అల్లూరి సీతారామరాజు.. టాలీవుడ్లో మరో బయోపిక్!
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితంపై ఇప్పటికే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 1974లో విడుదలై సంచలన విజయం సాధించింది. త్వరలో అల్లూరి జీవితంపై మరో సినిమా రాబోతోంది.
రిసాలి ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియో బ్యానర్పై డా. శ్రీనివాస్ నిర్మాతగా సొంత ఊరు, గంగపుత్రులు, గల్ఫ్ వంటి సామాజిక చిత్రాలను, రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ వంటి యూత్ ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది.
"సీతారామరాజు" అనే టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రానికి ఏ ట్రూ వారియర్ అనే సబ్ టైటిల్ ఫిక్స్ చేశారు. మన్యంలో జరుగుతున్న తెల్లదొరల ఆకృత్యాలకు నిరసనగా విప్లవ బావుటా ఎగరవేసిన పాతికేళ్ల కుర్రాడి పోరాట గాథను ఉత్తమ సాంకేతిక విలువలతో తెరకెక్కించనున్నారు.

మార్చిలో షూటింగ్ ప్రారంభమౌతున్న ఈ చిత్రాన్నిఆగస్టులో విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. యెక్కలి రవీంద్రబాబు, డా.ఎల్.ఎన్.రావు సహనిర్మాతలుగా, బాపిరాజు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.
అప్పటి చరిత్రతో ఇప్పటి యువతకి స్ఫూర్తి నింపేలా అల్లూరి సీతారామరాజు త్యాగం ఆయన కీర్తిని మరింత ఇనుమడింపజేసే దిశగా "సీతారామరాజు" - ఏ ట్రూ వారియర్ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.
చరిత్రకారుల సహకారంతో సీతారామరాజు మరణానికి సంబంధించిన మిస్టరీని కూడా ఈ చిత్రంలో చూపించనున్నాం. త్వరలో సాంకేతిక నిపుణులు, నటీనటుల పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు.రచన, దర్శకత్వం - పి. సునీల్ కుమార్ రెడ్డి.


Click it and Unblock the Notifications











