Adipurush: హనుమంతుడి నోట అలాంటి డైలాగ్.. పల్లెటూరు నుంచి వచ్చానంటూ రచయిత
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కువ చర్చ జరుగుతోంది ప్రభాస్ ఆదిపురుష్ సినిమా పైన. ఇది వరకు ఇండియన్ సినిమాలో అనేకమైన రామాయణ గాథలను వెండితెరపై ఆవిష్కరించారు. అయితే ఎవరూ పొందలేని తీవ్రమైన నెగెటివిటీని ఆదిపురుష్ మూవీ ఆది నుంచే ఎదుర్కొంటోంది. ఆదిపురుష్ టీజర్ విడుదల తర్వాత పాత్రల తీరు నుంచి గ్రాఫిక్స్ వరకు ప్రేక్షకులు, రాజకీయ నేతలు, సామాజిక వేత్తలు పెదవి విరిచారు. ఇక తాజాగా ఆదిపురుష్ మూవీ విడుదల కాగా మళ్లీ అదే పరిస్థితి ఏర్పడింది.
తీవ్రమైన నెగెటివిటీ: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ ఆదిపురుష్. ఈ సినిమాపై డార్లింగ్ అభిమానులే కాదు.. ప్రేక్షకులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆదిపురుష్ సినిమా విషయంలో అనుకుంది ఒకటి. జరిగింది మరొకటి. సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ ఎలా వస్తున్నాయో.. అలాగే తీవ్రమైన నెగెటివిటీ కూడా వస్తోంది.

హనుమాన్ డైలాగ్: రామ భక్తులంతా సినిమా చూసి పండుగ చేసుకుంటారనుకుంటే చాలా మంది పూర్తిగా మెచ్చుకోలేక.. నొచ్చుకోలేక మౌనంగా ఉండిపోతున్నారు. అంతేకాకుండా ఆదిపురుష్ మూవీలోని సీన్లు, డైలాగ్ లపై పొలిటికల్ లీడర్స్ నుంచి ప్రేక్షకుల వరకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందులో ఒకటే హనుమాన్ తో చెప్పించిన ఓ డైలాగ్.
మాస్ డైలాగ్ అవసరమా: సీతాదేవి లంకలో ఉన్నప్పుడు ఆమె కోసం వెళ్లిన హనుమంతుడు తోకకు నిప్పు పెడతారు. అప్పుడు ఇంద్రజిత్తుతో నా తోకకు కట్టిన గుడ్డ నీ బాబుది.. దానికి రాసిన చమురు నీ బాబుది.. నిప్పు కూడా నీ బాబుకే అని హనుమాన్ డైలాగ్ చెబుతాడు. ప్రస్తుతం ఈ డైలాగ్ పైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతోమంది ఆరాధించే హనుమాన్ కి ఇంతటి మాస్ డైలాగ్ అవసరమా అని చర్చ జరుగుతోంది.

వైవిధ్యం చూపించాలని: హనుమాన్ డైలాగ్ వివాదంపై తాజాగా ఆదిపురుష్ డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ రియాక్ట్ అయ్యారు. "నావైపు నుంచి ఎలాంటి తప్పు లేదు. ఎంతో నిశితంగా ఆలోచించాకే హనుమంతుడికి సంభాషణలు రాశాను. సినిమాలో చాలా పాత్రలు ఉన్నాయి. అందరూ ఒకేలా మాట్లాడరు కదా. పాత్రల మధ్య వైవిధ్యం చూపించాలనే హనుమంతుడి భాషను సింపుల్ గా ఉండేలా జాగ్రత్తపడ్డాను" అని రచయిత మనోజ్ ముంతాషిర్ తెలిపారు.

సింపుల్ గా చెప్పేవారు: "లంక దహన సమయంలో హనుమంతుడు చెప్పే డైలాగ్ గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కానీ మనందరికీ రామాయణం ఎలా తెలుసు. చిన్నప్పటి నుంచి కథలు కథలుగా చెప్తేనే కదా మనం తెలుసుకున్నాం. రామాయణంపై ఎన్నో గ్రంథాలు కూడా ఉన్నాయి. నేను పల్లెటూరి నుంచి వచ్చినవాడిని. నాకు మా నానమ్మ, అమ్మమ్మలు రామాయణ కథలను చాలా సింపుల్ గా చెప్పేవారు. జానపద కళాకారులు కూడా హనుమంతుడి సంభాషణలు ఇలాగే చెప్పేవారు. దాన్నే నేను ఆదిపురుష్ లో వాడాను. అంతే తప్పా నేనేమి కొత్తగా డైలాగ్ సృష్టించలేదు" అని రైటర్ మనోజ్ ముంతాషీర్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











