చందమామ కథలు నిర్మాతనైనందుకు గర్వపడుతున్నా
హైదరాబాద్: మంచు లక్ష్మీ, సీనియర్ నరేష్, కృష్ణుడు, ఆమని, నాగశౌర్య ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం 'చందమామ కథలు'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చాణిక్య బూనేటి ఈ చిత్రాన్ని నిర్మించారు. 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'చందమామ కథలు' అవార్డును కైవసం చేసుకున్న సంగతి విదితమే. ఇటివల జరిగిన అవార్డు ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా నిర్మాత చాణిక్య బూనేటి రజిత కమలం అందుకున్నారు. ఎనిమిది భిన్నమైన కథలతో సందేశాత్మక చిత్రాన్ని నిర్మించిన చాణిక్య బూనేటికి పలువురు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భం నిర్మాత చాణిక్య బూనేటి మాట్లాడుతూ.. చందమామ కథలు చిత్రానికి నిర్మాతనైనందుకు చాలా గర్వంగా ఉంది. జాతీయ ఉత్తమ అవార్డు అందుకుకోవడం జీవితంలో మైలురాయి వంటిది. గొప్ప అనుభూతి. మరిన్ని మంచి చిత్రాలు నిర్మించడానికి ఇలాంటి అవార్డులు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఓ మంచి చిత్రంగా చందమామ కథలు రూపొందడానికి సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చందమామ కథలు చిత్ర విజయం, అవార్డు అందించిన స్ఫూర్తితో త్వరలో మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలిపారు. తెలుగు చిత్రానికి అవార్డు రావడం పట్ల దర్శకరత్న దాసరి నారాయణరావు సంతోషాన్ని వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన జన్మదిన వేడుకలలో చందమామ కథలు చిత్ర బృందాన్ని దాసరి ప్రత్యేకంగా సత్కరించారు.



Click it and Unblock the Notifications











