అమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి.. వినగానే నేనూ భావోద్వేగానికి గురయ్యా: విజయ్ దేవరకొండ
కొన్ని పాటలు ఒక్కసారి వినగానే మనసుకు హత్తుకుంటాయి. మరికొన్ని భావోద్వేగానికి గురి చేస్తుంటాయి. తాజాగా విడుదలైన డియర్ కామ్రేడ్ రెండో సాంగ్ తనకు అలాంటి ఫీలింగే కలిగించిందని అంటున్నారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.
యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న కొత్త సినిమా డియర్ కామ్రేడ్. నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా విజయ్ క్రేజీ జోడీ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్త సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం, యశ్ రంగినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దినకరన్ సంగీతం అందిస్తున్నారు.

విజయ్ దేవరకొండ కెరీర్లో మొదటిసారి తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసిన చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రంలోని రెండో పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను సోషల్ మీడియాలో షేర్ చేసిన విజయ్ దేవరకొండ.. ఒక రోజు ఉదయం నిద్రలేవగానే భరత్ నుంచి వచ్చిన మెసేజ్ చూశా. ఇందులో ఆడియో ఫైల్ ఉంది. ఆ సాంగ్ వినగానే తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యాను. ఈ సాంగ్ ప్లే చేసిన ప్రతీసారి అమ్మ కళ్లలో నీళ్లు తిరగటం గమనించాను అని పేర్కొన్నాడు.
సిద్ శ్రీరామ్, ఐశ్వర్య రవిచంద్రన్ ఆలపించిన ఈ మెలోడి సాంగ్ ఎంతో మధురంగా ఉంది. గతంలో గీతగోవిందం సినిమాలో ఇంకేం ఇంకేం కావాలి అనే సాంగ్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన, సిద్ శ్రీరామ్ కాంబినేషన్లో మరో అద్భుతమైన పాట వచ్చిందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఆహ్లాదకరమైన సంగీతంలో వినసొంపైన గానం, అందరికీ అర్థమయ్యే సాహిత్యం అన్నీ కలగలిసి ఈ పాటకు ప్రాణం పోశాయి.
ఇప్పటికే విడుదలైన డియర్ కామ్రేడ్ చిత్ర టీజర్ భారీ అంచానాలు తెచ్చిపెట్టింది. ఇందులో రష్మికను విజయ్ దేవరకొండ ఘాటుగా కిస్ చేయడం చూసి సినిమాపై ఆసక్తి పెంచుకొని విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. చిత్రాన్ని జూన్ 26వ తేదీన విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











