పవన్ కళ్యాణ్ రాసిన పుస్తకంలో ఏముంది?

దేశ రాజకీయాలు ఏ దిశగా ఉండాలనే విషయంలో పవన్ ఇప్పటికే ఒక పుస్తకం రాశారని, దానిలోని అంశాలనే తన పార్టీ మేనిఫెస్టోలో చేర్చుతారని వినిపిస్తున్నది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ఈ నెల 12న హైదరాబాద్లోని హైటెక్స్లో ఏర్పాటు చేసే సభలోనే తన రాజకీయ రంగ ప్రవేశాన్ని కూడా ప్రకటిస్తారని సమాచారం. సమాజంలో రాజకీయాలు మారాల్సిన అవసరం, ప్రజాస్వామ్య దేశంలో హక్కులు, విధులు, ప్రజలతో ప్రభుత్వానికి ఉండాల్సిన సంబంధాలు తదితర అంశాలను పవన్ ఈ పుస్తకంలో ప్రస్తావించినట్లు తెలిసింది.
సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ... ''పవన్కు రాజకీయ అవగాహన చాలా ఎక్కువ. ప్రపంచ రాజకీయాల గురించి ఆయనకు బాగా తెలుసు. పుస్తకాలు కూడా విరివిగా చదువుతారు. ఆ పరిజ్ఞానంతో అప్పుడప్పుడూ.. తన అభిప్రాయాలను ఆయన అక్షరీకరించారు. అవన్నీ ఓ పుస్తక రూపంలో తీసుకొస్తున్నారు'' అని చెబుతున్నాయి.
పవన్ కల్యాణ్ పేరు రాజకీయాల్లోనూ నానుతోంది. పవన్ పార్టీ పెడతారని, లేదంటే ఏదో ఓ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం విస్త్రృతంగా జరుగుతోంది. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలడతారని కూడా చెప్పుకొంటున్నారు. అయితే పవన్ పార్టీ స్థాపించడానికే నిర్ణయించారన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు.. పార్టీ కోసం సన్నాహాల విషయంలో పవన్ సన్నిహితులు, కొంతమంది రాజకీయ ప్రముఖులు సలహాలు అందిస్తున్నట్లు సమాచారం.
ఈనెల 12న పవన్కల్యాణ్ తన సన్నిహితులతో ఓ సమావేశం ఏర్పాటు చేయాలని భావించారనీ, అదేరోజు తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేయాలని కూడా భావించినట్లు సమాచారం. అయితే, అదే తేదీన మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి బహిరంగ సభ ఉండటంతో, పవన్ తన సమావేశాన్ని ముందుకు జరిపినట్లు తెలిసింది. ఈ మేరకు రెండు రోజుల్లో సమావేశం నిర్వహించి, రాజకీయ పార్టీ పెట్టాలా, స్వతంత్రులుగానే పోటీ చేయాలా అనేది చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎన్నికల షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతమున్న సమయం సరిపోతుందా, సరిపోకపోతే ఏం చేయాలి, స్వతంత్రులుగా బరిలోకి దిగాలా వంటి అంశాలపై ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











