ప్రముఖ నటి శ్రీవిద్య మృతి
ప్రముఖ నటి శ్రీవిద్య గురువారం సాయంత్రం చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కొద్దికాలంగా అస్వస్థులైన శ్రీవిద్య వయస్సు 53 సంవత్సరాలు. తమిళ, తెలుగు, మళయాల, కన్నడ చిత్రాలలో ప్రతిభావంతురాలైన నటిగా రాణించిన శ్రీవిద్య మంచి గాయని మాత్రమే కాదు, భరతనాట్యం నృత్యకారిణి.
ప్రముఖ కర్నాటక విద్వాంసురాలు ఎం.ఎల్. వసంతకుమారి కుమార్తె అయిన శ్రీవిద్య 1953 జూలై 25లో జన్మించారు. 13 సంవత్సరాలకే తమిళ చిత్రం తిరువరుట్చెల్వార్ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రీవిద్య తర్వాత మళయాలంలో చట్టంబిక్కవల చిత్రం ద్వారా పాపులర్ నటి అయ్యారు. తెలుగులో దాసరి నారాయణరావు దర్శకత్వంలో తూర్పు - పడమర చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇప్పటికి ఆమె 800 చిత్రాలలో అనేక పాత్రలను పోషించారు. 70 దశకాల్లో ప్రేమ్నజీర్తో కలిసి మళయాలంలో ఆమె నటించిన అనేక చిత్రాలు విజయవంతం అయ్యాయి.
కొద్దికాలంగా క్యాన్సర్తో బాధపడిన ఆమె చివరి రోజులలో ఒంటరిగా జీవితం గడిపారు. చివరిగా ఆమెను కలసి కమల్ హాసన్ మాత్రమే పలుకరించారు. శ్రీవిద్య అకాల మృతికి యావత్ దక్షిణాది చలన చిత్రసీమలు ప్రగాఢ సంతాపం ప్రకటించాయి.


Click it and Unblock the Notifications