150 చిత్రం షూటింగ్ అక్కడే : చిరంజీవి
విజయవాడ : తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం డాక్టర్ అల్లు రామలింగయ్య కళాపీఠం ఆధ్వర్యంలో ఆయన విగ్రహావిష్కరణ, పరుచూరి బ్రదర్స్కు జాతీయ పురస్కార ప్రదానం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన రాజధాని విజయవాడలో అల్లు విగ్రహం ఏర్పాటు చేయడం ఆయన అల్లుడి గా సంతోషిస్తున్నానన్నారు. విజయవాడ కమ్యూనిజానికి పురిటిగడ్డ, అభ్యుదయానికి పుట్టినిల్లు అని కొనియాడారు. అల్లు రామకృష్ణ పరమహంసకు ఏకలవ్య శిష్యుడని, వ్యక్తిత్వ వికాసంపై అలవోకగా ప్రసంగించగలరన్నారు. మామయ్య అన్న మాటలను గుర్తు చేసుకున్నారు.
తల్లి చనిపోయిన సమయంలో మనసు నిండా విషాదం ఉన్నా నిర్మాతల సం క్షేమానికి షూటింగ్కు వెళ్ళి హాస్యాన్ని అద్భు తంగా పండించగలిగిన ఏకైక హాస్యనటు డన్నారు. వృత్తితోపాటు మెదడుకు పని పెట్టే మరో ప్రవృత్తి కూడా ఉండాలని అది జీవితాన్ని పరిపూర్ణం చేస్తుందని రామలింగయ్య అనే వారని అందుకు హోమియోపతి వృత్తిలో పట్టా పొందిన ఆయన తోటి నటులకు వైద్యసేవలందించేవారఇ తెలిపారు.
విజయవాడ ఎప్పుడో సినిమా రాజధాని అయినా ఇప్పుడే రాష్ట్ర రాజధాని అయిందని, తన 150వ చిత్రం కథాంశానికి అనుగుణంగా ఉంటే బెజవాడలోనే చిత్రీకరణ జరుపుతామన్నారు. 300లకు పైగా సినిమాలకు రచయితలుగా పనిచేసిన పరుచూరి బ్రదర్స్తో మంచి ఆత్మీయ సంబంధం ఉందన్నారు. తాను నటించిన సినిమాలకు వారు రాసిన డైలాగ్స్ను వేదికపై వినిపించారు. పరిపూర్ణమైన వ్యక్తి, గొప్ప జీవిత నిఘంటువు అల్లు రామలింగయ్య అని సినీ నటులు, రాజ్యసభ సభ్యులు చిరంజీవి అన్నారు.

సినీ హాస్యనటులు బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హాస్య వటవృక్షం అల్లు అన్నారు. ఆయన హాస్య నీడ నేనన్నారు. ఆయన హాస్యానికి వన్నెతెచ్చిన వ్యక్తి, హాస్య కళానిథి అన్నారు. అల్లు జయంతి హాస్యానికి ఉగాది అన్నారు.
పరుచూరి బ్రదర్స్ మాట్లాడుతూ అల్లు కుటుంబంతో తమకు మంచి సాన్నిహిత్యం ఉందనీ, ఇప్పుడు ఈ పురస్కారం రావడం ఇంటికి అల్లురామలింగయ్య నడిచి వచ్చినట్లు ఉందన్నారు. ఆయన నటించిన తన మొదటి డైలాగ్ రాసిన సినిమా అనురాగదేవత అని, చివరి సినిమా ఇంద్ర అన్నారు.
అల్లు అరవింద్, మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, మాజీ మేయర్ రత్నబిందులు మాట్లాడుతూ అల్లు హాస్యపాత్రలను కొనియాడారు.
ఘనంగా అల్లు విగ్రహావిష్కరణ
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. సినీ నిర్మాత అల్లు అర వింద్, మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ కేశినేని శ్రీనివాస్, అల్లు రామలింగయ్య కళాపీఠం వ్యవస్థాపకులు సారేపల్లి కొండలరావు, డాక్టర్ మన్నెం గోపిచంద్, డాక్టర్ జి.సమరం తదితరులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ప్రముఖ సినీ రచయితలు పరుచూరి బ్రదర్స్కు అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాన్ని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, చిరంజీవి, అల్లు అరవింద్, ఎంపీ కేశినేని శ్రీనివాస్, సారేపల్లి కొండలరావు, తదితరుల చేతుల మీదుగా పరుచూరి బద్రర్స్కు అందజేసి సత్కరించారు. పరుచూరి బ్రదర్స్ చేతులకు చిరంజీవి స్వర్ణ కంకణాలు తొడిగారు.


Click it and Unblock the Notifications











