Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
చైతూ చాలా హ్యాపీగా.. అంతా సమంత మహత్యం.. ‘చలపతి’ని అందరూ ఖండించాలి.. నాగార్జున
నాగచైతన్య హీరోగా రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను అక్కినేని నాగార్జున రూపొందించారు. ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.
టాలీవుడ్లో నిర్మాతగా అన్నపూర్ణ బ్యానర్లో వైవిధ్యమైన చిత్రాలను అందించడంలో నాగార్జునది డిఫరెంట్ స్టయిల్. అందుకు గతంలో ఆయన తీసిన శివ, నిన్నేపెళ్లాడుతా, సొగ్గాడే చిన్నినాయనా వరకు నాగ్ అభిరుచికి అద్దం పట్టాయి. తాజాగా తన కుమారుడు నాగచైతన్య హీరోగా రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను రూపొందించారు. ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. నిర్మాతగా నాగార్జున ఈ సినిమా విశేషాలను మీడియాకు వివరించారు. నాగార్జున చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..
ఇప్పటికే ఈ సినిమా 100 సార్లు చూశాను..
రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నిర్మాతగా మీముందు ఉన్నాను. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా చక్కగా పూర్తయ్యాయి. దాదాపు 100 సార్లు ఈ సినిమాను చూసి ఉంటాను. నాకు బాగా నచ్చింది. ఓవర్సీస్ ప్రింట్స్ కూడా వెళ్లిపోయాయి. మేము చేయగలిగనంత మేరకు ఏం చేయాలో అన్ని చేశాం. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి నాకు బాగా నచ్చింది టీమ్ వర్క్. దర్శకుడు కల్యాణ్ కృష్ణ వర్క్ స్టయిల్. మాటల రచయిత సత్యానంద్ బాగా ప్లస్ అయ్యారు. సత్యానంద్కు దాదాపు 31 ఏళ్ల అనుభవం ఉంది. కృష్ణ నటించిన మాయదారి మల్లిగాడు సినిమాకు తొలిసారి పనిచేశాడు. ఆయన అనుభవం కంప్యూటర్ లైబ్రరీలా ఉపయోగపడింది. టెక్నీషియన్స్ అందరికి ఓ కండక్టర్గా సేవలందించారు. ప్రతీ ఒక్కరు సొంత సినిమాగా భావించి పనిచేశారు.
నిన్నే పెళ్లాడుతా చిత్రంలా..
నిన్నే పెళ్లాడుతా నాకు ఇష్టమైన సినిమా. ఆ సినిమాలో ఎమోషన్స్, ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి కోవలో నిదే రారండోయ్ వేడుక చూద్దాం సినిమా. కానీ ఆ జనరేషన్కు ఇప్పటి జనరేషన్కు మారిపోయాయి. ఇప్పటి జనరేషన్లో ఎమోషన్స్, ఫీలింగ్ వేరు. మానవ సంబంధాల్లో చాలా మార్పులు వచ్చాయి. అప్పడు పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయికి, ఇప్పటి పల్లెటూరు అమ్మాయికి చాలా తేడా ఉంది.
నటుడికి పరిమితులు ఉండకూడదు..
నటుడికి ఒక డైమెన్షన్ అనేది ఉండకూడదు. ఈ మధ్యకాలంలో చైతూ వైవిధ్యమైన పాత్రలను పోషిస్తున్నాడు. ఇటీవల కాలంలో ప్రేమమ్, తదితర సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం రారండోయ్ వేడుక చూద్దాం చేశాడు. మరో థ్రిల్లర్ సినిమాల్లో నటిస్తున్నాడు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించాలన్నదే నా అభిప్రాయం.
చైతూని అందరూ ఇష్టపడుతారు..
ఈ సినిమాలో చైతూది లవబుల్ క్యారెక్టర్. చైతూను చూస్తే అలాంటి ఫ్రెండ్ ఉండాలని, బాయ్ ఫ్రెండ్ ఉండాలని కోరుకొంటారు. ఇలాంటి అబ్బాయి ఉండాలని కోరుకొంటారు. జగపతిబాబు, చైతూ మధ్య సీన్లు ఆకట్టుకునేలా ఉంటాయి. ఇంట్లో మా ఇద్దరి మధ్య సంభాషణ ఎలాం ఉంటుందో.. అలానే ఈ సినిమాలో దించేశారు. అసలు ఈ సినిమాలో నన్నే తండ్రి పాత్రను చేయమన్నారు.
