యాక్టింగ్ లో గోల్డ్ మెడల్.. ఆఫర్లు లేవు.. సూసైడ్ చేసుకోవాలనుకున్నా..
చిత్ర సీమలో ఎంతోమంది మల్టీ టాలెంటెడ్ నటులు నణీమణులు ఉన్నారు. వారిలో చాలామంది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తమ తొలినాళ్లలో సినిమా అవకాశాల కోసం ఎంతో మంది ఆఫీసుల చుట్టు తిరిగారు. ఎన్నో కష్టాలను , అవమానాలను ఎదుర్కొన్నారు. చిన్న పాత్ర అయినా సరే అవకాశాన్ని దక్కించుకొని.. తమ అద్భుతమైన నటనతో మెప్పించి, విజయాలను అందుకున్నారు. అలా ఓ అగ్ర నటుడు తన తొలి కెరీర్ ప్రారంభంలో అవకాశాలు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడట. కానీ, ఊహించని అవకాశాన్ని అందుకుని గత 5 దశబ్దాలుగా రాణిస్తున్నారు. ఇంతకీ ఆ సీనియర్ హీరో ఎవరు?
ఆ సీనియర్ నటుడు ఎవరో కాదు.. మల్టీ టాలెంటెడ్ యాక్టర్, నట కీరిటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad). తొలుత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన కామెడీ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. హీరోలకు ఫ్రెండ్ గా.. మల్టీస్టారర్ మూవీస్ లో నటుడిగా.. అనేక పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అప్పట్లో రాజేంద్రప్రసాద్ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉండేది. ఆయన కామెడీ టైమింగ్ తో రొమాంటిక్ యాంగిల్తో అభిమానులను గిలిగింతలు పెట్టేవాడు. ఆనాటి సీనియర్ ఎన్టీఆర్ నుండి.. నేటి యంగ్ హీరోల వరకు దాదాపు 5 దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే రాజేంద్ర ప్రసాద్ తన తొలినాళ్లలో సినిమాలు అవకాశాలు రాక.. దాదాపు మూడు నెలల పాటు సరైన తిండి లేక .. రోజు ఓ అరటిపండు, మజ్జిగ తాగుతూ కాలం తెల్లబోశాడు. ఈ క్రమంలో సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం పురుగుల మందు బాటిల్ కూడా కొని సిద్ధమయ్యారు కూడా. కానీ, చివరిసారిగా మద్రాస్ లో తనని ఎంకరేజ్ చేసిన వారిని, ఆప్తులను కలిసి వద్దామని కోరిక తన జీవితాన్ని మార్చివేసింది. అనుకోని విధంగా అవకాశాన్ని అందుకొని తన కెరీర్ను ప్రారంభించారు రాజేంద్రప్రసాద్. తాజాగా యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న సవాళ్లను తెలిపారు.
సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..'నేను అంత పెద్ద అందగాడిని కాదు.. ఏదో పీల ముఖం, లాంగ్ హెయిర్ ఉండేది. ఓ కామన్ మ్యాన్ గా ఉండేవాణ్ణి. నాకు ఫిలిం ఇనిస్టిట్యూట్లో గోల్డ్ మెడల్ వచ్చినా.. అవకాశాలు మాత్రం అంత తొందరగా రాలేదు. వేషాలు ఇచ్చేంత గ్లామర్ లేదని నాకు కూడా తెలుసు. మా నాన్న స్కూల్ టీచర్.. ఆయన చాలా స్ట్రీట్ పర్సన్. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ లో పూర్తి చేసి.. ఎన్టీఆర్ గారితో సినిమాలకు రావాలని నిర్ణయించుకున్నాను. కానీ నా నిర్ణయం ఆయనకు నచ్చలేదు. ఆ సమయంలో మా నాన్న నాకు చిన్న వార్నింగ్ లాంటి మాట చెప్పాడు.
