యేదిల్ హై ముష్కిల్...రిలీజ్కు లైన్ క్లియర్ : పాక్ నటులతో చేస్తే రూ. 5 కోట్లు కట్టాల్సిందే!
ముంబై: ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ... ప్రధాన పాత్రల్లో కరణ్ జోహార్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ 'యే దిల్ హై ముష్కిల్'. ఈచిత్రంలో పాకిస్థాన్ నటుడు ఫావద్ ఖాన్ కీలకపాత్రలో నటించాడు.
యూరి ఘటన తర్వాత భారత్-పాక్ దేశాల మధ్య సీరియస్ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో.... పాకిస్థాన్ నటులు ఇండియా విడిచి వెళ్లి పోవాలని, వారు నటించిన సినిమాలను విడుదల కానివ్వం అంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేనతో పాటు పలు రాజకీయ పార్టీలు హెచ్చరించాయి. థియేటర్ల యజమానుల సంఘం కూడా పాక్ నటులు ఉన్న సినిమాలను నిషేదిస్తున్నట్లు ప్రకటించాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో.... దీపావళి సందర్భంగా ఈ నెల 28న రిలీజ్ కావాల్సిన 'యే దిల్ హై ముష్కిల్' మూవీ కష్టాల్లో పడింది. దీంతో సినిమా రిలీజ్ సాఫీగా అయ్యేలా ఉండేందుకు నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు ముఖేష్ భట్ తో కలిసి మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేను కలిసారు.

ఇకపై ఎప్పుడూ పాకిస్థాన్ నటులతో సినిమాలు చేయబోమని, ఈ సారికి సినిమా విడుదలకు అవకాశాలు ఇవ్వాలని కరణ్ జోహార్, ముఖేష్ భట్ విన్నవించారు. వారిని కలిసిన అనంతరం ముఖేష్ భట్ మీడియాతో మాట్లాడుతూ.... యే దిల్ హై ముష్కిల్ చిత్రం విడుదలకు దారి క్లియర్ అయిందని, సినిమా షెడ్యూల్ ప్రకారం విడుదలవుతుందని తెలిపారు.
ఇకపై పాకిస్థాన్ నటులతో బాలీవుడ్ కి సంబంధించిన నిర్మాతలుగానీ, ఫిల్మ్ మేకర్స్ గానీ సినిమాలు చేయబోమని తీర్మానించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన రెసొల్యూషన్ కాపీని బ్రాడ్ కాస్టింగ్ మినిస్ట్రీతో పాటు సీఎంకు అందజేసినట్లు తెలిపారు.
యే దిల్ హై ముష్కిల్ మూవీ ప్రదర్శించే థియేటర్లలో.... యూరి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళులు అర్పిస్తూ స్లైడ్స్ ప్రదర్శించనున్నట్లు ముఖేష్ భట్ తెలిపారు. యే దిల్ హై ముష్కిల్ సినిమా ద్వారా వచ్చే రెవెన్యూలో కొంత మొత్తాన్ని ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కోసం కేటాయించనున్నట్లు తెలిపారు.
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే మాట్లాడుతూ...'ఇకపై పాకిస్థాన్ నటులతో సినిమాలు చేసే నిర్మాతలు రూ. 5 కోట్ల ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కు కేటాయించాల్సి ఉంటుంది' అని హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











