వాటి వాడకం ఆపేద్దాం: ప్రధాని మోడీ నిర్ణయానికి మద్దతుగా అమీర్ ఖాన్
పర్యావరణాన్ని పరిరక్షించడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం ఆపివేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుకు అమీర్ ఖాన్ తన మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఆయన ఇలా వ్యాఖ్యానించారు. "సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను అరికట్టడానికి గౌరవనీయులైన ప్రధాని చొరవ మనమందరం బలంగా సమర్ధించాల్సిన అవసరం ఉంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం మానేయాలనే నిర్ణయం తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత." అని వ్యాఖ్యానించారు.
ఆదివారం ప్రసారమైన మన్ కి బాత్ రేడియో కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ అక్టోబర్ 2 నుండి (మహాత్మా గాంధీ జన్మదినం) "ప్లాస్టిక్కు వ్యతిరేకంగా కొత్త విప్లవం" ప్రారంభించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. "ఈ సంవత్సరం, మనం బాపూజీ 150 వ జయంతిని జరుపుకునేటప్పుడు, బహిరంగ మలవిసర్జన రహితమైన భారతదేశాన్ని ఆయనకు అంకితం చేయడమే కాకుండా, ప్లాస్టిక్కు వ్యతిరేకంగా కొత్త విప్లవానికి పునాది వేద్దాం. ప్లాస్టిక్ రహిత మదర్ ఇండియా గుర్తుగా ఈ సంవత్సరం గాంధీ జయంతిని జరుపుకుందాం. అక్టోబర్ 2 ను ప్రత్యేక దినంగా జరుపుకుందాం" అన్నారు.

"ప్లాస్టిక్ వ్యర్థాలను సరైన పద్దతిలో పారవేసే విధంగా చూడాలని కార్పొరేట్ రంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, పేరుకుపోయిన ప్లాస్టిక్లన్నింటినీ రీసైకిల్ చేయవచ్చు, దీనిని ఇంధనంగా మార్చవచ్చు. ఈ దీపావళికి ముందే మనం దాన్ని సాధించాలి" అని మోడీ చెప్పుకొచ్చారు.
స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి విజ్ఞప్తి చేశారు. "దుకాణదారులు జనపనార, గుడ్డ సంచులను అమ్మాలి. వినియోగదారులు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే మార్గాలను అవలంబించాలి. ప్లాస్టిక్ వాడకాన్ని రద్దు చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడాలి" అన్నారు.


Click it and Unblock the Notifications