అమ్మాయిలు హానికరం ట్యాగ్ లైన్ మాత్రమే..
అమ్మాయిలు హానికరం అనేది ట్యాగ్ లైన్ మాత్రమే. మన్మధుడు సినిమాలో నేను అమ్మాయిలను హేట్ చేస్తాను. కానీ అమ్మాయిలతో ఎలా ఉంటాడో తెలుసు. అలాగే ఈ సినిమాలో అమ్మాయిలంటే ఒకరకమైన అభిప్రాయం ఉన్నా చివర్లో ఒక డైలాగ్ ఉంటుంది. రాజకుమారుడు అంటే ఎవరు అనే ప్రశ్న వస్తుంది. రాజకుమారుడు అంటే రాణిని బాగా చూసుకొనే వాడే రాజకుమారుడు అనే సమాధానం దొరకుతుంది.
చలపతి రావు వ్యాఖ్యలను ఖండించాలి..
నటుడు చలపతిరావు వ్యాఖ్యలపై నాగార్జున స్పందించాడు. చలపతిరావు వ్యాఖ్యలను నాగ్ ట్విట్టర్లో ఖండించారు. నేనే కాదు మీరు కూడా ఖండించాలి. ఒక్క చలపతిరావు కాదు.. ఎవరు మాట్లాడినా తప్పపట్టాల్సిందే. అలాంటి మాటలు వింటానికే బాగుండవు. సీనియర్ నటుడైన చలపతిరావు గురించి నేను మాట్లాడటం తగదు.
నిర్మాత అంటే చెక్కుల మీద..
నిర్మాత అంటే అన్ని విభాగాలపై పర్యవేక్షణ ఉండాలి. మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. చిత్ర యూనిట్కు చక్కటి సహకారం అందించాలి. అప్పుడే మంచి అవుట్పుట్ వస్తుంది. నిర్మాత అంటే చెక్కుల మీద సంతకం పెట్టడం కాదు అని తెలుసుకొన్నాను. ఇలాంటి విషయాలు నాన్నగారి నుంచి నేర్చుకొన్నాను. అన్ని సినిమాలకు ఇలానే ఉంటాను. ముఖ్యంగా భాయ్ సినిమా నుంచి నేర్చుకొన్నాను. నా సొంత పనులు చూసుకోవడం వల్ల భాయ్ ఓ గుణపాఠం నేర్పింది. దాంతో ప్రతీ సినిమాకు జాగ్రత్త పడుతున్నాను.
చైతూ, అఖిల్కు హిట్లు ఇస్తాను..
చైతూ, అఖిల్కు హిట్లు ఇస్తాను అని చెప్పింది నిజమే. అలాగని అన్ని సినిమాల బాధ్యతను నేను తీసుకొను. ఇతర నిర్మాతల సినిమాల్లో జోక్యం చేసుకోవడం తగదు. కానీ కథ వింటాను. ఒక్కొక్కరి విజన్ ఒక్కోలా ఉంటుంది. ప్రేమమ్ సినిమా అయితే నేను మరో విధంగా తీసేవాడిని. కంటిన్యూయస్గా వారితో సినిమాలు చేయడం నాకు కుదరదు. వారితో ఏడాదికి ఒక సినిమా చేస్తాను. నేను నా సొంత సినిమాలు చేసుకోవాలి కదా అని నాగ్ అన్నారు.
డిఫరెంట్గా చైతూ..
రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల్లో ఓ డిఫరెంట్ చైతూని చూస్తారు. ఈ సినిమాలో బాగా ఈజ్ అప్ అయ్యాడు. అదంతా సమంత మహత్యం కావొచ్చు. అందుకే చాలా హ్యాపీగా ఉన్నాడు. అది తెరమీద కనిపిస్తాయి. మగాళ్లు 30 ఏళ్లు వస్తే గాని ఫుల్ ఫామ్లోకి రాడు అంటారు. ఇప్పుడు చైతూకి 30 ఏళ్లు నిండాయి. అది చైతూలో కనిపిస్తున్నది.
మామ అని పిలువాలని చెప్పా..
వాట్సప్లో మామ, కోడళ్ల మధ్య జరిగిన సంభాషణ గురించి నాగార్జున వివరించాడు. మనం సినిమా చేసినప్పటి నుంచి సమంతతో మంచి అనుబంధం ఉంది. అప్పుడు నన్ను సార్.. సార్ అని సమంత పిలిచేది. ఎంగేజ్మెంట్ తర్వాత సార్ అనే మాటను మాన్పించి మామ అని పిలువాలని నేర్పించాం. మావయ్య అంటే చాలా ఓల్డ్గా ఉంటుందని మామ అని పిలవాలని చెప్పాను.
