డ్రగ్ ఆరోపణలు చేయొద్దు.. మాకు కుటుంబాలు ఉన్నాయి.. నరేశ్
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని కొందరు నటీనటులపై వస్తున్న ఆరోపణలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యులు వివరణ ఇచ్చారు.
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని కొందరు నటీనటులపై వస్తున్న ఆరోపణలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యులు వివరణ ఇచ్చారు. మా అధ్యక్షుడు శివాజీరాజా, సీనియర్ నటుడు నరేశ్ మాట్లాడుతూ సినిమా పరిశ్రమపై ఇలాంటి మచ్చ పడటం చాలా బాధకరం అని అన్నారు. డ్రగ్ మాఫియాను అంతమొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన దిశలోనే పని చేస్తున్నదని నరేశ్ అన్నారు. డ్రగ్స్పై పోరాటానికి పరిశ్రమ సిద్ధంగా ఉంది అని ఆయన అన్నారు. ఇంకా ఆయన మీడియాతో మాట్లాడుతూ..

పరిశ్రమపై మచ్చపడటం బాధాకరం
డ్రగ్స్ వినియోగం అనేది కొందరు వ్యక్తుల సమస్య. సినీ పరిశ్రమ సమస్య కానేకాదు. తెలుగు సినిమా పరిశ్రమపై ఇలాంటి మచ్చపడటం బాధకరం. డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నవారికి శిక్ష పడాల్సిందే. ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుంది అని నరేశ్ అన్నారు. డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా సినిమా పరిశ్రమ పోరాడటానికి సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

నటీనటులకు కౌన్సెలింగ్ ఇస్తాం
ఒకవేళ డ్రగ్స్ మహమ్మారి బారిన పడిన సినీ ప్రముఖులకు, నటులకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి ‘మా' ముందుకొస్తుంది. సినిమా హీరోల పేర్లు బయటకు రావడం ఆందోళన కరంగా ఉంది. ఆధారాలు లేకుండా సంబంధం లేని వ్యక్తులపై లేనిపోని ఆరోపణలు చేసి మా ప్రతిష్ఠను దిగజార్చవద్దు. మేము మనుషులమే.. మాకు కుటుంబాలు ఉన్నాయి. అధికారికంగ పేర్లు బయటకు వచ్చినపుడు వారిపై కథనాలు రాయండి. వారిపై చర్యలు తీసుకొండి అని నరేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

నిజాయితీగా ఏం జరిగిందో చెప్పాలి..
మా అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. డగ్స్ ఆరోపణల నేపథ్యంలో సుబ్బరాజు నన్ను కలిశాడు. నిజాయితీగా ఏం జరిగిందో చెప్పమని ఆయనను కోరాను. సుబ్బరాజుతోపాటు ఇతర హీరోలతో మాట్లాడాను. అధికారులు అడిగిన ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు చెప్పవద్దు. డ్రగ్స్ మాఫియా వ్యవహారంలో ఇప్పటివరకు పోలీసులు ఎవరి పేర్లు చెప్పలేదు అని అన్నారు.

అకున్ సభర్వాల్ నిజాయితీగా ఆఫీసర్
డ్రగ్ మాఫియా ముఠా గుట్టురట్టు చేసి దర్యాప్తు చేపట్టిన అకున్ సభర్వాల్ నిజాయితీ గల ఆఫీసర్. ఆయన అబద్ధం ఆడరు. ఆరోపణలు వచ్చిన అందరు హీరోలకు సంబంధముండదు అని భావిస్తున్నాం. కొంత మందికి సంబంధాలు ఉంటే ఉండవచ్చు. డ్రగ్స్ మాఫియాతో సంబంధం లేకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటీనటులకు ‘మా' అండగా నిలిస్తుంది. ఈ వ్యవహారంలో ఎలాంట సందేహాలు ఉన్నా నన్ను గానీ, నరేశ్ గారిని గానీ సంప్రదించవచ్చు అని శివాజీ రాజా వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అకున్ సభర్వాల్ను సెలవులపై పంపించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











