2010 సంవత్సరానికి అక్కినేని ఇంటర్నేషనల్ అవార్డు ఆదర్శకుడికే..
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నటుడు డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు పేరిట ప్రతి ఏడాది అందించే అక్కినేని 'ఇంటర్నేషనల్ అవార్డు' ఈ ఏడాది ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ ని వరించింది. మంగళవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు అవార్డు కమిటీ చైర్మన్ టి సుబ్బరామిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ 'ఇప్పటివరకు దేవానంద్, షబానా ఆజ్మీ, అంజలీదేవి, వైజయంతీ మాల, లతా మంగేష్కర్ లాంటి మేధావులకు ఈ అవార్డును ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ ఏడాది ఈ అవార్డును ఎవరికి ఇవ్వాలనే విషయంలో నేను, కమిటీ సభ్యులైన మూవీ మొగల్ డాక్టర్ డి రామానాయుడు, బోనీకపూర్ ఎంతో ఆలోచించి చివరకు కె బాలచందర్ కి ఇవ్వాలని నిర్ణయించాం. శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాక, ఎన్నో క్లాసిక్స్ ను దేశానికి అందించారాయన. ఎన్నో జాతీయ అవార్డులను కూడా అందుకున్నారు. జనవరి 11న హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగే ఈవేడుకలో ఈ అవార్డును ఆయనకు అందజేస్తాం. ముఖ్యమంత్రితో పాటు వీరప్ప మొయిలీ, ఇండియన్ ఐడల్ శ్రీరామ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు' అన్నారు.
డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు మట్లాడుతూ '1991 లో నేను ఫాల్కే అవార్డును అందుకున్నాను. ఆ సమయంలో నా మనసులో ఉద్బవించిన ఆలోచనకు రూపమే ఈ అవార్డు. అర్హులను ఎన్నుకునే విషయంలో ఫాల్కే అవార్డుకు ఎలాంటి రూల్స్ పాటిస్తారో ఈ అవార్డుకీ అలాంటి రూల్సు పాటించడం జరుగుతుంది. అవార్డుతో పాటు నాలుగు లక్షల రూపాయల నగదు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఫాల్కే పురస్కారానికి పది లక్షలు ఇస్తున్నారు. మేము కూడా భవిష్యత్తులో పెంచే అవకాశం వుంది' అని నాగేశ్వరరావు అన్నారు.


Click it and Unblock the Notifications











