Don't Miss!
- Sports DC vs GT: రఫ్ఫాడించిన ముఖేష్ కుమార్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ఢిల్లీ!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ 'మేజర్ చంద్రకాంత్' అనుభవాలు (అరుదైన ఫోటోలు)
హైదరాబాద్ : స్వీయనిర్మాణ సంస్థ లక్ష్మీవూపసన్న పిక్చర్స్లో నిర్మించిన 'మేజర్ చంద్రకాంత్' చిత్రం విడుదలై నేటితో ఇరవైఏళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని డా॥ మోహన్బాబు సోమవారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ సినిమా అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు.
''అన్నయ్య ఎన్టీఆర్ చేతుల మీదుగా మా లక్ష్మీప్రసన్న పిక్చర్స్ సంస్థ ప్రారంభమైంది. ఆయనతో నేను 'మేజర్ చంద్రకాంత్'లాంటి ఓ గొప్ప సినిమాని నిర్మించడం మరిచిపోలేని అనుభవం'' అన్నారు ప్రముఖ నటుడు మోహన్బాబు. ఆయన నటించి నిర్మించిన చిత్రం 'మేజర్ చంద్రకాంత్'. ఎన్టీఆర్ ముఖ్య భూమిక పోషించారు. కె.రాఘవేంద్రరావు దర్శకుడు. ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి మంగళవారంనాటికి ఇరవయ్యేళ్లు పూర్తవుతాయి.
ఆ సినిమాలో అన్నగారు ఎన్టీఆర్తో కలిసి పనిచేయడం అనిర్వచనీయమైన అనుభూతినిచ్చిందని మోహన్బాబు పేర్కొన్నారు. మొదట ఎన్టీఆర్ను అన్నగారు అని పిలిచేవాడినని...కాలక్రమంలో అన్నయ్య అని పిలిచేంత సాన్నిహిత్యం ఏర్పడిందని అన్నారు. మిగతా వివరాలు..అరుదైన ఫోటోలతో ..స్లైడ్ షో...
''అన్నయ్య ఎన్టీఆర్ హీరోగా నటించిన 'సామ్రాట్ అశోక'లో నేనొక చిన్న పాత్ర చేశాను. ఓ రోజు సెట్లో ఉన్నప్పుడు 'అన్నయ్యా... నేను మీతో సినిమా నిర్మించాలనుకొంటున్నాను' అన్నాను. ఆ మాట వినగానే పెద్దగా నవ్వుతూ... 'నాతో సినిమా ఏమిటి? మీరు జోక్ చేస్తున్నారా?' అన్నారు. 'లేదు నిజంగానే చెబుతున్నాను, రాఘవేంద్రరావుగారు దర్శకుడు' అని చెప్పాను.
ఆయన రేపు మాట్లాడదాం అని చెప్పి వెళ్లిపోయారు. ఆ రోజు నాకు షూటింగ్ లేదు. కానీ సెట్కి వెళ్లి ప్రస్తావించాను. 'మొన్న జరిగిన ఎన్నికల్లో నేను గెలవలేదు. ఓడిపోయాను. ఇప్పుడు సినిమా ఏమిటి? ఎవరు చూస్తారు?' అన్నారు.
'మిమ్మల్నే చూడకపోతే ప్రేక్షకులు ఇంకెవరిని చూస్తారు? మీరు ఊ అనండి. నేను సినిమా తీస్తాను' అన్నాను. అప్పుడు 'సరే కథ తీసుకురండి' అన్నారు. అలా మేజర్ చంద్రకాంత్కి శ్రీకారం చుట్టాం''.
''సినిమా చిత్రీకరణ జరిగిన ప్రతీ క్షణం నాకు గుర్తే. సినిమా సెట్స్పైకి వెళ్లకముందే అన్నయ్యకీ, నాకూ మధ్య రెండు విషయాల మీద చర్చ జరిగింది. నాచారం రామకృష్ణ స్టూడియోకి రాఘవేంద్రరావుతో కలిసి ఉదయం 5 గంటలకు వెళ్లాను. 'చెప్పండి బ్రదర్' అన్నారు.
''అన్నయ్యా... ఎవరైనా సమయానికి రాకపోతే వాళ్లని ఏదైనా అంటుంటాను. అది మిమ్మల్ని అగౌరవపరిచినట్టు కాదు. అలాగే మీరు రాజకీయాల్లో ఉన్నారు. నేను కొద్దిమంది ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని మాత్రమే చూశాను. మీ కోసం ఎవరైనా వస్తే సెట్లో వాళ్లని మీరు కలుస్తారా? ముందుగానే ఆ రూల్స్ చెప్పండి'' అన్నాను.
లేదు బ్రదర్ షూటింగ్కి ఎవర్నీ రానివ్వను. వాళ్లతో సాయంత్రం కానీ, తెల్లవారుజామున కానీ మాట్లాడతాను అని చెప్పారు. ఆ తర్వాత నేను వెంట తీసుకెళ్లిన రూ.25 లక్షలు ఇస్తూ అడ్వాన్సుగా ఇది ఉంచండి అన్నయ్యా అన్నాను.
''మేం అడిగామా? మీరు మొదట సినిమా పూర్తి చేయండి'' అని అన్నారు. నేను వినకుండా మళ్లీ ఇవ్వబోయాను. ఆయన కోపంగా 'వద్దని చెబుతున్నాను కదా' అన్నారు. 'లేదు అన్నయ్యా... ఈ రోజు మంచి రోజు. మీరు డబ్బు తీసుకోండి' అన్నాను.
'మీ చేతికి ఎంతొస్తే అంత ఇవ్వండి' అన్నారు. నేను రెండు చేతులుపెట్టి డబ్బు తీశాను. రెండున్నర లక్షలకంటే ఎక్కువ రాలేదు. అంతే ఆ తర్వాత ఆయన ఎప్పుడూ అడగలేదు. ఆ తర్వాత నేను ఎంతిచ్చాను, ఆయన ఎంత తీసుకొన్నారు అనేది మాకు మాత్రమే తెలుసు''.
''చండీగఢ్లోని పాలంపూర్లో ఎక్కువభాగం షూటింగ్ జరిపాం. నిజమైన సైనికులతో సినిమాని తెరకెక్కించాలనుకొంటున్నామని, మీరు అక్కడకి రావాలని చెప్పాం. ఆయన సరే అన్నారు. పుణ్యభూమి నా దేశం పాటలో నిజమైన సైనికులతో కలిసి అన్నయ్య నటించిన విధానం తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఓ నిర్మాతగా ఆయనతో పనిచేసిన ప్రతి రోజూ నాకు ఇప్పటికీ గుర్తే. సెట్లో ఆయన ఎంతో సహకరించేవారు.
చివరి రోజు అన్నయ్య షూటింగ్ చేసి వెళుతుంటే మాకు అందరికీ ఏడుపొచ్చింది. ఇలాంటి క్షణాలు మళ్లీ వస్తాయా? ఈ కథంటే ఆయన ఒప్పుకొన్నారు. ఇలా ఇంకో సినిమా చేస్తారా? అంటూ మేం చాలా బాధపడ్డాం. సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. తిరుపతిలో బహిరంగ సభ ఏర్పాటు చేసి విజయోత్సవాన్ని నిర్వహించాం అన్నారు.