ఆ రాజకీయ నేతతో లింక్ లేదు.. విష ప్రచారం వద్దు.. సింగర్ మంగ్లీ ఎమోషనల్
ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా తనపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్ గురించి సింగర్ మంగ్లీ ఓపెన్ అయ్యారు. ఇటీవల పాలిటిక్స్తో సంబంధం ఉన్న ఈవెంట్స్లో పాల్గొన్న తర్వాత ఆమెను సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే తనను రాజకీయాలతో ముడిపెడుతూ కొందరు ట్రోల్స్ చేయడంపై ఆమె బహిరంగ సుదీర్ఘమైన లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మంగ్లీని వెంటాడుతున్న వివాదం ఏమిటి? ఆమె ఎలా స్పందించారనే విషయాల్లోకి వెళితే..
గత ఎన్నికల్లో మంగ్లీ కొన్ని రాజకీయ పార్టీలకు తన పాటలతో ప్రచారం చేశారు. అందులో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కోసం కొన్ని పాటలు పాడారు. ఎన్నికల నేపథ్యంగా ఆ పార్టీ సాధించిన విజయాలను, వైఎస్ జగన్ను పథకాల గురించి ఆమె పాడిన పాటలను ప్రచారానికి ఉపయోగించుకొన్నారు. దాంతో ఆమె వైసీపీకి చెందిన వ్యక్తిగా ముద్ర వేశారు. అయితే తనకు ఎలాంటి లింక్ లేదని ఆమె స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

సింగర్ మంగ్లీ తాజాగా ఓ వివాదానికి కేంద్ర బిందువయ్యారు. ఉత్తరాంధ్రలోని అరసవెల్లి రథ సప్తమి వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక నేతలు పాల్గొన్న ఓ అధ్యాత్మిక కార్యక్రమంలో ఆమె పాల్గొనడంపై టీడీపీ వర్గాలు భారీగా స్పందించారు. వైసీపీకి ప్రచారం చేసిన ఆమెను ఈ వేడుకలకు ఎందుకు ఆహ్వానించారు. తమ పార్టీకి చెందిన వారు, గతంలో పార్టీకి అండగా నిలిచిన వారిని విస్మరించారని ప్రశ్నించారు. సింగర్ మంగ్లీని పిలవడంపై పార్టీ శ్రేణులు భగ్గుమన్నారు.
టీడీపీ, ఇతర పార్టీల కార్యకర్తలు తనపై ఘాటుగా కామెంట్స్ చేయడంతో మంగ్లీ సుదీర్ఘమైన లేఖను పోస్టు చేశారు. తనపై విష ప్రచారం వద్దని ఆ లేఖలో అభ్యర్థించారు. కేంద్రమంత్రి నన్ను ఓ కళాకారిణిగా గుర్తించి ఈ వేడుకల్లో ఆహ్వానించారు. సూర్య భగవానుడి దివ్య దర్శనంతోపాటు సేవ చేసుకొనే అదృష్టం కల్పించారు. భగవంతుడి కార్యక్రమానికి వెళ్లడంపై రాజకీయ ముద్ర వేయడం సరికాదు అని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ నేతలు నాతో సంప్రదించారు. వారి రిక్వెస్ట్ కారణంగా ఆ పార్టీకి పాటలు పాడాను. ఆ తర్వాత రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేశాను. నేను టీడీపీ నేతలను గానీ, చంద్రబాబు నాయుడు, లోకేష్ను విమర్శలించేదు, దూషించలేదు. పార్టీ జెండాను భుజాన మోయలేదు. నేను బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు కూడా పాటలు పాడాను అని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నేను అనని మాటలను ఆధారాలు లేకుండా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ వారు కోరితే నేను పాటలు పాడేదానిని, ప్రచారం కూడా చేసేదానిని. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే చంద్రబాబును ఏనాడు దూషించలేదు. అందుకు విరుద్ధంగా సోషల్ మీడియాలో ఆయనను తిట్టినట్టు ప్రచారం చేయడం తప్పు. నాకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











