చెప్పుకోలేని విధంగా నన్ను చిత్రహింసలు పెట్టారు: అంజలి
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' హీరోయిన్ అంజలి వ్యాఖ్యలు చిత్రపరిశ్రమలో సంచలనం రేకెత్తిస్తున్నాయి. తనతో వస్తున్నది అమ్మ కాదని.. పిన్ని అంటూ కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. 'కట్రదు తమిళ్' చిత్రం ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయమైన నటి అంజలి. ఆ తర్వాత 'షాపింగ్మాల్', 'జర్నీ' లాంటి అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
ఇటీవలే వెంకటేష్ సరసన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లో నటించి విజయాన్ని దక్కించుకొంది. చిత్రీకరణలకు, సినీ, ఇతర ప్రైవేటు కార్యక్రమాలకు అంజలితోపాటు ఆమె అమ్మ అంటూ చెప్పుకునే భారతిదేవి వచ్చేది. తల్లీకూతుళ్ల కన్నా ఎంతో స్నేహంగా మెలిగేవారు. ఇదిలా ఉండగా హైదరాబాద్లో ఓ సినిమా చిత్రీకరణలో ఉన్న అంజలి సోమవారం కొన్ని తమిళ పత్రికలవాళ్లతో ఫోనులో సంభాషించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...
అంజలి మాటల్లోనే... మొదటిగా ఓ విషయాన్ని వివరించాలనుకుంటున్నా. మీరందరూ అనుకుంటున్నట్టు నాతో వస్తున్నది మా అమ్మ కాదు. ఆమె నా పిన్ని. అలాగే చెన్నైలో ఉన్నది నా సొంత కుటుంబీకులు కాదు. మా పిన్ని కుటుంబీకులే వారంతా. ఆంధ్రలో ఉన్నవారిని చెన్నైకి తీసుకొచ్చింది నేనే. వారి కుటుంబానికి నేనెంతో సహకరించాను. కానీ నాకు తెలియకుండా.. నా వెనుక గోతులు తవ్వారు. ఎన్నో కుట్రలు పన్నారు. కోట్లాది రూపాయలను స్వాహా చేసేశారు అంది.
అరాగే ఇందులో పిన్నితోపాటు తమిళ దర్శకుడు, నటుడు కలంజియం హస్తం కూడా ఉంది. వీరిద్దరూ కలసి నన్ను ఓ ఏటీఎమ్లా వాడుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నా. నాపై తప్పుడు ప్రచారం చేసేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే.. ప్రస్తుతం నా ప్రాణానికి ముప్పుంది. నా శరీరంపై చిన్న గాయమైనా అందుకు నా పిన్ని, దర్శకుడు కలంజియంలే కారణం. సినిమా ద్వారా నేను సంపాదించిన డబ్బంతా వారే దోచేశారు. ప్రస్తుతం ఖర్చులకు కూడా నా దగ్గర డబ్బుల్లేవు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాను''అన్నారు.


Click it and Unblock the Notifications












