ఊహకందని రాజమౌళి ప్లానింగ్: 2.0 మించేలా ‘ఆర్ఆర్ఆర్’, 4డి టెక్నాలజీ, 120 కెమెరాలతో...
ఎస్ఎస్ రాజమౌళి తీసింది డజను సినిమాలే కానీ... టాలీవుడ్ ఇండస్ట్రీకే దర్శక ధీరుడు అయ్యాడు. టెక్నాలజీ పరంగా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు. బాహుబలి ప్రాజెక్ట్ ద్వారా కలలో కూడా ఊహించని వేలాది కోట్ల వసూళ్లను సుసాధ్యం చేసి చూపించాడు.
తాజాగా రాజమౌళి తన కొత్త ప్రాజెక్ట్ 'ఆర్ఆర్ఆర్' మొదలు పెట్టాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. రూ. 300 కోట్ల బడ్జెట్తో ఎవరూ ఊహించని స్థాయిలో ఈ సినిమా రూపొందుతోంది.

ఎవరి ఊహకు అందని రాజమౌళి ప్లానింగ్
రాజమౌళి సినిమా ప్లానింగ్ ఇండస్ట్రీలో ఎవరి ఊహకు అందడం లేదు. ఇంత బడ్జెట్ ఖర్చు పెట్టిస్తున్న రాజమౌళి ఇందులో ఎలాంటి ప్రత్యేకతలు చూపించబోతున్నారో? అనే చర్చ మొదలైంది. తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Recommended Video


2.0 చిత్రాన్ని మించిపోయే టెక్నాలజీ
ఇప్పటి వరకు ఇండియాలో అత్యంత హై టెక్నాలజీతో రూపొందిన మూవీ ఏది అంటే... శంకర్ దర్శకత్వంలో రాబోతున్న 2.0. ఇందులో 3డి టెక్నీలజీతో పాటు 4డి సౌండ్ వాడారు. అయితే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్' మూవీ వీటిని మించిపోయేలా ఉండబోతోందట.

120 కెమెరాలతో షూటింగ్
ఈ సినిమాలో రాజమౌళి డిజైన్ చేసిన యాక్షన్ సీన్లు ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటాయట. ఈ సీక్వెన్స్ చిత్రీకరించడానికి ఏకంగా 120 కెమెరాలను ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

4డి టెక్నాలజీతో చరణ్, తారక్ ఫేస్ కాప్చర్
యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ సమయంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హావభావాలు, ముఖకవళికలు 4డి టెక్నాలజీతో క్యాప్చర్ చేస్తారని తెలుస్తోంది. ఈ టెక్నాలజీ ద్వారా సినిమా చూస్తున్న ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలుగుతుందట.

ఖర్చు మాత్రమే కాదు... దాన్ని తిరిగి రాబట్టే ఉపాయాలు కూడా!
సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విషయంలో రాజమౌళి అండ్ టీం స్పెషల్ కేర్ తీసుకున్నారని తెలుస్తోంది. తాము పెడుతున్న రూ. 300 కోట్ల ఖర్చుకు కనీసం రెట్టింపు....అంటే రూ. 600 కోట్ల వచ్చేలా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్లాన్ చేశారట. ఈ మేరకు పక్కా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది.

రూ. 400 కోట్లు థియేటర్ బిజినెస్
ఒక్క థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ. 400 కోట్లు రాబట్టేలా ప్లాన్ చేశారట. తెలుగుతో పాటు తమిళం, హిందీలో ‘ఆర్ఆర్ఆర్' సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హిందీ సినిమా మార్కెట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

రూ. 200 కోట్లు శాటిలైట్
బాహుబలి తర్వాత రాజమౌళి సినిమాలకు మంచి క్రేజ్ ఏరపడింది. దీన్ని ఆధారంగా చేసుకుని తెలుగు, తమిళం, హిందీ శాటిలైట్ రైట్ష్, ఆన్ లైన్ స్ట్రీమింగ్ రైట్స్ ఇలా అన్నీ కలిపి రూ. 200 కోట్లు రాబట్టేలా ప్లాన్ చేస్తున్నారట.


Click it and Unblock the Notifications











