తెలంగాణలో సినిమా థియేటర్లు బంద్.. వకీల్ సాబ్ కి మాత్రం రెండ్రోజులు ?
అనుకున్నంతా అయ్యింది తెలంగాణలో థియేటర్లు బంద్ కానున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తెలంగాణలో సినిమా థియేటర్లు బంద్ చేస్తున్నామని సినిమా ప్రదర్శన నిలిపివేస్తున్నామని తెలంగాణ సినిమా థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించినట్లు సమాచారం అందుతోంది. ఒకపక్క కరోనా ఉద్ధృతి మరోపక్క ప్రేక్షకుల ఆరోగ్యం దృష్ట్యా థియేటర్, మల్టీప్లెక్స్ లు మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. నిజానికి ఈ రోజు ఉదయమే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది అంటూ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.. దాని ప్రకారం నాలుగో ఆట ను పూర్తిగా రద్దు చేయాల్సి ఉంటుంది. అలాగే మిగతా మూడు ఆటలకు కూడా సరయిన సినిమాలు లేకపోవడం ఇప్పట్లో సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

వకీల్ సాబ్ తప్ప మరో సినిమా లేదు
అయితే వాస్తవానికి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వకీల్ సాబ్ సినిమా తప్ప మిగతా ఏ సినిమా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ నెల 16న విడుదల కావాల్సిన లవ్ స్టోరీ సినిమా వాయిదా పడగా 23న రావలసిన టక్ జగదీష్ సినిమా కూడా వాయిదా వేశారు. అలాగే మరో మూడు సినిమాలు రిలీజ్ కి రెడీ గా ఉన్నా సరే ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సినిమా థియేటర్లలో సినిమాలు ఆడించడం కంటే ప్రస్తుతానికి పూర్తిగా బంద్ చేయడమే బెటర్ అని భావించి =ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈన్తో ఇష్క్ తో పాటు తెలంగాణ దేవుడు సినిమా కూడా వాయిదా పడింది... అయితే... వకీల్ సాబ్ ను థియేటర్లలో మరో రెండు రోజులు ప్రదర్శిస్తారని అంటున్నారు.

కీలక సమావేశం
ఈ రోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాధి తీవ్రత దృష్ట్యా సినిమా థియేటర్ల నిర్వహణ మీద ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేపటి నుంచి అన్ని థియేటర్లను మూసివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటికే రిలీజ్ అయిన వకీల్ సాబ్ సినిమా ప్రదర్శించే దియేటర్లకు మాత్రం మూసివేతకు మినహాయింపు ఇచ్చినట్లు ఎగ్జిబిటర్లు తెలిపారు.. అయితే మరో రెండు రోజుల పాటు వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకుల కోసం థియేటర్ లో ఆడుతుంది. ఆ తర్వాత శుక్రవారం నుంచి లేదా శనివారం నుంచి పూర్తిగా థియేటర్లు మూత పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలంగాణ బాటలోనే ఏపీ
ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వం థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిన్న అధికారులతో కీలక సమావేశం నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సీటు సీటు మధ్య మరో సీటు ఖాళీగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడవనున్నాయి. అయితే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కూడా బహుశా తెలంగాణ థియేటర్ల బాటలోనే పయనించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ కి రెడీ గా లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్ థియేటర్లు కూడా అదే బాట పట్టే అవకాశం ఉందని అంటున్నారు.. తెలంగాణలో థియేటర్ లో పూర్తిగా మూత పడటంతో ఎవరు సినిమాలు రిలీజ్ చేయడానికి సాహసం చేయరు. సో ఆంధ్రప్రదేశ్ థియేటర్లు ఓపెన్ చేసి ఉన్నా ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలు తప్ప కొత్తగా రిలీజ్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉండదు.

అధికారిక ప్రకటన పెండింగ్
ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఆంధ్రప్రదేశ్ సినిమా థియేటర్ల యజమానులు సంఘం నుంచి వెలువడాల్సి ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ లకు సంబంధించిన ఒక అంశం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టికెట్ రేట్లు భారీగా తగ్గించిన కారణంగా ఆ రేట్లు కనీసం కొంతవరకైనా పెంచాలని ప్రభుత్వాన్ని థియేటర్ల యజమానులు కోరుతున్నారు. ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ దెబ్బకు, ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంది అనేది వేచి చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











