పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే ఇది..అసెంబ్లీలోకి సందర్శకులకు ప్రవేశం రద్దు . సీఎం ఫ్యామిలీకైనా నో ఎంట్రీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో జనసేన , అధినేత, బీజేపీ కూటమి కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే వీరిద్దరూ సచివాలయంలో బాధ్యతలు సైతం స్వీకరించారు. ఎన్నికల్లో హామీలుగా ఇచ్చిన పెన్షన్ పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు సంతకాలు చేశారు.
ఇక ఈ ఎన్నికలకే ప్రత్యేక ఆకర్షణగా నిలించి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చి గేమ్ ఛేంజర్గా, కింగ్ మేకర్గా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మన్ననలు పొందుతున్న పవన్ కళ్యాణ్ సైతం డిప్యూటీ సీఎం హోదాలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ పవన్ కళ్యాణ్ తొలి సంతకం చేశారు.

బాధ్యతల స్వీకరణ నాడు కేవలం సంతకాలతోనే సరిపెట్టలేదు పవన్ .. తన శాఖలపై ఐఏఎస్ అధికారులతో రివ్యూ చేశారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. గ్రామాల్లో మౌలిక వసతులు, మంచినీటి కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు. అంతేకాదు.. 3 నెలల్లో సమస్యలను పరిష్కరించాలని డెడ్ లైన్ సైతం విధించారు. తొలి రోజే ఏకంగా 10 గంటలపాటు సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్.. తాను మిగిలిన రాజకీయ నాయకుల మాదిరి కాదనే సంకేతాలు పంపారు. అపార అనుభవం ఉన్న అధికారులే ఆయన స్పీడ్ , సబ్జెక్ట్లపై అవగాహన చూసి ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదు.

మరోవైపు రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు సభా కార్యక్రమాలు జరగనుండగా.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉంటాయి. ప్రొటెం స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు. ఆయన కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే ఎన్నడూ లేనివిధంగా అసెంబ్లీ సమావేశాలపై బజ్ నెలకొంది. బంపర్ మెజారిటీతో కూటమి అధికారంలోకి రావడంతో పాటు పరాజయం తర్వాత జగన్ ఇంత వరకు పబ్లిక్లో కనిపించలేదు. ఆయన తొలిసారిగా రేపు రాష్ట్ర ప్రజలకు కనిపించనున్నారు.
ఇక అన్నింటికి మించి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే హోదాలో తొలిసారిగా శాసనసభలో అడుగుపెడుతున్నారు. పార్టీని స్థాపించి శాసనసభ్యుడు కావడానికి పవన్కు పదేళ్లు పట్టింది. ఈ కాలంలో ఎన్నో చీత్కారాలు, అవమానాలను అనుభవించారు. కొందరు వైసీపీ నేతలైతే పవన్ అసెంబ్లీ గేటు కూడా తాకలేరంటూ ఘాటు వ్యాఖ్యలతో విమర్శించారు. అన్నింటిని భరించి ప్రజా సమస్యలపై పోరాడుతూనే పిఠాపురం నుంచి దాదాపు 70 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించి ఎమ్మెల్యే సాబ్ అనిపించుకున్నారు.

తమ అభిమాన నాయకుడు అసెంబ్లీలో అధ్యక్షా అనడం చూడాలని లక్షలాది మంది జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దీంతో ఆయనను చూడటానికి అసెంబ్లీకి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది. వీరందరినీ ఆపడం భద్రతా సిబ్బంది వల్ల కాదు. దీనిని దృష్టిలో ఉంచుకునే ముందు జాగ్రత్త చర్యగా ..విజిటింగ్ పాసులను రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు ప్రకటించారు.

ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులైనా సరే పాస్లను ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పేశారు. అధికారుల నిర్ణయంతో పవన్ అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ప్రత్యేకించి మెగా కుటుంబానికి చెందిన కొందరు పవన్ను అసెంబ్లీలో చూడాలని ముచ్చట పడ్డారు. కానీ వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లినట్లయ్యింది. అయితే టీవీలలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పవన్ను ఎమ్మెల్యే హోదాలో చూసుకోవచ్చని వారు సంతృప్తి చెందుతున్నారు.


Click it and Unblock the Notifications