కల్యాణ్ను ఫాలో కావాలని చెప్పా..
చైతూకి సినిమా సెన్సిబిలిటీస్ తెలియదు. చైతూకి తెలిసింది కేవలం గౌతమ్ మీనన్, మై బైక్, మై గర్ల్. అలాంటివి నా దగ్గర కుదరదు. చైతూని తప్పుపట్టడం లేదు. అన్ని రకాల సినిమాలు చేయాలి. ఢిఫరెంట్ క్యారెక్టర్లు చేయాలి. నా నట జీవితంలో ప్రసిడెంట్ గారి పెళ్లాం, ఈవీవీ గారితో హలో బ్రదర్ చేసేటప్పుడు ఇలాంటివి ఎలా చేయాలి అని వాదించేవాడిని. అప్పుడు వాళ్లు మమ్మల్ని ఫాలో అయిపోవాలని సూచించేవారు. ఇప్పడు అదే విషయాన్ని చైతూకి చెప్పాను. కల్యాణ్ కృష్ణ గుడ్డిగా ఫాలో కావాలని సూచించాను. కల్యాణ్కు పల్స్ బాగా తెలుసు. నేను కూడా సొగ్గాడే చిన్నినాయనా సినిమా సమయంలో కల్యాణ్ను అలాగే ఫాలో అయ్యాను. గోదావరి జిల్లాల యాసను అలాగే నేర్చుకొన్నాను.
చైతూ రెమ్యూనరేషన్..
చైతూకు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారనే విషయంపై మాట్లాడుతూ.. సినిమా అయిపోయిన తర్వాత రెమ్యూనరేషన్ ఇస్తానని చెప్పాను. నా సంపాదన అంతా వారి కోసమే కదా. వేరే నిర్మాతలకైతే ఎంత రెమ్యూనరేషన్ తీసుకొనే వాళ్లు అనే విషయంపై మాట్లాడుతూ.. అలా చెప్పను కదా అని చమత్కరించారు. నాన్న అక్కినేని ఇచ్చే పాకెట్ మనీకి, ఇప్పుడు నేను చైతూకి, అఖిల్కు ఇచ్చే పాకెట్ మనీకి చాలా తేడా ఉంది. జనరేషన్ గ్యాప్ వల్ల ఆ మొత్తం బాగా పెరిగిపోయింది.
భ్రమరాంబ అంటే రకుల్ మాత్రమే..
ఇప్పటి వరకు చూసిన రకుల్ ప్రీత్ సింగ్ వేరు.. ఈ సినిమాలో కనిపించే రకుల్ వేరు. ఈ సినిమాలో రకుల్ నటన చూస్తే శ్రీదేవి, టాబూ గుర్తొచ్చారు. రకుల్ యాక్టింగ్ చూసి మేమంతా షాక్ గురయ్యాం. ఈ సినిమా చూసిన తర్వాత భ్రమరాంబ పాత్రకు ఆమె తప్ప మరొకరు చేయలేరమో అనిపించింది. మేనరిజం మీద, ఇంకా చాలా విషయాల మీద హోమ్ వర్క్ చేసింది. ఎడిటింగ్ టేబుల్ మీద రకుల్ సీన్లు చూసి ఆశ్చర్యపోయాను.
దేవీ శ్రీ ప్రసాద్ సూపర్..
మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కూడా చాలా శ్రమపడ్డారు. దేవీని కూడా ఎడిటింగ్ రూమ్లో కూర్చొబెట్టాం. ఎక్కడైతే రీరీకార్డింగ్ స్కోప్ ఉందో అక్కడ కొన్ని సూచలను చేసి దేవీ శ్రీ ప్రసాద్కు ఇన్ పుట్స్ ఇచ్చాం. సినిమాను మంచి క్వాలిటీ సినిమాగా రూపొందించాం. ఇనాళ్లు దేవీ సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఎలా ఉన్నారో ఆయన పనిచూస్తే అర్థమైంది.
కలెక్షన్ల క్లబ్బుల గురించి ఇప్పుడు మాట్లాడొద్దు..
