‘అబ్బాయితో అమ్మాయి’ మూవీ రివ్యూ...
హైదరాబాద్: ‘ఊహలు గుసగుసలాడే' మూవీతో హీరోగా పరిచయం అయిన నాగ శౌర్య...లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. మధ్యలో ‘జాదుగాడు' అంటూ మాస్, యాక్షన్ ఎంటర్టెనర్ ట్రై చేసి బోల్తా పడటంతో తాజాగా మళ్లీ ‘అబ్బాయితో అమ్మాయి' అనే ప్రేమ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రేమ, కామం అనే రెండు అంశాల సినిమాలో ఫోకస్ చేసారు. సినిమాలో ఎలా ఉందనే విషయం రివ్యూలో చూద్దాం...
కథ విషయానికొస్తే...
ఇంజనీరింగ్ కుర్రాడైన అభి (నాగశౌర్య) తనకూ ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండాలనే ఉద్దేశ్యంతో కనిపించిన ప్రతీ అమ్మాయినీ ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలో ప్రార్థన (పల్లక్ లల్వాని)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ శారీరకంగా కూడా కలుస్తారు. విషయం ఇంట్లో తెలియడంతో పెద్ద గొడవ జరుగుతుంది. ఆ తర్వాత కథ మలుపు తిరుగుతుంది. ఇద్దరూ విడిపోతారు. తర్వాత అభికి ఫేస్ బుక్ ద్వారా సమంత అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ప్రార్థన....పవన్ కళ్యాణ్ అనే అబ్బాయికి ఫేస్ బుక్ ద్వారా దగ్గరవుతుంది. అభి, ప్రార్థనలకు.... సమంత, పవన్ కళ్యాణ్ లతో సంబంధం ఏమిటి? చివరకు ఏమైంది అనేది తెరపై చూడాల్సిందే.
పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే.... నాగ శౌర్య లవర్ బాయ్ గా బాగా నటించాడు. అయితే కొన్ని సీన్లలో కాస్త ఓవర్ గా నటించినట్లు అనిపించింది. హీరోయిన్ పల్లక్ లవ్వాని నటన పరంగా, గ్లామర్ పరంగా ఆకట్టుకుంది. తెలుగ అమ్మాయిలా కనిపించింది. రావు రమేష్, ప్రగతి, మోహన్, బ్రహ్మానందం, పృత్వీ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

టెక్నికల్ అంశాల పరంగా చూస్తే... శ్యాంకె నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఈ సినిమాకు ఏదైనా హైలెట్ ఉందంటే అది శ్యాంకె నాయుడు సినిమాటోగ్రఫీ మాత్రమే. ఇళయరాజా అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. బ్రహ్మకడలి ఆర్ట్ వర్క్ బావుంది. ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ పర్ ఫెక్టుగా లేదు.
సినిమాలో విషయం ఉందా? లేదా? అనే పాయింటుకు వస్తే....పంచ్డైలాగులు, పాటలు, అందమైన లొకేషన్లు, హీరోయిన్ గ్లామర్ లాంటి అంశాలను సినిమాలో బాగానే ఫోకస్ అయ్యాయి. కానీ ఇవన్నీ ఎన్ని ఉన్నా ప్రేక్షకుడు సినిమాను ఎంజాయ్ చేయాలంటే కథ, కథనం బలంగా ఉండాలనే విషయం దర్శకుడు మరిచిపోయినట్టున్నాడు. సినిమాలో బోరింగ్ అంశాలే ఎక్కువగా ఉన్నాయి. బ్రహ్మానందం, పృధ్వీ, రావు రమేష్, ప్రగతి, మోహన్, లాంటి యాక్టర్స్ ఉన్నా వారిని వాడుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యారు. సినిమా విడుదల ముందు... పబ్లిసిటీ బాగా చేసారు. యువతను ఆకట్టుకునేలా ముద్దు సీన్ పోస్టర్లతో ఆకర్షించారు. తొలిరోజు థియేటర్ల వరకు జనాలను రాబట్టగలిగటారు కానీ... ఆకట్టుకోవడంలో మాత్రం దర్శకుడు రమేష్ వర్మ పూర్తిగా విఫలం అయ్యాడు. సినిమాకు కథ, కథనం, దర్శకత్వం పెద్ద మైనస్ పాయింటుగా మారాయి.
నటీనటులు: నాగశౌర్య, పల్లక్ లల్వాని, బ్రహ్మానందం, రావు రమేష్, మోహన్, ప్రగతి, తులసి, పృథ్వీ తదితరులు
కూర్పు: ఎస్.ఆర్.శేఖర్
కళ: బ్రహ్మ కడలి
సంగీతం: ఇళయరాజా
ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు
నిర్మాణం: వందన అలేఖ్య జక్కం, కిరీటి పోతిని, శ్రీనివాస్ సమ్మెట
దర్శకత్వం: రమేష్ వర్మ


Click it and Unblock the Notifications











