చిరంజీవి ట్వీట్ మీద స్పందించిన ఏపీ మంత్రి.. జగన్ కు చెప్పాం, బిజీగా ఉన్నామంటూ!
ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయం ఇప్పటికీ సందిగ్ధావస్థ లోనే ఉంది. వకీల్ సాబ్ సినిమా విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అంశం మీద తాజాగా చిరంజీవి స్పందించారు. తాజాగా చిరంజీవి స్పందించిన విషయం మీద పేర్ని నాని స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..

మెగాస్టార్ చిరంజీవి ట్వీట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్లైన్ టిక్కెటింగ్ బిల్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం, దానికి దానికి శాసనసభ ఆమోదం తెలపడంతో ఇక నుంచి ఏపీ థియేటర్ లలో ఆన్ లైన్ లో సినిమా టికెట్ల విక్రయం చేపట్టనున్నారు. అయితే ఆన్ లైన్ టికెటింగ్ విధానం గురించి మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు.

ఆన్లైన్ టిక్కెటింగ్ బిల్
ఈ ఆన్లైన్ టిక్కెటింగ్ బిల్ మేము కోరినట్టే చేశారు కానీ ధరల విషయం అంశంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచన చేయాలని అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్లైన్ టిక్కెటింగ్ బిల్ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయమని అన్నారు. అదేవిధంగా థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకొని ఎన్నో కుటుంబాలు బతుకు తెరువు కోసం టికెట్ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుందన్నారు.

నిలదొక్కు కోగలుగుతుంది
దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయం గురించి పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడు తెలుగు పరిశ్రమ నిలదొక్కు కోగలుగుతుంది'' అని చిరంజీవి సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించారు.

జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి పరిష్కరిస్తా
ఇక తాజాగా సినిమా టికెట్ల అంశంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్పై మంత్రి పేర్ని నాని స్పందించారు. సానుకూలంగా స్పందించిన ఆయన జీవో నెం.35 లో కొన్ని మార్పులు చేయాల్సి ఉందని చెప్పుకొచ్చారు. టికెట్ ధరల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయన కాస్త బిజీగా ఉండడంతో త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.
Recommended Video

ప్రధాన అవరోధం
మరోవైపు, బుక్ మై షో, జస్ట్ బుకింగ్, పేటీఎం వంటి సినిమా టికెట్లు అమ్మే వెబ్సైట్, యాప్ ప్రతినిధులతో మంత్రి పేర్ని నాని మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సచివాలయంలో సమావేశం అయ్యారు. అయితే ఇప్పటికే ఆన్లైన్ టికెట్ల వ్యవహరంలో సినిమా హళ్ళతో టికెటింగ్ యాప్స్ యాజమాన్యాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆన్లైన్ టికెట్ంగ్కు ప్రైవేటు టికెటింగ్ యాప్ కంపెనీలు ప్రధాన అవరోధం కానున్నాయి.


Click it and Unblock the Notifications











