అది తప్పదు.., సినిమాలపై మళ్లీ క్లారిటీ ఇచ్చేశాడు, పవన్ ఏమన్నారంటే?
వెండితెరా?.. రాజకీయ తెరా?.. తేల్చుకునే సందర్భం వచ్చినప్పుడు ఇంకా మీన మేషాలు లెక్కిస్తూ కూర్చోవడం మొదటికే మోసం తెస్తుంది. ఆవిధంగా ఇప్పటికే చాలా విమర్శలు ఎదుర్కొన్న పవన్ కల్యాణ్.. ఎట్టకేలకు.. ఇక తన పంథా రాజకీయమేనని నిర్దారించుకున్నారు. ప్రజాక్షేత్రంలోనే తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో ఛలోరే ఛల్ యాత్ర సందర్భంగా పవన్ కల్యాణ్ మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చారు.
Recommended Video


తప్పదు.. మీడియాను ఫేస్ చేయాల్సిందే!:
సాధారణంగా పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటారు. సినిమా వరకు అది ఆయనకేమి నష్టం కాకపోయినా.. రాజకీయాల్లో మాత్రం అది కుదరని పనే. తమ లక్ష్యాలను, ఉద్దేశాలను, భావజాలన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మీడియాను ఫేస్ చేయాల్సిందే.
వాళ్లడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పి మెప్పించాల్సిందే. కాబట్టి పవన్ కూడా ఇప్పుడు మీడియాను దూరం పెట్టడానికి ఇష్టం పడటం లేదు. అందుకే తాజాగా ఓ మీడియా ప్రతినిధికి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.

మరోసారి క్లారిటీ ఇచ్చేశారు:
ఇంటర్వ్యూ సందర్భంగా.. సినిమాల్లోనూ నటిస్తారా?.. లేక పూర్తి స్థాయిలో రాజకీయాలేనా?.. అన్న ప్రస్తావన వచ్చినప్పుడు.. 'పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉంటానని ఇప్పటికే చెప్పేశాను' అని పవన్ మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. అంటే, ఇకనుంచి పవన్ కల్యాణ్ ను వెండితెరపై చూసే అవకాశం లేదన్నమాటే.

ప్రజాస్వామ్యబద్దంగానే:
తాను ఏ ఉద్దేశంతో వచ్చానో ఆ ప్రయత్నం చేశానని, ఈ యాత్ర తన మొదటి అడుగని పవన్ అన్నారు. తనకున్న భావాలను కార్యకర్తలకు తెలియజేశానని, ప్రజాస్వామ్యబద్దంగానే ముందుకు వెళ్తున్నానని స్పష్టం చేశారు. తనకు ఎవరి మీద ద్వేషం లేదని చెప్పుకొచ్చారు.

వ్యూహాత్మక తప్పిదమా?:
నిన్న మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే పరిమితమైన పవన్.. అనూహ్యంగా తెలంగాణలో యాత్ర చేపట్టడం చాలామందికి ఆశ్చర్యంగానే అనిపిస్తోంది. అంతో.. ఇంతో.. పట్టున్న ఏపీని వదిలి తెలంగాణలో పర్యటన చేయాలనుకోవడం పవన్ వ్యూహాత్మక తప్పిదమనేది కొంతమంది విశ్లేషకుల వాదన.

ప్రతిపక్షాల అనుమానం..
ప్రజారాజ్యం సమయంలోనూ చిరంజీవి యాత్రలకు, సభలకు పవన్ బ్రహ్మరథం పట్టారని, కానీ ఓటు బ్యాంకు దగ్గరికి వచ్చేసరికి ఫలితం తేడా కొట్టిందని మరికొంతమంది గుర్తుచేస్తున్నారు. దానికి తోడు పవన్ పాలక పార్టీలను వెనకేసుకురావడం ఆయన రాజకీయాలపై పలు అనుమానాలను లేవనెత్తేలా చేశాయి.

ఎన్జీవోలా వ్యవహరిస్తున్నారని:
రాజకీయాలన్నాక రాజ్యాధికారమే దాని అంతిమ లక్ష్యం. తద్వారా మాత్రమే వ్యవస్థపై తమ ప్రభావాన్ని గానీ, ఆలోచనలను గానీ పూర్తి స్థాయిలో అమలుచేయవచ్చు. కానీ పవన్ మాత్రం తనతో పాటు సుదీర్ఘ కాలం పోరాడాలంటూ అభిమానులకు సంకేతాలివ్వడం చాలామందికి అర్థం కాని విషయం. పవన్ అటు రాజ్యాధికారం కోసం కాకుండా.. ఇటు ప్రతిపక్ష పార్టీలా కాకుండా.. ఓ ఎన్జీవోలా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు మూటగట్టుకుంటున్నారు.

నమ్మకంగా ఉన్న అభిమానులు..:
ఎవరెన్ని విమర్శలు చేసినా.. అభిమానులు మాత్రం పవన్ రాజకీయాలపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. తమ నాయకుడు అధికారంలోకి వస్తే సామాన్యులకు మేలు జరుగుతుందని వారు భావిస్తున్నారు. అయితే పవన్ తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్నారా?.. ఏపీలోనా? అన్నది కాలమే నిర్ణయిస్తుందేమో!..


Click it and Unblock the Notifications