'మా ఇష్టానికి నిన్ను చదివించాం. నువ్వు చదివేసి సర్టిఫికెట్స్ మా ముఖాన కొట్టి నీ ఇష్టానికి వెళ్తున్నావ్. సక్సెస్ అయినా నీవే ఫెయిల్యూర్ అయినా నీవే.. అంతా నీదే బాధ్యత. ఒకవేళ ఫెయిల్ అయితే ఇంటికి రావద్దు అని వార్నింగ్ ఇచ్చారు. ఆరోజు నేను ఫిక్స్ అయ్యాను సినిమా కోసం వచ్చి ప్రయత్నాలలో విఫలమైతే ఇంటికి వెళ్ళొద్దని, నాకు మా పెద్దన్నయ్య అవసరానికి డబ్బులు పంపించేవాడు. ఓసారి అనుకోకుండా 'ఇంటికి వెళ్తే ఎందుకు వచ్చావు' అంటూ మా నాన్నగారు కోప్పడ్డాడు. ఆ బాధ తో వెంటనే మద్రాస్ కు తిరిగి వచ్చాను. కానీ ఇక్కడ సరైన అవకాశాలు రాలేదు అని రాజేంద్రప్రసాద్ అన్నారు
' నాకు నా మీద నమ్మకం ఉంది. ఏదైనా చిన్న పాత్ర అయినా దొరకపోతదని, హీరో అయితే అని ఎప్పుడూ అనుకోలేదు.. ఎందుకంటే నా ముఖం నాకు తెలుసు. మీ అభిమానం వల్ల నేను హీరో అయ్యాను. కానీ నాకు అంత సీన్ లేదు. నేను తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. ఆ సమయంలో నాకు చిల్లర దాచుకునే అలవాటు ఉంది. ఆ చిల్లర ఎన్ని రోజులు వస్తాయో.. అన్ని రోజులు రోజుకు ఒక అరటిపండు, కాసింత మజ్జిగ తో జీవించాలని నిర్ణయించుకున్నా. ఓ రోజు ఆ డబ్బులు కూడా పూర్తయిపోయాయి. ఆ సమయంలో చనిపోదామని నిర్ణయించుకున్నా.. పురుగుమందు కుడా కొట్టి తెంచుకున్నా ' అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
' ఆ సమయంలో మద్రాస్ లో ఎన్ని రోజులు తనని చూసుకున్న ఆత్మీయులను, స్నేహితులను ఓసారి చూడాలనిపించింది. మొదట ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్లాను. ఆయన ఏదో పనిలో హడావిడిగా ఉన్నారు. నను చూసి ఏమైందని ప్రశ్నించారు. ఏం లేదంటూ బయటికి వచ్చేసాను. ఆ తర్వాత నిర్మాత పుండరీకాక్షయ్య గారి ఆఫీస్ కి వెళ్ళాను. ఆఫీసులో 'మేల్కొలుపు' అనే సినిమాకు సంబంధించిన ఏదో గొడవ జరుగుతుంది. ఆ గొడవ పూర్తయితుందని దాదాపు గంటసేపు ఆఫీసులోనే కూర్చొని ఉన్నాను.ఇక ఫలితం లేదని వెళ్లిపోతుండగా.. సడన్ గా పుండరీకాక్షం గారు బయటకు వచ్చి నన్ను చూశారు.' అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు
'ఏంటి ప్రసాద్ ఇలా వచ్చావు? ఎంతసేపు అయింది అంటూ నా గురించి ఆరా తీశారు. నేను సమాధానం చెప్పేలోపే.. మేలుకొలుపు సినిమా డైరెక్టర్ ప్రసాద్ ను త్వరగా బయటికి రమ్మని పిలిచారు. 'ఇన్ని రోజులు సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా తిరిగినట్లు' మన రాజేంద్ర ప్రసాద్ ను మరిచిపోయి.. వేరే వారి కోసం ట్రై చేస్తున్నాం. ఆ సమయంలో వారు ఏం మాట్లాడుకుంటున్నారో.. ఏం చేస్తున్నారో నాకేం అర్థం కాలేదు. వెంటనే కారు ఎక్కించుకొని..వారాయి స్టూడియోకు తీసుకెళ్లారు. నాకు ఒక సీన్ ఇచ్చి వెంటనే డబ్బింగ్ చెప్పమన్నారు వాళ్ళు అనుకున్న విధంగానే నేను డబ్బింగ్ చెప్పేసాను' అని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు
' దాంతో పుండరీకాక్షం గారు డైరెక్టర్ ప్రసాద్ గారు.. నా దగ్గరకి పరుగెత్తుకంటూ వచ్చి చాలా సంతోషపడ్డారు. సమయానికి దొరికావ్ అంటూ ప్రసాద్ గారు అన్నారు. వెంటనే రెండో సీన్ కు డబ్బింగ్ చెప్పమని సీన్ పేపర్ ఇచ్చారు. 'నేను భోజనం చేసి మూడు నెలలు అవుతుంది భోజనం పెడితే డబ్బింగ్ చెప్తా' అని అన్నాను దీంతో పుండరీకాక్షయ్య తో అన్నాను. దీంతో ఆయన షాక్ అయ్యారు. భోజనం ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. 'అవకాశాలు లేవు సార్.. డబ్బుల్లేవు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను' అంటూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్.
' ఆ సమయంలో పుండరీకాక్షం నా మీద చాలా కోప్పడ్డారు. మేము లేమనుకున్నావా అంటూ తెగ తిట్టారు. వెంటనే ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టి .. నాకు ధైర్యం చెప్పారు. అలా మేలుకొలుపు సినిమాతో నా డబ్బింగ్ కెరీర్ ప్రారంభమైంది. అలా ఎన్నో సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. అలా డబ్బింగ్తో వచ్చిన డబ్బులతో మద్రాస్ లో ఇల్లు కట్టాను.ఈ సమయంలో ఎంతోమందితో పరిచయాలు ఏర్పడాయి. ఆ పరిచయాల్లో డైరెక్టర్ వంశీ ఒకరు. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం వల్లనే నన్ను హీరోగా పెట్టి 'ప్రేమించు పెళ్ళాడు' సినిమా తీశారు. కానీ ఆ సినిమా ప్లాప్ అయింది. కానీ ఆ తర్వాత 'లేడీస్ టైలర్' అనే సినిమా తీసి బ్లాక్ బట్ బస్టర్ అందుకున్నారు. ఆ హిట్టుతో మరోసారి తిరిగి వెనకకు చూసుకోలేదు. అప్పటినుండి ఇప్పటివరకు దాదాపు 47 ఏళ్ల సినీ ప్రస్థానం విజయవంతంగా సాగుతోంది అంటూ చెప్పుకొచ్చారు రాజేంద్రప్రసాద్


Click it and Unblock the Notifications











