Asha Bhosle: ఆశా భోంస్లే పాడిన తెలుగు టాప్ సాంగ్స్ ఇవే.. వీటిని మీరు విన్నారా?
భారతీయ సినిమా సంగీతానికి 8 దశాబ్దాలకుపైగా విశేష సేవలు అందించిన లెజెండరీ గాయని ఆశా భోంస్లే ఇక లేరు. గత కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో ఆదివారం ఉదయం మరణించారు. ఆమె మరణ వార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించడంతో సినీ, సంగీత ప్రపంచాలకు సంబంధించిన ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆశాజీ కేవలం హిందీ సినీ రంగానికే పరిమితం కాలేదు. తెలుగు సినీ రంగంతో కూడా ఆమెకు మంచి అనుబంధం ఉంది. ఆమె తెలుగులో పాడిన పాటలన్నీ హిట్గా నిలిచాయి. ఆమె పాడిన హిట్ పాటలు కొన్నింటి వివరాలు మీ కోసం..
1981 లో ఇది మౌనగీతం
తెలుగు సినిమా రంగంలో స్వర్గీయ దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించగా, మోహన్ బాబు, జయప్రద హీరో, హీరోయిన్లుగా నటించిన పాలు నీళ్లు సినిమాలో ఓ పాటను పాడారు. మ్యూజిక్ లెజెండ్ సత్యం సంగీత దర్శకత్వంలో రూపొందిన 'ఇది మౌనగీతం' అనే పాటను ఆశా భోంస్లే పాడారు. స్వర్గీయ వేటూరి సుందరరామ్మూర్తి సాహిత్యం అందించారు. 1981 సంవత్సరంలో రిలీజైన ఆ పాట ఇప్పటికీ యూట్యూబ్లో ట్రెండింగ్గా ఉంది.

1988 లో జీవితం సప్తసాగర గీతం
ఆ తర్వాత 1988 సంవత్సరంలో వచ్చిన చిన్ని కృష్ణుడు సినిమాలో మరో పాటను పాడారు. స్వర్గీయ జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు రమేష్ బాబు, కుష్బూ జంటగా నటించారు. ఈ చిత్రంలోని 'జీవితం సప్తసాగర గీతం' అనే పాటను ఆశా భోంస్లే ఆలపించారు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దిగ్గజం ఆర్బీ బర్మన్ మ్యూజిక్ అందించారు. ఈ పాటను ఆశాతో కలిసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ఈ పాటకు వేటూరి సుందర రామ్మూర్తి సాహిత్యం అందించారు.
1992 లో ఓ ప్రేమ అంటూ
అనంతరం 1992 సంవత్సరంలో రిలీజైన అశ్వమేథం చిత్రం కోసం ఆశా భోంస్లే రెండు పాటలు పాడారు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, మీనా, నగ్మా, శోభన్ బాబు నటించిన ఈ సినిమాలోని 'ఓ ప్రేమ.. నన్ను నువ్వే ప్రేమ.. నవ్వే ప్రేమ.. పువ్వే తేనే.. పొంగే ప్రేమ' అనే పాటను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి ఆశాజీ పాడారు. అలాగే ఇదే చిత్రంలో 'సీతాకాలం ప్రేమకు' అనే పాటను కూడా ఎస్బీబీతో పాడారు. ఈ పాటను నగ్మా, బాలకృష్ణపై చిత్రీకరించారు. ఈ రెండు పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.
కృష్ణ వంశీ కోసం నాలో ఊహలకు అంటూ
ఆ తర్వాత మరోసారి కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన చందమామ సినిమా కోసం మరో పాటను పాడారు. ఈ సినిమాకు కేఎం రాధాకృష్ణన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో 'నాలో ఊహలకు' అనే పాటను సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణన్తో కలిసి ఆశా భోంస్లే జీ పాడారు. ఈ పాటకు ఆనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఈ చిత్రంలో శివ బాలాజీ, నవదీప్, కాజల్, సింధూ మీనన్ తదితరులు నటించారు.
అన్నమాచార్య సంకీర్తన కూడా
సినిమా పాటలే కాకుండా ఆశా భోంస్లే అన్నమాచార్య సంకీర్తనను కూడా పాడారు. గాయనీమణులు చిత్ర, పద్మజాతో కలిసి ఆశా భోంస్లే కూడా భాగం పంచుకొన్నారు. రమేష్ నాయుడు సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటల్లో 'నటనల భ్రమయపు నా మనసా' అనే పాటను ఆశాజీ ఆలపించారు.


Click it and Unblock the Notifications

















