అన్నపూర్ణ స్టూడియో ఆస్తుల జప్తుపై నాగార్జున సంప్రదింపులు
హైదరాబాద్: తమకు చెల్లించాల్సిన రూ. 62 కోట్ల అప్పు చెల్లించక పోవడంతో అన్నపూర్ణ స్టూడియోకు సంబంధించిన 7.25 ఎకరాల భూమిని అధికారులు జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బ్యాంకు అధికారులతో అక్కినేని కుటుంబీకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అప్పు చెల్లించి ఆస్తులను తిరిగి పొందడానికి అక్కినేని ఫ్యామిలీ ప్రయత్నిస్తోంది.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని సెవెన్ ఎకర్స్ స్టూడియో విస్తరణ కోసం అక్కినేని కుటుంబం ఆంధ్రాబ్యాంకు నుంచి 32.3 కోట్లు, ఇండియన్ బ్యాంకు నుంచి 29.7కోట్లు రుణంగా తీసుకుంది. అయితే వీటిని సకాలంలో తిరిగి చెల్లించలేదు. దీంతో బకాయిపై 2014 జనవరి 2న బ్యాంకు అధికారులు డిమాండ్ నోటీసులను జారీచేశారు.

వాటికి రుణగ్రహీతలు, తనఖాదారులు స్పందించకపోవడంతో సోమవారం స్టూడియో వద్దకు చేరుకున్న ఆయా బ్యాంకుల అధికారులు స్టూడియోకు చెందిన ఆస్తులను జప్తు చేయడానికి నోటీసులు జారీ చేశారు. రుణగ్రహీతల్లో అన్నపూర్ణ స్టూడియోస్ ఎండీ నాగార్జునరావు అక్కినేని, వెంకట్ నారాయణరావు అక్కినేని, సంస్థ డైరెక్టర్లు వై సుప్రియ, నిమ్మగడ్డ ప్రసాద్, నాగసుశీల, వెంకటేశ్ రొడ్డం ఉన్నట్లు వారు నోటీసుల్లో పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న స్థలానికి సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరుపరాదని అధికారులు ఆదేశించారు.

పుకార్లు ప్రచారంలోకి...
ఈ పరిణామాల నేపథ్యంలో ఫిల్మ్ నగర్లో పలు పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత అక్కినేని ఫ్యామిలీ కొన్ని పరిస్థితుల కారణంగా హైదరాబాద్ నుండి వైజాగ్ షిప్టవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఆస్తులు అమ్మినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. వైజాగ్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశాలు ఉండటంతో....అక్కినేని ఫ్యామిలీ అక్కడే సెటిలవ్వడానికి ఆసక్తి చూపుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను అక్కినేని కుటుంబ సన్నిహితులు కొట్టిపారేసారు.


Click it and Unblock the Notifications











