భర్తతో కలిసి ఐష్ రీఎంట్రీ...సినిమా వివరాలు ఇవే!
హైదరాబాద్: అందాల తార ఐశ్వర్యరాయ్ చివరి సారిగా 2010లో వచ్చిన 'గుజారిష్' చిత్రంలో కనిపించింది. ఆ తర్వాత గర్భం దాల్చడం, ఆరాధ్యకు జన్మనివడం....అప్పటి నుంచి తన సమయాన్ని పూర్తిగా కూతురు సంరక్షణ కోసమే కేటాయించడం తెలిసిందే. ఈ క్రమంలో సినిమాలకు పూర్తిగా దూరమైందనే చెప్పాలి.
ఐశ్వర్యరాయ్ మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఎప్పుడు ఇస్తుందోనని ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా ఓ గుడ్ న్యూస్ అందుతోంది. త్వరలో ఐశ్వర్యరాయ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే తన భర్త అభిషేక్ బచ్చన్తో నటించబోతోంది. వెండి తెరపై కూడా వీరు భార్యభర్తలుగా నటించబోతున్నారు.
'హ్యాపీ యూనివర్శరీ' పేరుతో తెరకెక్కే ఈచిత్రానికి యాడ్ ఫిల్మ్ మేకర్గా ప్రసిద్ధి గాంచిన ప్రహ్లాద్ కక్కర్ దర్శకత్వం వహించనున్నారు. గౌరంగ్ దోషి నిర్మాత. ఈ చిత్ర వివరాలను వెల్లడిస్తూ నిర్మాత గౌరంగ్ దోషి ప్రకటన విడుదల చేసారు. వైవాహిక జీవితం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. 2014లో సినిమా ప్రారంభం కానుంది.
నిర్మాత గౌరంగ్ దోషి స్వయంగా ఈ చిత్ర కథను రెడీ చేసారు. ఆయన మాట్లాడుతూ...'యాడ్ ఫిల్మ్ ప్రపంచంలో ప్రహ్లాద్ కక్కర్ తిరుగులేని దర్శకుడు. ఆయన ఇప్పటి వరకు 60 సినిమా కథలను తిరస్కరించారు. అన్ని వదులుకున్న ఆయనకు నేను చెప్పిన కథ బాగా నచ్చి చేయడానికి ఒప్పుకున్నారు. ఐశ్వర్యరాయ్, అభిషేక్లకు కూడా కథ ఎంతగానో నచ్చింది. కథ ఎంతో అద్భుతంగా ఉంది కాబట్టి వీరి కాంబినేషన్ సాధ్యమైంది. ఐష్-అభి ఈ సినిమాలో కూడా భార్య భర్తలుగా నటిస్తారు' అని తెలిపారు.


Click it and Unblock the Notifications












