేసుకొంటూ పార్టీకి, ప్రజల కోసం పనిచేస్తాను. నా విషయం గురించి త్రిచూర్ ప్రజలకు బాగా తెలుసు అని ఆయన అన్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











