Independence Day 2024: జనాన్ని కదిలించి.. రగిలించిన దేశభక్తి గీతాలు.. వీటిని మీరు విన్నారా?
ప్రపంచవ్యాప్తంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటాల్లో విభిన్నమైనది, విశిష్టమైనది భారత స్వాతంత్య్ర పోరాటం. అన్ని చోట్లా ఆయుధం చేతబట్టి, యుద్ధం చేస్తేనే స్వేచ్ఛ సాధ్యమైంది. కానీ అహింస, సత్యాగ్రహం, సహాయ నిరాకరణ వంటి ఆయుధాలతో గాంధీ మహాత్ముడి సారథ్యంలో జరిగిన పోరాటం ఫలించి భారత మాతకు బానిస సంకెళ్ల నుంచి విముక్తి లభించింది. ఎందరో మహనీయుల కృషి, త్యాగాల వల్లే ఈనాడు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం.
సమకాలీన అంశాలపై సినిమాలు తీసే మన దర్శక నిర్మాతలు .. భారత స్వాతంత్ర్య సమరంపైనా ఎన్నో అపురూప చిత్రాలు తెరకెక్కించారు. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎన్నో సినిమాలు రూపొంది.. ప్రజల్లో దేశభక్తి రగిల్చాయి. ముఖ్యంగా ఆయా చిత్రాల్లోని పాటలు ఈనాటికీ ప్రజలను చైతన్యపరుస్తూనే ఉన్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజల్లో దేశభక్తిని రగిల్చిన మాటలు మీకోసం.

తెలుగు వీర లేవరా - అల్లూరి సీతారామరాజు
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం ఆధారంగా సూపర్స్టార్ కృష్ణ నిర్మించి నటించిన చిత్రం 'అల్లూరి సీతారామరాజు' . ఈ సినిమాలోని తెలుగువీర లేవరా పాట ఎప్పటికీ ఎవర్గ్రీన్. శ్రీశ్రీ సాహిత్యానికి ఆదినారాయణరావు స్వరాలు, ఘంటసాల మధురగానం జతకలవడంతో జనం ఊగిపోయారు. ఈ పాటకు గాను శ్రీశ్రీకి జాతీయ ఉత్తమ గీత రచయిత పురస్కారం లభించింది.
పాడవోయి భారతీయుడా - వెలుగు నీడలు
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, మహానటి సావిత్రి జంటగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన వెలుగునీడలు చిత్రంలోని పాడవోయి భారతీయుడా పాట స్వాతంత్ర్యం లభించగానే సంబరపడొద్దని, సమాజంలో ఎన్నో మార్పులు తీసుకురావాల్సిన అవసరాన్ని చాటిచెప్పింది. శ్రీశ్రీ ఈ పాటను రాయగా.. పెండ్యాల నాగేశ్వరరావు స్వరాలు సమకూర్చారు. ఘంటసాల- పీ సుశీల ఆలపించారు.
భారతమాతకు జేజేలు - బడిపంతులు
నటరత్న ఎన్టీఆర్, అంజలి, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం బడిపంతులు. పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని భారతమాతకు జేజేలు పాట ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది. ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని అందించగా.. కేవీ మహదేవన్ స్వరాలు సమకూరిస్తే, ఘంటసాల ఆలపించారు.
మన జన్మభూమి బంగారు భూమి - పాడిపంటలు
సూపర్స్టార్ కృష్ణ - విజయ నిర్మల జంటగా పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన పాడిపంటలు సినిమాలోని 'మన జన్మభూమి బంగారు భూమి' పాట ఇప్పటికీ ప్రజలను ఉర్రూతలూగిస్తుంది. మోదుకూరి జాన్సన్ ఈ పాటను రాయగా.. కేవీ మహదేవన్ సంగీతం అందజేస్తే, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు.
జననీ జన్మ భూమిశ్చా - బొబ్బిలి పులి
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు, శ్రీదేవి జంటగా దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బొబ్బిలి పులి. ఈ సినిమాలోని 'జననీ జన్మభూమిశ్చా ' పాట వింటుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సాంగ్ను స్వయంగా దాసరి రాయగా.. జేవీ రాఘవులు సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు.
పుణ్యభూమి నా దేశం - మేజర్ చంద్రకాంత్
దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ , మోహన్ బాబు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం మేజర్ చంద్రకాంత్. ఇందులోని పుణ్యభూమి నా దేశం నమో నమామి పాట ఆల్టైమ్ క్లాసిక్గా నిలిచింది. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వస్తే చాలు ఈ పాట మారుమోగాల్సిందే. జాలాది రాజారావు రాసిన ఈ గీతానికి ఎంఎం కీరవాణి స్వరాలు అందించగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు.
మేమే ఇండియన్స్ - ఖడ్గం
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ , రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఖడ్గం. ఉగ్రవాదం, భారత సైనికుల త్యాగాలు, పోలీసులు, జర్నలిస్టులు, మతకల్లోలాలే ఇతివృత్తంగా వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలోని మేమే ఇండియన్స్ పాట ఈ తరానికి పూనకాలు తెప్పించింది. చంద్రబోస్ రాసిన ఈ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందజేయగా హనీ ఆలపించారు.
ఈ జెండా పసిబోసి చిరునవ్వురా - బాబీ
సూపర్స్టార్ మహేశ్ బాబు - ఆర్తి అగర్వాల్ జంటగా శోభన్ దర్శకత్వంలో వచ్చిన బాబీ సినిమాలోని ఈ జెండా పసిపోసి చిరునవ్వురా క్లాసికల్ సాంగ్గా నిలిచింది. శక్తి సాహిత్యం అందించగా.. మణిశర్మ స్వరాలు సమకూరిస్తే, శంకర్ మహదేవన్ ఈ పాటను ఆలపించారు.


Click it and Unblock the Notifications