బాహుబలి రిలీజ్ తర్వాత కలెక్షన్ల గురించి మాట్లాడటం మానేయాలని గతేడాదే చెప్పాను. ఇప్పుడంతా 1000, 1500 కోట్ల రూపాయల క్లబ్బులు హవా కొసాగిస్తున్నాయి. ఇక మన క్లబ్ గురించి మాట్లాడం మంచిది కాదేమో. బాలీవుడ్లోనే ఎవరూ నోరు విప్పడం లేదు. ఎంత పెట్టాం. ఎంత లాభం వచ్చింది అనేది చూసుకొంటే సరిపోతుంది అని నాగార్జున చెప్పారు. బాహుబలి సినిమా గ్రాఫిక్స్ కారణంగా అన్నపూర్ణ స్టూడియో క్వాలిటీ కూడా పెరిగింది. రాజమౌళి అందుకు కారణం. బాహుబలి సినిమా క్వాలిటీ, డైలాగ్స్, పాత్రల డిజైన్ అన్ని చక్కగా కుదిరియాయి. థింక్ బిగ్.. యూ మైట్ అచీవ్ అనే విషయాన్ని రాజమౌళి నేర్పారు.
తెలుగు సినిమా రేంజ్ పెరిగింది..
తెలుగు సినిమా రేంజ్ ఎప్పుటికప్పుడు పెరిగిపోతున్నది. మాయాబజార్ సమయంలో ఏపీలో కేవలం 100 థియేటర్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో 2 వేల థియేటర్లకు పైగానే ఉన్నాయి. బాలీవుడ్ రేంజ్ రెండేళ్ల క్రితమే పెరిగింది. ప్రస్తుతం టాలీవుడ్లో థియేటర్కు వచ్చేవారి సంఖ్య 10 శాతం పెరిగింది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాను నైజాం, కృష్ణ, వైజాగ్ జిల్లాల్లో సొంతంగా విడుదల చేస్తున్నాం. మిగితాది అంతా డిస్టిబ్యూటర్లకు ఇచ్చాం.
రాజుగారి గది సినిమా..
రాజుగారి గది సినిమా ఇంకా పదిరోజుల షూటింగ్ ఉంది. అఖిల్ సినిమా యాక్షన్ పార్ట్ పూర్తయింది. హీరోయిన్ ఎంపిక పూర్తి కావాల్సి ఉంది. అఖిల్ సినిమాకు నాలుగు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. రారండోయ్ సినిమా రిలీజ్ తర్వాత అఖిల్ సినిమా పేరు ప్రకటిస్తాం. నానీతో మల్టీ స్టారర్ సినిమా అనేది లేదు. మీడియాలో మాత్రమే ప్రచారం జరుగుతున్నది. మీరే రాస్తున్నారు. వాటిని ఖండించాల్సి వస్తుంది.
మహాభారతంలో కర్ణుడిగా..
మలయాళంలో రూపొందుతున్న మహాభారతంలో చిత్రంలో నటించమనే ఆఫర్ వచ్చింది. ఆ సినిమాలో కర్ణుడు పాత్ర కోసం అడిగారు. మహాభారతం సినిమాపై దర్శకుడు శ్రీకుమార్ నాలుగేళ్లుగా కసరత్తుగా జరుగుతున్నది. శ్రీకుమార్ కల్యాణ్ జువెల్లరీకి యాడ్స్ చేస్తుంటాడు. వాసుదేవ నాయర్ నాకు స్క్రీన్ ప్లే, ఇతర పుస్తకాలు ఇచ్చాడు. వాటిని చదివాను. వాసుదేవనాయర్ దేశంలోనే మంచి స్క్రీన్ రైటర్. నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. ఆయన స్క్రీన్ ప్లే చదివాను. శ్రీకృష్ణుడు అయితే మీసాలు తీయాల్సి వస్తుంది. నేను మీసాలు తీస్తే నన్ను ఎవరు చూస్తారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతున్నది. యూనివర్సల్ స్టూడియోతో కలిసి నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.
చైతూ, నాగ్ పెళ్లి అక్టోబర్లో..
నాగచైతన్య, సమంత పెళ్లి అక్టోబర్లో ప్లాన్ చేశాం. ఇంకా తేదీలు ఖరారు కాలేదు. బహుశా ఆరో తేదీన ఉండవచ్చు. వారికి ముహుర్తాలు, ఇతర విషయాలపై పట్టింపులేదు. వారు నా వద్దకు పెళ్లి ప్రతిపాదనలు తెచ్చినపుడు చాలా సంతోషపడ్డాను. మీకు ఇష్టం అయితే నాకు ఇష్టమే అని చెప్పాను అని నాగార్జున చెప్పాడు.