బిగ్బాస్పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు.. యువత పక్కదారిపడుతోందంటూ సీరియస్!
ఎక్కడో విదేశాల్లో ప్రారంభమైన బిగ్ బాస్ అనే షోను తొలుత భారతదేశంలో హిందీ భాష లోకి తీసుకు వచ్చారు. అక్కడ విజయవంతం కావడంతో దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో కూడా ఈ షో ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్న ఈ షో మీద కొంతమంది ఎప్పటికప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీపీఐ నారాయణ బిగ్ బాస్ షో మీద ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బిగ్ బాస్ షో మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

అత్యవసర విచారణ జరపాలని
తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న బిగ్ బాస్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 2019 వ సంవత్సరం లో తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అశ్లీలత, అసభ్యత ప్రోత్సహించే విధంగా ఉందని చెబుతూ బిగ్ బాస్ ను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు.. అప్పటి నుంచి ఈ కేసు మీద ఎలాంటి ఆదేశాలు వెలువడ లేదు. కానీ శుక్రవారం నాడు ఈ పిటిషన్ మీద అత్యవసర విచారణ జరపాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు

మంచి వ్యాజ్యం
ఈ విచారణ సందర్భంగానే బిగ్ బాస్ రియాలిటీ షో కారణంగా యువత పెడదారి పడుతోంది అని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి రకమైన షోలతో సమాజంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని అసలు సమాజంతో సంబంధం లేదు అన్నట్లు ఇలాంటి షోలు నిర్వహించేవారు ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. ఇలాంటి అభ్యంతరకరమైన షోల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని కచ్చితంగా ఈ షో వల్ల యువత పెడదారి పడుతున్నారని వ్యాఖ్యానించింది. సమాజానికి ఉపయోగంగా ఉండే మంచి వ్యాజ్యం దాఖలు చేశారని పిటిషనర్ ను ప్రశంసించింది.

విస్మయం
ఇలాంటి చెత్త షోల వల్ల యువత జీవితాలు నాశనమవుతున్నాయని పేర్కొన్న హైకోర్టు ఇలాంటి షోలే సమాజంలో అసభ్యకర, అశ్లీలతను పెంచి పోషిస్తున్నాయని పేర్కొంది. అంతేకాక బిగ్బాస్ షో ఎప్పటి నుంచో వస్తుంటే ఇప్పటి వరకు ఏంచేశారని పిటిషనర్ను ప్రశ్నించింది డానికి తాము 2019లోనే పిటిషన్ దాఖలు చేసినట్లు పిటిషనర్ తరుపు న్యాయవాది గుర్తుచేశారు. అయితే 2019లోనే పిటిషన్ దాఖలు చేసినా ఇప్పటి వరకు ఉత్తర్వులు జారీ కాకపోవడం ఏమిటి అని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది.

సోమవారం విచారణ
ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు అని, ఇకనైనా కోర్టు స్పందిస్తుందనే భావనతో దీన్ని ప్రస్తావిస్తున్నట్టు న్యాయవాది ప్రసాద్ రెడ్డి తెలిపారు. దీంతో ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ జరుపుతామని ధర్మాసనం ప్రకటించింది. అయితే సోమవారం నాడు బిగ్ బాస్ షోపై కోర్టు సోమవారం ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది వేచి చూడాలి.

పూర్తిగా బ్యాన్ చేసి
ఇక బిగ్ బాస్ కార్యక్రమం పై హైకోర్టులో రిట్ తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నానని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. సమాజంలోని యువతను పెడదారి పట్టించే రీతిలో తయారైన బిగ్ బాస్ కార్యక్రమాన్ని నిషేధించాలని గతంలో తాను హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు రిట్ ను స్వీకరించి బిగ్ బాస్ కార్యక్రమం సమాజానికి తప్పుడు సంకేతాలు కు సూచకమని కామెంట్ చేయడాన్ని తాను స్వాగతిస్తున్నానని ఆయన అన్నారు. బిగ్ బాస్ కార్యక్రమాన్ని పూర్తిగా బ్యాన్ చేసే బాధ్యతను హైకోర్టు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


Click it and Unblock the Notifications











