విప్లవ కవి వంగపండు ప్రసాదరావు కన్నుమూత.. ఆర్ నారాయణమూర్తి కంటతడి
ఎన్నో సంవత్సరాలుగా తన పాటలు, రచనలతో పేద ప్రజలను, గిరిజనులను చైతన్య పరిచిన వాగ్గేయ కారుడు, ప్రజా కవి వంగపండు ప్రసాదరావు ఇకలేరు. ఏం పిల్లడో ఎల్దామోస్తవా అంటూ ఊర్రూతలూగించిన వండపండు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. కొద్దికాలంగా వృద్దాప్య సంబంధింత వ్యాధులతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మంగళవారం (ఆగస్టు 4న) విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వైకేఎం నగర్లో కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు సంతాపం ప్రకటించారు. వంగపండు వ్యక్తిగత, సామాజిక జీవిత విశేషాల్లోకి వెళితే..

విద్యార్థి జీవితం నుంచే ప్రజా ఉద్యమాలవైపు
వంగపండు ప్రసాదరావు జననం లో పార్వతీపురంకు సమీపంలోని పెదబొండపల్లిలో 1943లో జన్మించారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. విద్యార్థి దశలోనే ఆయన ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులయ్యారు. 1972లో పీపుల్స్ వార్ సాంస్కృతిక విభాగం జననాట్యమండలిని స్థాపించారు. ఉత్తరాంధ్ర గద్దర్గా పేరు సంపాదించుకొన్నారు.

అర్ధరాత్రి స్వాతంత్ర్యంతో సినీ జీవితం
ప్రముఖ నటుడు, దర్శకుడు, నటుడు ఆర్ నారాయణమూర్తి రూపొందించిన అర్దరాత్రి స్వాతంత్ర్యం చిత్రంతో వంగపండు ప్రసాదరావు తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఈ చిత్రం కోసం రాసిన ఏం పిల్లడో పాట తెలుగు సినీ అభిమానులను, సామాజిక కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకొన్నారు. ఆ తర్వాత 30కి పైగా సినిమాలకు పాటలు రాశారు.

ప్రజా ఉద్యమాలే ఊపిరిగా
సినీ రచయితగా, గాయకుడిగా వంగపండుకు విశేష ఆదరణ లభించినప్పటికీ కమర్షియల్ అంశాలకు దూరంగా ఉంటూ ప్రజా ఉద్యమాలకు సహకరించే పాటలనే రచించి పాడటం విశేషం. చివరి వరకు తాను నమ్మిన విలువలకు, సిద్దాంతాలకే కట్టుబడి ఉన్నారు. జన పదమే ఊపిరిగా చివరి శ్వాస వదిలారు. ఆర్ నారాయణమూర్తి, టీ కృష్ణ, మాదాల రంగారావు, దాసరి లాంటి సినీ దిగ్గజాలతో సన్నిహితంగా ఉన్నారు.

వంగపండు మృతి తీరని లోటు.. ఆర్ నారాయణమూర్తి
వంగపండు ప్రసాదరావు మృతితో పీపుల్స్ స్టార్ అర్.నారాయణ మూర్తి తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ప్రముఖ విప్లవ కవి, ప్రజా వాగ్గేయ కారుడు వంగపండు ప్రసాదరావు మరణం సమాజానికీ తీరని లోటు. ఆయన్ని ఉత్తరాంధ్రా సంతకం అని గొల్లపూడి మారుతీరావు కొనియాడారు. పార్వతి పురం మహాసభలో నిజమైన ప్రజాకవి నేను కాదు వంగపండు ప్రసాదరావు, గద్దర్ అని మహాకవి శ్రీశ్రీ మాట్లాడుతూ అన్నారు అనే విషయాన్ని నారాయణ మూర్తి అన్నారు.
Recommended Video

పీడిత ప్రజానీకానికి తీరని లోటు.. ఆర్ నారాయణమూర్తి
వంగపండు ప్రసాదరావు నా అర్ధరాత్రి స్వాతంత్య్రం సినిమాలో గొప్ప పాటలు రాశారు పాడారు నటించారు. నా అనేక చిత్రాలకు పాటలు రాశారు. నా చిత్ర విజయాలకు అయన పాటలు ఎంతో దోహదం చేశాయి. దాసరి నారాయణరావు, టీ కృష్ణ, మాదాల రంగారావు సినిమాలతో పాటు అనేక చిత్రాలకు పాటలు రాశారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు, సాహిత్య లోకానికే కాదు, తెలుగు పీడిత ప్రజానీకానికి, సమాజానికీ తీరని లోటు. అయన ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను అని పీపుల్స్ స్టార్ అర్.నారాయణ మూర్తి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











