సెన్స్బోర్డు వివాదం, మరో 9 మంది రాజీనామా
ముంబై: డేరా సచ్చ సౌధా సంస్థ అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ స్వయంగా నటిస్తూ రూపొందించిన ‘మెసెంజర్ ఆఫ్ గాడ్' సినిమా విడుదలను అడ్డుకోవాలని కేంద్రం ఒత్తిడి తెచ్చిందని పరోక్షంగా ఆరోపిస్తూ కేంద్ర సెన్సార్ బోర్డు బోర్డు చైర్పర్సన్ లీలాశాంసన్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆమె రాజీనామాను కేంద్రం ఆమోదించింది. ప్రతి సినిమా విషయంలోనూ ఒత్తిళ్లు వస్తున్నాయని.. దీనిని సహించలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
https://www.facebook.com/TeluguFilmibeat
కాగా....లీలాశాంసన్కు మద్దతుగా మరో 9 మంది బోర్డు సభ్యులు రాజీనామా చేసారు. వీరిలో సభ్యులు ఇరా భాస్కర్, మరో సభ్యురాలు నందీనీ సర్దేశాయ్ లాంటి వారు ఉన్నారు. ఈ సెన్సార్ బోర్డు వివాదం ఇప్పుడు చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఈ పరిణామాలు సెన్సార్ బోర్డు వ్యవహారాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఎలా ఉందో స్పష్టం చేస్తోంది.
గత కొంత కాలంగా రాజకీయ నాయకుల జోక్యాన్ని మౌనంగా సహిస్తూ వస్తున్న సెన్సార్ బోర్డు సభ్యులు.....తాజాగా ‘మెసెంజర్ ఆప్ గాడ్' సినిమా విషయంలోనూ అదే పరిస్థితి పునరావృతం కావడంతో ధైర్యం చేసి ఎదురు తిరిగారు. గతంలో పీకే సినిమాలోని కొన్ని సన్నివేశాలను కత్తిరించాలని బోర్డు సభ్యులపై చాలా ఒత్తిడి వచ్చిందని తెలిపారు.
బోర్డు సభ్యులు తొమ్మిది నెలలుగా సమావేశం కాలేదని.. ఇలాంటి పరిస్థితుల్లో సంస్థ నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని లీలా శాంసన్ ప్రశ్నించారు. కేంద్రంనుంచి ఒక్క పైసా నిధులు విడుదల చేయడం లేదన్నారు. పైగా బోర్డు చైర్పర్సన్, సభ్యుల పదవీకాలం ముగిసిందని.. ఇంకా కొత్తవారిని నియమించడంలో ప్రభత్వం విఫలమైందని అన్నారు. ఇటీవల బోర్డు నిర్ణయాల్లో ఐఅంబ్బీ శాఖ జోక్యం పెరిగిపోవడం.. అదనపు బాధ్యతలతో కొత్తగా సీఈవోను నియమించి బోర్డుపై ఆజమాయిషీకి ప్రయత్నించడం, సభ్యులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటంతో సెన్సార్బోర్డు పరువు గంగలో కలుస్తున్నదని ఆమె ఆరోపించారు.

అయితే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన లీలాపై కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ ప్రతి విమర్శలు చేశారు. సెన్సార్ బోర్డు వ్యవహారాల్లో ఎన్నడూ ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని.. ఏ సినిమా విడుదలను అడ్డుకోలేదని స్పష్టంచేశారు. ఆమె కొన్ని నెలలుగా కార్యాలయానికి రావడంలేదని.. బాధ్యతలపై పెద్దగా దృష్టి పెట్టేవారు కాదని తెలిసిందన్నారు. రాజీనామా ఆమె వ్యక్తిగత విషయమన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అవినీతికి పాల్పడుతున్న ప్యానల్ సభ్యులెవరో ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
‘మెసెంజర్ ఆఫ్ గాడ్' సినిమాపై ఆందోలన
పంజాబ్ లోని సిక్కు వర్గీయులు, డేరా వర్గీయులకు అసలు పడదు. ఈ సినిమా తమకు వ్యతిరేకంగా ఉందనే కారణంతో సిక్కు సంప్రదాయ సంస్థలైన దళ్ ఖల్సా, శిరోమణి అకాలీదళ్ వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. అయితే వ్యతిరేకించే వారంతా ఒక్కసారి తన సినిమా చూడాలని అందులో ఏమైనా అభ్యంతరకర దృశ్యాలుంటే అప్పుడు నిర్ణయం తీసుకోవాలని డేరా సచ్చా సౌద చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ కోరారు. దేవుడినని ప్రచారం చేసుకోవడానికి ఈ సినిమా తీయలేదని.. డ్రగ్స్కు వ్యతిరేకంగా, వ్యభిచారిణులకు పునరావాసం కల్పించాలన్న కథాంశంతో సినిమా తీశామన్నారు.


Click it and Unblock the Notifications











