బలముందని దోచుకుంటే , ‘పెద్దాయన’ మీ దూల తీర్చేస్తాడు : ఏపీ రాజకీయాలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు
చిన్నాచితకా పాత్రలు చేస్తూ, తర్వాత హీరోగా ఎదిగి గుర్తింపు తెచ్చుకున్నారు శివాజీ. మధ్యలో ఏమైందో తెలియదు గానీ ఆయన రాజకీయాల్లో ప్రత్యక్షమయ్యారు. మళ్లీ కొన్నాళ్లు సైలెంట్.. శివాజీ ఎవరికీ కనిపించలేదు. అయితే అనూహ్యంగా తెలుగు బిగ్బాస్లో తళుక్కున మెరిసి షాకిచ్చారాయన. హౌస్లో ఎవరినైతే తోటి కంటెస్టెంట్స్ ఎక్కువగా హింసిస్తారో అలాంటి బాధితులకు అండగా నిలిచారు శివాజీ. పల్లవి ప్రశాంత్ టైటిల్ కొట్టడంలో , ప్రిన్స్ యావర్ కెప్టెన్ కావడం వెనుక శివాజీ మైండ్ గేమ్ వుంది.
స్వయంగా నాగార్జున కూడా శివాజీని చాణక్య అన్నారంటే ఆయన ఎలాంటి ముద్ర వేశారో అర్ధం చేసుకోవచ్చు. బిగ్బాస్ టైటిల్ రేసులో నిలిచిన శివాజీ అనూహ్యంగా సైడ్ అవ్వడంతో ప్రేక్షకులు నిరాశపడ్డారు. ఇంతకాలం బయటకు తెలియని శివాజీని బిగ్బాస్ జనానికి చూపించాడు. ఈ మెగా రియాలిటీ షో ద్వారా తెలుగు లోగిళ్లకు బాగా దగ్గరైన శివాజీకి తర్వాత అవకాశాలు వెల్లువెత్తాయి.

సినిమాలలో రీ ఎంట్రీతో పాటు ఓటీటీలోనూ ఆయన ఎంట్రీ ఇచ్చారు. శివాజీ, వాసుకీ లీడ్ రోల్స్లో నటించిన #90's వెబ్ సిరీస్కు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. మధ్య తరగతి కుటుంబాల్లో చోటు చేసుకునే పరిణామాలను ఈ సిరీస్లో అద్భుతంగా ప్రజంట్ చేశారు. ఈటీవీ విన్లో ఆరు ఎపిసోడ్స్గా స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్సిరీస్ మంచి ఆదరణ పొందింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. కొందరు సినీతారలు ఏపీలో విస్తృతంగా ప్రచారం చేస్తుంటే.. ఇంకొందరు సోషల్ మీడియా ద్వారా మద్ధతు ప్రకటిస్తున్నారు. మరి అసలే రాజకీయాలంటే పడిచచ్చిపోయే శివాజీ సైలెంట్గా వుంటారా అందుకే ఏపీ పాలిటిక్స్పై తనదైనశైలిలో స్పందించారు.
ఇటీవల తిరుపతిలో ఓ హోటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన శివాజీ మీడియాతో మాట్లాడుతూ.. ఫలానా వ్యక్తికి, పార్టీకి ఓటు వేయాలని తాను చెప్పనన్నారు. కానీ ఎవరు అధికారంలో వున్నా తప్పు జరిగితే ఖచ్చితంగా మాట్లాడతానని , మే 13న తప్పనిసరిగా అందరూ ఓటు వేయాలని శివాజీ కోరారు. ఒక గంట సమయం కేటాయించడానికి ఎందుకంత బాధ అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రేపటి తరానికి దక్కాల్సిన ఆస్తుల్ని కొందరు దోచుకుంటున్నారని.. కర్మ ఈజ్ బ్యాక్ అన్నట్లు పాపాలన్నీ తగిలి రేపటి రోజున తినడానికి కూడా ఏం వుండదని శివాజీ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్, మన తెలుగువాళ్లు ఎక్కడున్నా బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. ఏ పార్టీ అధికారంలో వున్నా మాట్లాడాలంటేనే జనం భయపడుతున్నారని .. అసలు ప్రజలను భయపెట్టడానికి వీళ్లంతా ఎవరని శివాజీ ఫైర్ అయ్యారు. తప్పు చేస్తే పోలీసుల మీదనైనా కేసు పెట్టొచ్చని.. ఎవరికీ భయపడొద్దని , మనం కట్టే పన్నులతోనే ఉద్యోగులు, రాజకీయ నేతలు జీతాలు తీసుకుంటున్నారని తెలిపారు.
ప్రశ్నిస్తే ఏం చేస్తారు.. మహా అయితే నా స్థలాలను లాక్కుంటారని పెద్దాయన వున్నాడుగా ఆయనే చూసుకుంటాడని శివాజీ చెప్పారు. తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెబుతూ ఒక సినిమాలో తాను విలన్గా , హీరోగా ఓ మూవీలో యాక్ట్ చేస్తున్నానని తెలిపారు. ఒకప్పటి హీరోయిన్ లయతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్లుగా శివాజీ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











