Vishal: కుప్పం నుంచి బాబుకు పోటీగా విశాల్.. అసలు విషయం చెప్పేశారుగా!
కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి తమిళ హీరో విశాల్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వస్తోంది. తాజాగా ఈ విషయం మీద వైసిపి నేతలు క్లారిటీ ఇచ్చారు. లోకి వెళితే...

వైసీపీ ఎమ్మెల్యేగా
తమిళంలో స్థిరపడిన విశాల్ తండ్రి చిత్తూరు జిల్లా వాసి కావడంతో విశాల్ ను తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మీద పోటీకి దింపే అవకాశం ఉందంటూ కాస్త కొద్ది రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం విశాల్ సామాజిక వర్గం కూడా ఒక్కటే కావడం గతంలో కొన్నిసార్లు వైయస్ జగన్ పరిపాలన బాగుందంటూ ఆయన కామెంట్లు చేయడంతో ఆయనకు వైసిపి టికెట్ ఖాయమని ఎలా అయినా చంద్రబాబును ఓడించే ఉద్దేశంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఇలా రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి.

ఎట్టకేలకు క్లారిటీ
అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు ఎవరు స్పందించకపోవడంతో ఇవి నిజమేనని కొందరు భావించారు. కానీ తాజాగా అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లాలో జరుగుతున్న ప్లీనరీ సమావేశాలలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యెల్లో మీడియా ఒక నటుడు మా కుప్పం అభ్యర్థి అంటూ కథనాలు సృష్టించిందని అయితే అందులో ఎలాంటి నిజం లేదని ఆయన పేర్కొన్నారు.

అది నిజం కాదని
2014, 2019 ఎన్నికల్లో రిటైర్డ్ IAS అధికారి చంద్రమౌళి పోటీ చేశారు. రెండు దఫాలు చంద్రబాబు చేతిలో చంద్రమౌళి ఓటమి పాలయ్యాడు. ఇటీవలనే అనారోగ్యంతో చంద్రమౌళి మరణించడంతో వైసీపీ కుప్పం అసెంబ్లీకి ఇంచార్జీగా చంద్రమౌళి తనయుడు భరత్ ను పార్టీ ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుపై భరత్ పోటీ చేస్తారనే విషయమై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ క్లారిటీ ఇచ్చారు.

భరత్ మా అభ్యర్థి
భారత్ మా అభ్యర్థిగా ఉంటారని అందులో ఎలాంటి అనుమానం అక్కరలేదు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. విశాల్ తమిళ రాజకీయంలో కూడా ముఖ్య పాత్ర పోషించడానికి ప్రయత్నించినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. దానికి అనుగుణంగానే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేశారు కానీ ఆయనకు సరైన ఆదరణ దక్కలేదు. తమిళ నటీనటులకు సంబంధించిన నడిగర్ సంఘం ఎన్నికలలో పోటీ చేసి పలుసార్లు అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు.

తండ్రి వారసత్వం
ఆయన తండ్రి ప్రముఖ నిర్మాత కాగా తండ్రి వారసత్వాన్ని అందుకుని సినీ రంగంలోకి విశాల్ ప్రవేశించారు. వారసుడిగా ప్రవేశించినా సరే ఆయన తనదైన శైలిలో సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఎక్కువగా మాస్ సినిమాలకు తమిళనాట మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక కుప్పంలో మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారనీ అంటూ ఉంటారు.

అదేమీ లేదని
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మెజారిటీ ఎంపీటీసీ, జడ్పీటీసీలు వైసీపీ గెలుచుకోవడంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఉందనే ప్రచారం ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించే బాధ్యతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకోవడంతో విశాల్ ను రంగంలోకి దింపే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ అదేమీ లేదని ఇప్పుడు ఆయన తేల్చేశారు.


Click it and Unblock the Notifications











