పొలిటికల్ ‘గబ్బర్ సింగ్’ అంటున్నారు
'గబ్బర్ సింగ్' పోస్టర్ మీద పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడులా నమస్కారం పెడుతూ ఉండే స్టిల్ అభిమానుల్లో ఆనందాన్ని రేపింది. అయితే చిత్రంగా ఊహించని విధంగా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడేసరికి గబ్బర్ సింగ్ కాస్తా పొలిటికల్ 'గబ్బర్ సింగ్'గా మారిపోయింది. ఈ వారంలో విడుదల అవుతున్న ఈ చిత్రానికి అసలు ప్రమోషన్ కన్నా గత రెండు రోజుల్లో పొలిటికల్ గా మీడియా ద్వారా లభిస్తున్న ప్రచారమే ఎక్కువగా ఉంది. బొత్స సత్యనారాయణను టార్గెట్ చేయటానికి ప్రత్యర్దులు వాడుతున్న బాణాల్లో భాగంగా గబ్బర్ సింగ్,దాని నిర్మాత బండ్ల గణేష్,బొత్స తో లింక్స్ ప్రస్తావన తెస్తున్నారు.
'తీన్ మార్ సినిమాకు 9 కోట్లు నష్టం వచ్చింది. 48 కోట్లతో గబ్బర్ సింగ్ తీస్తున్నారు. గతంలో 22 కోట్లతో ఆంజనేయులు సినిమా తీశారు. ఒక సాధారణ నటుడు అశ్వనీదత్, రామానాయుడు వంటి బడా నిర్మాతలు కూడా నిర్మిం చలేని సినిమాలు ఎలా నిర్మిస్తారు? ఇది కచ్చితంగా బొత్స బినామీ సొమ్మే' నని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యతో పాటు, తాజాగా గణేష్ బాధితులూ ప్రశ్నించటం మీడియాలో ప్రముఖంగా వస్తోంది.
మరోప్రక్క వీటిని ఖండిస్తారని భావించిన బొత్స, తనకు గణేష్తో సంబంధం ఉంటే తప్పేమిటని, అతను సంఘవిద్రోహశక్తా అని ఎదురు ప్రశ్నించడంకూడా అంతటా చర్చనీయాంశమైంది. దాంతో గబ్బర్ సింగ్ కు సినిమా పరంగా వచ్చే క్రేజ్ కన్నా ఈ రకంగా మీడియాలో నలుగుతూ ఎక్కువ ఆసక్తి రేపుతోంది. బండ్ల గణేష్ అనే ఒక సాధారణ సినిమా ఆర్టిస్టు, కోట్లాదిరూపాయ లతో సినిమాలు తీస్తుండటం వెనుక బొత్స పెట్టుబడి ఉందంటూ టీడీపీ తాజాగా పేల్చిన బాంబు, సత్తిబాబును రాజకీయంగా ఇరుకున పెట్టింది.
విజయనగరం జిల్లాలో చంద్రబాబునాయుడును అడ్డుకున్న పీసీసీ చీఫ్ బొత్సపై ఎదురుదాడి చేసేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న తెలుగుదేశం పార్టీకి, సినిమా నిర్మాత బండ్ల గణేష్తో బొత్సకు ఉన్న లింకులు బ్రహ్మాస్త్రంలా అక్కరకొచ్చాయి. ఆ మేరకు 'తీన్ మార్' సినిమా ఫంక్షన్లో గణేష్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ గుర్తు చేసి, బొత్సను ఇరుకునపెట్టింది. 'నేను మర్డర్ చేసినా బొత్స నన్ను రక్షిస్తారు. బొత్స నన్ను ప్రోత్సహించారు. అన్నా.. అనుక్షణం నేను నీ వెంట ఉంటా. నీ ఇష్టం వచ్చింది చెయ్యి' అని బొత్స సమక్షంలో గణేష్ చేసిన వ్యాఖ్యల సీడీని రామయ్య మీడియాకు విడుదల చేయడంతో బొత్స పరిస్థితి ఇరుకున పడినట్టయింది.
మహబూబ్నగర్లోని బూరుగుపల్లిలో గిరిజనులకు చెందిన 2,700 వేల ఎకరాల అసైన్డ్ స్థలంలో కృష్ణవంశీకి 50 ఎకరాలు, ఇతర సినీ ప్రమఖు లతో పాటు ప్రముఖులకూ అమ్మి మోసం చేశారని, దీనిపై కృష్ణవంశీ నిలదీస్తే బొత్స, భాను పేరు చెప్పి బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తగినట్లుగానే.. గణేష్ వల్ల తాము నష్టపోయామంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం వెనుక బొత్స ఒత్తిళ్లు ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా గంటకో వార్తతో గబ్బర్ సింగ్ మారు మ్రోగిపోతోంది.


Click it and Unblock the Notifications











