నిజానికి 'నాయక్'లో చూసే అల్లు అర్జున్ సినిమాలో...
హైదరాబాద్ : నిజానికి 'నాయక్'లో నటించడంతోనే 'ఇద్దరమ్మాయిలతో... ' చేసే అవకాశం లభించింది. 'శుభలేఖ రాసుకొన్న...' పాటలో నా డ్యాన్స్ నచ్చడంతోనే 'ఇద్దరమ్మాయిలతో..' సినిమాకి ఎంపిక చేసుకొన్నామని ఆ చిత్ర నిర్మాత చెప్పారు. ఆ విషయం నాకు చాలా సంతోషాన్నిచ్చింది అంటంది అమలపాల్. ఈ కేరళ కుట్టి నటించిన తాజా చిత్రం 'నాయక్'. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా అమలాపాల్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించింది.
అలాగే ... రుసగా రామ్చరణ్, అల్లు అర్జున్ సినిమాల్లో నటించే అవకాశం లభించడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. చరణ్, అర్జున్... ఇద్దరూ మంచి నటులే. తోటి నటీనటులకు చరణ్ సహకారం అందించే తీరు నన్ను బాగా ఆకట్టుకొంది. అల్లు అర్జున్ సరదాగా అందరితో కలివిడిగా ఉంటారు అంది. 'నాయక్'లో అందంగా కనిపించానని అందరూ చెబుతున్నారు. ఆ విషయం విన్నప్పుడల్లా నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటిదాకా నేను చేసిన తొలి వాణిజ్య చిత్రం ఇదే. దర్శకుడు వి.వి.వినాయక్ ఈ కథ గురించి చెప్పినప్పుడే నా పాత్ర తెరపై ఎలా ఉండబోతోందో వూహించాను. హీరోయిన్ గా నాకు నూటికి నూరుపాళ్లు సంతృప్తినిచ్చిన సినిమా ఇది.
'ఇద్దరమ్మాయిలతో...' సినిమాలో నా పాత్ర గురించి ఇప్పుడే ఏమీ చెప్పను. అయితే అందరూ 'నాయక్'లో అందంగా కనిపించావని అంటున్నారు కదా? 'ఇద్దరమ్మాయిలతో...' సినిమా చూశాక నా అందం గురించి మరింతగా మాట్లాడుకొంటారని మాత్రం చెప్పగలను. ఆ చిత్రం నాకు మరింతగా పేరు తెస్తుందనే నమ్మకముంది అంది.
శుభలేఖ రాసుకొన్న... పాట నా కెరీర్లో గుర్తుండిపోయే పాట అది. చిత్రీకరణకు ముందు... 'కొండవీటి దొంగ' సినిమాని చూశాను. అందులో చిరంజీవి, రాధ కలిసి చేసిన 'శుభలేఖ రాసుకొన్న... ' పాటని కొన్ని వందలసార్లు పరిశీలించాను. వాళ్లిద్దరి మధ్య పండిన కెమిస్ట్రీ ఆ పాటకు ప్రాణం పోసింది. బాగా గమనిస్తే ఈ పాటలో నృత్యాలు కూడా ఎక్కువగా ఉండవు. అందుకే... తక్కువ కదలికలతో ఎక్కువ భావాల్ని పలికిస్తూ నటించాల్సి వచ్చింది. చరణ్ అందించిన సహకారం మరిచిపోలేనిది అని వివరించింది.


Click it and Unblock the Notifications











