ప్రతిబింబాలు 100 రోజుల పోస్టర్ వివాదం.. అక్కినేని పరువు తీశారంటూ సొంత అభిమానులే ఆగ్రహం
తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా భారతీయ సినిమా పరిశ్రమలో రికార్డుల కోసం సినిమా హీరోల ఫ్యాన్స్, నిర్మాతకు సంబంధించిన వర్గం ప్రయత్నించడం అనాదిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వాస్తవ రికార్డులను పక్కన పెట్టి.. ఫేక్ లెక్కలను చెప్పడం ఇప్పటికీ అనవాయితీగా సాగుతున్నది. అయితే ఇటీవల అక్కినేని అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించి.. సోషల్ మీడియాలో నెటిజన్లకు పక్కాగా దొరికిపోయారు. ఇటీవల రిలీజైన అక్కినేని నాగేశ్వరరావు ప్రతిబింబాలు సినిమా విషయంలో ఫ్యాన్స్ చేసిన తింగరిపని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రతిబింబాల సినిమా ప్రదర్శించిన రోజుల గురించిన వ్యవహారం ప్రస్తుతం వివాదంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...
స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రతిబింబాలు చిత్రం నలభై ఏళ్ళ క్రితం పూర్తయినప్పటీకి.. ఇటీవల ఆ సినిమా గతేడాది నవంబర్లో విడుదల చేశారు. ఈ సినిమా చిత్తూరు జిల్లా అరగొండలోని కృష్ణా టాకీసులో 100 రోజులు పూర్తి చేసుకున్నట్టు ఓ దినపత్రికలో ప్రకటన ఇచ్చారు. అయితే ఆ ప్రకటనను ఆ చిత్ర నిర్మాత ఇవ్వలేదనే విషయం స్పష్టమైంది. అయితే కడప జిల్లాకు చెందిన ఏయన్నార్ ఫ్యాన్స్, వారి పేరు లేకుండా ఇచ్చారనే విషయాన్ని నెటిజన్లు ఎత్తి చూపుతున్నారు.

వాస్తవానికి ప్రతిబింబాలు చిత్రం నవంబర్ 9వ తేదీన విడుదల కాగా, ఒకే ఆటను ప్రదర్శించారు. కానీ, ఫిబ్రవరి 16, 2023న ప్రతిబింబాలు చిత్రం వంద రోజుల ఆడిందని ప్రకటన రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అరగొండలోని థియేటర్లో సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి మొదటి రోజు ఆడింది. మరుసటి రోజు నుంచీ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాను రెండువారాలు ప్రదర్శించారు. పక్కనే ఉన్న మండల కేంద్రం తవణంపల్లెలో వీరసింహారెడ్డి రెండువారాలు ఆడి, మళ్ళీ మూడోవారంలో అరగొండ కృష్ణాటాకీస్లో ప్రదర్శనకు వచ్చింది. ఆ సమయంలో వాల్తేరు వీరయ్య సినిమాను తవణంపల్లెలో ప్రదర్శించారు. అయితే కష్ణా టాకీస్ ఆవరణలో ప్రతిబింబాలు సినిమా పోస్టర్ పెట్టి ఉంచడం మినహా ప్రదర్శించిన దాఖలానే లేదు అని స్థానికులు తెలిపారు. 100వ రోజు ప్రదర్శించినట్టు పేపరల్లో ప్రకటన వచ్చిన రోజు కూడా ఈ హాలులో ఇళయదళపతి విజయ్ నటించిన వారసుడు సినిమాను ప్రదర్శించడం గమనార్హం.
ఇక ఈ మధ్యలో కొత్త సినిమాలు లేని సమయంలో కృష్ణా టాకీసు మూతపడి ఉంది. ఆ థియేటర్ డిజిటల్ కంటెంట్ ఆపరేటర్ అయిన యుఎఫ్ఓ ద్వారా ఈ వివరాలన్నీ కంప్యూటర్లో రికార్డయి ఉంటాయి. పాపం... ఇది తెలియని పురాతన అక్కినేని అభిమానులు పాత రోజుల్లో వారికున్న తమదైన అలవాటు ప్రకారం ప్రతిబింబాలు చిత్రం వంద రోజులు ఆడినట్టు ప్రకటన ఇచ్చి అభాసుపాలయ్యారు. ఈ విషయాన్ని ఇతర అభిమానులు, నెటిజన్లు ఎద్దేవా చేస్తూ, "మీ హీరో పరువును మీరే తీశారు అంటూ వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలైన అక్కినేని అభిమానులు కొందరు తమ అభిమాన నటుడి పరువును ప్రతిబింబాలు 100 రోజుల ప్రకటన ఇచ్చి ఫ్యాన్స్ తీసేశారని వాపోతున్నారు.
ఇదిలాఉండగా, ప్రతిబింబాలు సినిమా నిర్మాత, పంపిణీదారులు పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదని ఒకరిపై ఒకరు కిడ్నాప్, హత్యాయత్నం కేసులు పెట్టుకుని పోలీసు స్టేషన్కు వెళ్ళిన వార్తలు కూడా పత్రికలలో, టీవీలలో ప్రముఖంగా వచ్చాయి. అలాంటి పరిస్థితులలో నిండా మునిగిపోయిన నిర్మాత, పంపిణీదారులపై కనీసం సానుభూతి కూడా లేకుండా ఈ విధంగా శవాలపై పేలాలు ఏరుకున్నారు అనే చందాన కొందరు అభిమానులు దిగజారి ప్రవర్తించడంపై సినీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జనం లేకున్నా.. ప్రేక్షకులు రాకున్నా ఈ మధ్యకాలంలో పలువురు స్టార్ హీరోల ఫ్యాన్స్ తమ చిత్రాలను డబ్బులు ఇచ్చి మరీ కలెక్షన్స్ లేకున్నా ఎక్కువ రోజులు ఆడినట్టు రికార్డులను రాసుకొంటున్నారు. కానీ, దొంగ లెక్కలు చూపించినా.. అందుకు డిజిటల్ కంటెంట్ ఆపరేటర్ కంప్యూటర్ రికార్డింగ్ కూడా వారు సరి చూసుకుంటున్నారు. అదే ఓ సినిమా నిజాయితీగా (డబ్బులు పెట్టి ఆడించినప్పటికీ) ఆడిందో లేదో తెలుసుకోవడానికి ప్రమాణం! అది అందరికీ తెలిసిన విషయమే! అయితే, ఇవేవీ పట్టించుకోకుండా 'ప్రతిబింబాలు' వంద రోజులు ఆడినట్టుగా పేపర్ లో ప్రకటన ఇవ్వడమే ఇప్పుడు ఫ్యాన్స్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ వివాదంపై అక్కినేని అభిమానులు ఎలా స్పందిస్తారు? ఎలాంటి వివరణను ఇస్తారనే విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.


Click it and Unblock the Notifications











