హిమాలయాల్లో నయనతార ఆధ్యాత్మికయాత్ర
హైదరాబాద్ : 'శ్రీరామరాజ్యం' చిత్రంలో 'సీత'గా మెప్పించిన నయనతార నిజజీవితంలోనూ ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తోంది. నటిగా బిజీగా ఉన్న నయనతార ఇటీవల హిమాలయాలకు వెళ్లింది. అక్కడకు చేరుకున్నాక కాషాయం దుస్తులు, రుద్రాక్ష మాల ధరించి అక్కడి పవిత్ర ఆలయాలకు కాలి నడకనే వెళ్లి దర్శించుకుందట. గత మూడేళ్ల కిందట చెన్నైలోని ఆర్యసమాజంలో హిందూ మతాన్ని స్వీకరించిన నయనతార హిందూ పవిత్రాలయాలను దర్శిస్తున్నారు.
ఆ మధ్య పెళ్లి చేసుకుంటున్నానంటూ సినిమాలకు బై చెప్పేసిన నయనతార మళ్లీ ఊహించని విధంగా సీన్ లోకి వచ్చి బిజీ అయ్యింది. బిజీ అవ్వటమే కాక వరస హిట్స్ కొడుతోంది. తమిళంలో 'రాజా రాణి', 'ఆరంభం' సినిమాలతో వరుస విజయాలు అందుకొంది నయన్. తెలుగులో 'అనామిక'తో పాటు గోపీచంద్తో ఓ చిత్రం చేస్తోంది. ఈ నేఫద్యంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టాక పట్టిందల్లా బంగారమే అన్నట్టుంది అని చెప్తోంది.
సెకండ్ ఇన్నింగ్స్ గురించి నయనతార మాట్లాడుతూ... ''చిత్ర పరిశ్రమకి నేనెప్పుడూ దూరం కాలేదు. అందుకే కెరీర్ని మళ్లీ కొత్తగా ప్రారంభించానని నాకెప్పుడూ అనిపించలేదు. అందరూ అంటున్నారు కాబట్టి నేను కూడా రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాననే చెబుతున్నాను. నాపై ప్రేక్షకులు ఎప్పట్లాగే ఆదరణ చూపిస్తుండడం మాటల్లో చెప్పలేనంత అనుభూతినిస్తోంది. దర్శకులకు కూడా నాపై మరింత నమ్మకం పెరిగిందేమో మరి. అందరూ ప్రాధాన్యమున్న పాత్రలను అప్పజెబుతున్నారు. ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?'' అని చెప్పుకొచ్చింది.

ఇక నయనతార తాజా చిత్రం అనామిక విషయానికి వస్తే...సగటు ఇల్లాలు... అనామిక. ఆమెకి భర్త, ఇల్లే లోకం. సరదాగా సాగిపోతున్న ఆమె కాపురంలో ఉన్నట్టుండి ఓ అలజడి. తన భర్త ఎక్కడో తప్పిపోయాడు. ఎటు వెళ్లాడో, ఎలా వెళ్లాడో తెలియదు. ఎంత ఎదురు చూసినా ఫలితం లేదు. దీంతో తనే భర్త కోసం అన్వేషణ మొదలుపెట్టింది. హైదరాబాద్ పాతబస్తీకి చేరుకొంది. ఎదురు పడిన ప్రతీ ఒక్కరినీ 'నా భర్త జాడ చెప్పరూ' అంటూ వేడుకొంటోంది. మరి అనామిక భర్త దొరికాడా? లేదా? తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అనామిక'.
నయనతార ప్రధాన పాత్రలో నటించింది. వైభవ్, హర్షవర్ధన్ రాణే కీలక పాత్రలు పోషించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. దర్శకుడు మాట్లాడుతూ ''ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబించే కథ ఇది. భర్త జాడ కనుక్కొనేందుకని బయటికి వచ్చిన ఓ మహిళకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఆసక్తికరం.
హిందీ 'కహానీ' ఆధారంగా రూపొందిన చిత్రమే అయినా... మన వాతావరణానికి తగ్గట్టుగా కథలో మార్పులు చేశాం. ఇందులోని భావోద్వేగాలు మనసుల్ని హత్తుకొనేలా ఉంటాయి. పాతబస్తీ ప్రాంతాన్ని కొత్తకోణంలో చూపించే ప్రయత్నం చేశాం'' అన్నారు. ఈ చిత్రాన్ని వయాకామ్ 18, ఐడెంటిటీ మోషన్ పిక్చర్స్, లాగ్లైన్ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మించాయి.


Click it and Unblock the Notifications











