తెలుగులో నాదే మొదటి సారి: అల్లు అర్జున్
'ఒక హీరోనీ, సంగీత దర్శకుడినీ కలిపి ప్రమోషన్ సాంగ్ తెరకెక్కించడం ఇదే మొదటిసారి. త్రివిక్రమ్, దేవిశ్రీప్రసాద్ ఆలోచనలతో ఈ పాట చాలా బాగా వచ్చింది. నిర్మాతల సహకారం మరిచిపోలేనిది''అన్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, ఇలియానా జంటగా డీవీవీ దానయ్య సమర్పణలో ఎన్. రాధాకృష్ణ నిర్మించిన చిత్రం 'జులాయి'. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా 'పకడో పకడో...' అనే ప్రమోషనల్ సాంగ్ చేశారు. ఈ పాటను చిత్రసంగీతదర్శకుడు దేవిశ్రీప్రసాద్, అల్లు అర్జున్పై చిత్రీకరించారు. ఆదివారం ఈ పాటను ఆవిష్కరించిన సందర్భంగా అల్లు అర్జున్ పై విధంగా స్పందించారు.
అలాగే ''ప్రమోషనల్ సాంగ్ చేస్తే బాగుంటుందని మా దర్శకుడికి వచ్చిన మంచి ఆలోచన ఫలితమే 'పకడో పకడో...'. ఈ ఆలోచనను మా నిర్మాతలు ప్రోత్సహించారు. దేవి ఎనర్జీకి హ్యాట్సాఫ్. మన చిత్ర పరిశ్రమలో ఓ కొత్త సంస్కృతికి బీజం వేసింది ప్రచారగీతం. సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడంలో ఈ తరహా పాట ఎంతగానో ఉపయోగపడుతుంది'' అని చెప్పుకొచ్చారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ - ''మన వాడుక భాషలో 'పట్టుకో' అనే పదం ముఖ్యమైనది. ఈ పదంతో ఏదైనా పాట ప్లాన్ చేద్దామని దేవీతో అన్నప్పుడు 'పకడో పకడో...' ట్యూన్ రెడీ చేశాడు. ఈ పాట ఇంత బాగా రావడానికి బన్నీ, దేవిలతో పాటు సాయి, నవీన్, ప్రసాద్ మురెళ్ల తదితరులు కారణం. సినిమాలో వినిపించే ఓ సౌండ్ ట్రాక్కి దగ్గరగా ఉండేలా ప్రచారగీతాన్ని తెరకెక్కించాలనుకొన్నా. ఇదే విషయాన్ని దేవిశ్రీప్రసాద్తో చెప్పినప్పుడు పకడో పకడో.. ట్యూన్ని చేసిచ్చారు. సినిమాలో ఇది లేకపోయినా... ఆ సన్నివేశానికి దగ్గరగా ఉండేలా ఈ పాట కుదిరింది '' అన్నారు.
''ప్రమోషన్ సాంగ్ తెరపై చూసుకొంటున్నప్పుడు ఎంతో ఆనందం కలిగింది. బన్నీతో నాకున్న స్నేహమే ఈ పాట ఇంత బాగా రావడానికి కారణమైంది''అన్నారు దేవిశ్రీప్రసాద్. ''ప్రచార గీతాలు హిందీ, ఇంగ్లిష్ సినిమాల్లోనే చూసేవాళ్లం. ఇప్పుడు మన తెలుగు సినిమాకి కూడా అలవాటు కావడం ఆనందంగా ఉంది. ఎవరు పుట్టినరోజు చేసుకొన్నా డ్యాన్స్ చేసేవాడు బన్నీ. దేవిశ్రీప్రసాద్లోని హుషారు కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ ఇద్దరు కలిసి చేసిన ఈ గీతం చాలా బాగుంది''అన్నారు అల్లు అరవింద్. ఆగస్టు 9న 'జులాయి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు చిత్ర సమర్పకులు డి.వి.వి.దానయ్య.


Click it and Unblock the Notifications











