మరణాంతరం అయ్యప్పనుమ్ కోషియం డైరెక్టర్ సాచీకి జాతీయ అవార్డు.. ఏ లోకాన ఉన్నా అంటూ పృథ్వీరాజ్ సుకుమార్ ఎమోషనల్
తమ కష్టానికి ఫలితంగా అవార్డు వచ్చిందంటే ఎవరైనా ఆనందంతో ఉప్పొంగిపోతారు. కానీ అయ్యప్పనమ్ కోషియం సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ సంపాదించుకొన్న సాచీ అలియాస్ కేఆర్ సచ్చిదానందంకు మరణాంతరం జాతీయ ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది. ఈ సందర్భంలో ఈ లోకాన్ని వీడిన దర్శకుడికి అవార్డు రావడంపై ఒకవైపు ఆనందం, మరోవైపు ఆవేదన లాంటి మిశ్రమ స్పందన అందరికి గురిచేస్తున్నది. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన ట్వీట్ అభిమానులను భావోద్వేగానికి గురిచేయడమే కాకుండా కన్నీటి పర్యంతం చేసే విధంగా మారింది. ఈ క్రమంలో దర్శకుడి సాచీ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం.. పృథ్వీరాజ్ సుకుమారన్ ట్వీట్ గురించి వివరాల్లోకి వెళితే..

దర్శకుడు సాచీ గురించి
కేఆర్ సచ్చిదానందం అలియాస్ సాచీ కేరళలోని త్రిచూరు జిల్లాలోని కోడంగళ్లూరులో 1972లో జన్మించారు. మలయాళ సినీ పరిశ్రమలో స్క్రీన్ రైటర్గా, డైరెక్టర్గా, నిర్మాతగా అతి తక్కువ చిత్రాలు చేసినా.. ఎక్కువ శాతం గుర్తింపు ఉండే సినిమాలే చేయడం గొప్ప విషయంగా మారింది. 2007లో చాక్లెట్, 2009లో రాబిన్ హుడ్, 2011లో మేకప్ మ్యాన్, 2011లో సీనియర్స్, 2011లో డబుల్స్, 2012లో రన్ బే రన్, చెట్టాయీ సినిమాలకు స్క్రీన్ రైటర్గా పనిచేశారు.

2015లో దర్శకుడిగా మారి..
ఇక కేఆర్ సచ్చిదానందం అనార్కలి చిత్రంతో 2015లో దర్శకుడిగా మారారు. 2020 లో అయప్పనుమ్ కోషియం చిత్రాలకు రూపొందించారు. అయ్యప్పనమ్ కోషియ సినిమాతో అద్బుతమైన రెస్పాన్స్ను అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పొందారు. ఈ చిత్రం తెలుగులో భీమ్లా నాయక్గా పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన విషయం అందరికి తెలిసిందే. చెట్టాయీస్ చిత్రానికి నిర్మాతగా కూడా మారారు.

2020లో తిరిగి రాని లోకాలకు
లాక్డౌన్కు ముందు దర్శకుడు సాచీ త్రిచూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తుంటి మార్పిడి సర్జరీ చేయించుకొన్నారు. ఈ సర్జరీ తర్వాత ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలు తీవ్రమయ్యాయి. జూన్ 16, 2020 రోజునగుండెపోటుకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం త్రిసూర్లోని జూబ్లీ మిషన్ హాస్పిటల్కు తరలించారు. అయితే అక్కడే చికిత్స పొందుతూ జూన్ 18న ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా సినీ ప్రముఖులు ఆయనకు శ్రద్దాంజలి కూడా ఘటించలేని విషాద పరిస్థితుల్లో ఆయన వెళ్లిపోయారు.

మరణాంతరం ఉత్తమ దర్శకుడిగా
దర్శకుడు సాచీ ఈ లోకాన్ని వీడినప్పటికీ అతడి ప్రతిభ మాత్రం దేశ సినిమా చరిత్రలో సజీవంగా నిలిచింది. ఆయన ప్రతిభకు పట్టం కడుతూ ఉత్తమ దర్శకుడిగా కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించింది. అయ్యప్పనుమ్ కోషియం సినిమాను ప్రజాదరణ చిత్రంగా రూపొందించినందుకు గాను.. 68వ జాతీయ అవార్డుల్లో సాచీకి ఉత్తమ పురస్కారం వరించింది. ఏ లోకాన ఉన్నా సాచీకి ఆత్మకు ఈ అవార్డు మరింత శాంతిని చేకూరుస్తుందని అభిమానులు కోరుకొంటున్నారు.
పృథ్వీరాజ్ సుకుమారన్ ట్వీట్ కంటతడి పెట్టించేలా
68వ జాతీయ ఉత్తమ అవార్డుల ప్రకటనలో అయ్యప్పనుమ్ కోషియం సినిమా దర్శకుడు సాచీకి ఉత్తమ అవార్డు లభించిందనే వార్తతో అందులో ఒక హీరోగా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఎమోషనల్ అయ్యారు. బీజూ చేతన్, నంజియమ్మా, అయ్యప్పనుమ్ కోషియం చిత్ర యూనిట్కు అభినందనలు. సాచీ.. ఇక నీ గురించి ఏం చెప్పాలి గురువా? మీరు ఏ లోకాన ఉన్నా... మీరు చాలా సంతోషంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరంటే ఎనలేని గౌరవం, గర్వం. మీరు చిరకాలం మా మదిలో ఉండిపోతారు అని పృథ్వీరాజ్ సుకుమార్ ట్వీట్లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











